మాజీ మంత్రి జివి శేషు కన్నుమూత
Published Sunday, 24 July 2016ఒంగోలు అర్బన్, జూలై 23: రాష్ట్ర మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు (71) శనివారం తెల్లవారుజామున ఒంగోలులో గుండెపోటుతో కన్నుమూశారు. శేషు 1989 నుండి 94 వరకు సంతనూతలపాడు శాసనసభ్యునిగాను, 1989 నుండి 90 వరకు మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పాడి పరిశ్రమ, క్రీడలు, లిడ్క్యాప్ శాఖ మంత్రిగా పని చేశారు. 2007-09 వరకు శాసనమండలి సభ్యునిగా పని చేశారు. 2009లో కొండెపి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్వాదిగానే కొనసాగుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం పది గంటలకు సమాధుల తోటలో అధికార లాంఛనాలతో జరగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖులతోపాటు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి మాట్లాడుతూ జివి శేషు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.