పైకప్పు పెచ్చులూడి పడి విద్యార్థులకు గాయాలు
Published Saturday, 23 July 2016కోహెడ, జూలై 22: మండలంలోని శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గది పైకప్పు పెచ్చులూడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలైన సంఘటన శుక్రవారం సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిత్యం లాగానే పాఠశాలకు హాజరైన పదవ తరగతి విద్యార్థులు తరగతి గదిలో 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి పడడంతో కడార్ల తేజశ్రీ, గుడ్ల రజిత, చల్ల శివాని అనే ముగ్గురు విద్యార్థినులపై పడడంతో తలకు, చేతులకు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్ ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు హెచ్ఎం చంద్రశేఖర్ తెలిపారు. గాయాలు పెద్దగా కాకపోవడం, ఎలాంటి ప్రాణనష్టం కాకపోవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నా తిరిగి భవనంలోకి వెళ్లాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు జంకుతున్నారు. 2010-11లో ఆర్ఎంఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన భవనం నాణ్యతా లోపం వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను డిఇఓకు సమర్పించినట్లు ఎంఇఓ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.