డబుల్ మోసం
Published Sunday, 24 July 2016హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ల పేరుతో మోసం వెలుగుచూసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అరెస్టయిన నలుగురు నిందితుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. నిందితుల నుంచి రూ. 10.40 లక్షలు నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కంబంకు చెందిన బొమ్మాని మాబూని అలియాస్ మున్ని రంగారెడ్డి జిల్లా అల్మాస్నగర్ సివైఆర్ కాలనీలో నివాసముంటుంది. జీడిమెట్ల అంగడిపేటకు చెందిన మాడిశెట్టి సతీష్కుమార్, సికిందరాబాద్లోని బైబిల్ హౌస్ ప్రాంతవాసి మాడిశెట్టి అమరావతి, ఫలక్నుమాకు చెందిన మహమ్మద్ తాజుద్దీన్తో పరిచయం చేసుకుంది. తెలంగాణ దేవాదాయ శాఖలో ఓ ఉన్నతస్థాయి అధికారిణిగా పనిచేస్తున్నానంటూ నమ్మించింది. తనకు సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్కు చెందిన అధికారులతో మంచి సంబంధాలున్నాయంటూ నమ్మబలికింది. నగరంలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానంటూ చెప్పడంతో పరిచయమైన ముగ్గురితో దరఖాస్తులు తేవాలని, ఒక్కో దరఖాస్తుకు రూ. 5వేలు కమిషన్ ఇస్తానంటూ ఒప్పుకుంది. దీంతో సతీష్కుమార్, అమరావతి, తాజుద్దీన్లు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమాయక ప్రజలను నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 20వేల నుంచి రూ. 30 వేలు వసూలు చేశారు. ఇప్పటి వరకు నగరవ్యాప్తంగా 110 మంది వద్ద డబ్బులు సుమారు రూ. 30 లక్షల మేరకు వసూలు చేశారు. తమ కమిషన్ తీసుకొని మిగతా డబ్బు మున్నికి ముట్టజెప్పారు. డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు తీసుకున్న వీరు కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. తాము మోసపోయామంటూ బాధితులు టాస్క్ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 10.4 లక్షలు నగదుతోపాటు నాలుగు ప్యాసింజర్ ఆటోలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి తెలిపారు. వీరిపై ఐపిసి 416, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం చిలకలగూడ పోలీసులకు అప్పగించినట్టు డిసిపి వివరించారు.
చిత్రం.. నిందితులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు