పెల్లెట్ గన్లను వాడొద్దు: కాంగ్రెస్
Published Sunday, 24 July 2016న్యూఢిల్లీ, జూలై 23: కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితి పట్ల కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రజలపై పెల్లెట్ తుపాకులను ప్రయోగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాశ్మీర్ అంశంపై చర్చించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు లోక్సభలో కాని, అటు రాజ్యసభలో కాని లేరని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శనివారం ఇక్కడ విమర్శించారు. దీన్నిబట్టి ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం కాశ్మీర్ ప్రజల పరిస్థితిపై ఏమాత్రం ఆందోళన చెందడం లేదని స్పష్టమవుతోందని ఆజాద్ ధ్వజమెత్తారు. 16 రోజుల తరువాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం కాశ్మీర్ పర్యటనకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు.