లొసుగులమయం పోలవరం పునరావాసం
Published Sunday, 24 July 2016రాజమహేంద్రవరం, జూలై 23: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం లొసుగులమయంగా మారుతోంది. నిర్వాసితుల నుంచి తీసుకున్న భూమికి భూమి కేటాయిస్తామనే హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో గిరిజనుల నుండి 57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకూ ఆ భూమికి భూమి కేటాయించలేదు. 2014 జనవరి 10వ తేదీ నాటికి భూమికి భూమి గానీ, నష్టపరిహారం గానీ చెల్లించకపోతే పాత పద్ధతుల్లో జరిగిన భూసేకరణ రద్దవుతుంది. జి ఓ నెంబర్ 68 ప్రకారం చెల్లించిన పరిహారం కూడా రద్దవుతుంది. ఈ మేరకు నిర్వాసితులందరికీ కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సి వుంది. అంగుళూరు గ్రామ గిరిజనులకు ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.50వేలు, రవాణా చార్జీలు రూ.5000, గిరిజన ప్రత్యేక జీవనభృతి కింద రూ.56 వేలు, నిర్వాసిత భృతి కింద రూ.26,880 చెల్లించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.1,40,880 ఇచ్చారు. భూమిలేని వారికి అదనంగా మరో రూ.40 వేలు ఇచ్చారు. ఈ మొత్తమంతా ఒక్క గృహనికే సరిపోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.