సుప్రజకు అంత్యక్రియలు
Published Sunday, 24 July 2016ఆర్మూర్, జూలై 23: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ నెల 14వ తేదిన మృతి చెందిన సుప్రజ(31), నాలుగు నెలల వయసు గల ఆమె కుమారుడు శ్రీహాన్ల మృతదేహాలు శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చేరుకున్నాయి. అయితే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. మెల్బోర్న్లో సుప్రజ, కుమారుడు శ్రీహాన్లు ప్రమాదవశాత్తు వారు నివసించే భవనంపై నుంచి కింద పడి మృతి చెందారు,. కాగా మృతదేహాలు శుక్రవారం రాత్రి హైదరాబాద్ శంషాబాద్ విమానశ్రయానికి చేరగా, అక్కడి నుంచి మృతదేహాలను కుటుంబ సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల వారి నివాస గృహానికి తరలించారు. మృతదేహాలు ఇంటికి చేరుకోవడంతో భర్త శ్రీనివాస్, కుమార్తె సహస్ర, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి నివాస ప్రాంతం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసింగ్, ఇతర ప్రముఖులు మృతుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.