పెరిగిన గోదావరి నీటి మట్టం
Published Sunday, 24 July 2016ధర్మపురి, జూలై 23: గోదావరి పరివాహక ఎగువన కురిసిన వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు నుండి నీటిని నిరంతరంగా గోదావరిలోకి వదులుతుండడంతో శనివారం నది నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. కడెం ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి 700 అడుగులు, 7.603 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం కాగా, శుక్రవారం రాత్రి నుండి 696.700 అడుగుల ఎత్తును స్థిరంగా ఉంచుతూ, 8వ నెంబరు గేట్ ద్వారా అధికమైన నీటిని వదుదులుతుండడంతో కరీంనగర్ జిల్లా ధర్మపురి, రాయపట్నం ప్రాంతాలలో నీటిమట్టం అధికమైంది. దిగువన గల ఎల్లంపెల్లి (శ్రీపాద) ప్రాక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో బ్యాక్ వాటర్ వల్ల కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాను అనుసంధానించే రాయపట్నం లోలెవల్ వంతెనను తాకుతూ నదినీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తులై, వంతెన పైనుండి ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తూ, వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. శనివారం రాత్రి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పికెట్తో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.