కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్, పాక్ సౌహార్ద్రత అవసరం
Published Sunday, 24 July 2016ఐక్యరాజ్య సమితి, జూలై 23: భారత్, పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఆ రెండు దేశాలతో పాటు సభ్య దేశాల సౌహార్ద్రత అవసరమని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘సభ్య దేశాల సౌహార్ద్రత లేకుండా సమస్యను ఎలా పరిష్కరించగలం’ అని కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ జీన్-పాల్ లాబోర్డే అన్నారు. ‘ముందస్తు దౌత్యం, వివాద పరిష్కారం విషయంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటంటే సంబంధితులను ఒక చోటికి తెచ్చి వారితో మాట్లాడడాన్ని కొనసాగించడం. ఏదో ఒక రోజు ఈ సమస్యను పరిష్కరించగలమని, అలాగే ఉగ్రవాద చర్యలను తగ్గించగలమని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఉగ్రవాదం అనేది ప్రపంచ సమస్య అని, దీన్ని ఎదుర్కోవాలంటే సమగ్రమైన, సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ సరిహద్దుల విస్తరణ, దాని సైనిక బలం ఇటీవలి కాలంలో తగ్గినప్పటికీ అది ఒక నిజమైన ఉగ్రవాద సంస్థగా రూపు దిద్దుకొంటోందని లాబోర్డే చెప్పారు.