చెన్నైలో విజయనగరంవాసుల మృతి
Published Sunday, 24 July 2016సీతానగరం, జూలై 23: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలసవెళ్లిన యువకులు ఊహించని రీతిలో మృత్యువాత పడిన సంఘటన చెన్నైలోని పెరుంబూర్లో చోటుచేసుకుంది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పువ్వల రామకృష్ణ (23), పత్తి సత్యనారాయణ (21), చప్ప వినయ్కుమార్ (22) చెన్నైలోని సంగీత వెజ్ రెస్టారెంట్లో విధి నిర్వహణలో శనివారం ప్రమాదవశాత్తు మృతి చెందారు. రామకృష్ణ తల్లిదండ్రులు శంకరరావు, సరస్వతి ఫోన్లో గ్రామస్థులకు ఈ మేరకు సమాచారం అందించారు. రెస్టారెంట్లో విధులు ముగించుకొని రామకృష్ణ ఇంటికి వెళ్తున్న సమయంలో డ్రైనేజీలో సమస్య తలెత్తడంతో రెస్టారెంట్ యాజమాన్యం రామకృష్ణను నీటి సరఫరాకు సంబంధించి పనులు చేయమంది. రామకృష్ణ డ్రైనేజీలో దిగి ఎంతకీ రాకపోవడంతో సహచరులైన వినయ్కుమార్, సత్యనారాయణ కూడా అందులోకి దిగారు. వారు కూడా పైకి రాకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తక్షణ సహాయ చర్యలు చేపట్టడంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసింది.