ప్రభుత్వానికి పోలీస్శాఖలో సంస్కరణలు
Published Sunday, 24 July 2016విజయవాడ, జూలై 23: పోలీస్ శాఖలో కేవలం 60 రోజుల్లోనే చూడదగ్గ మార్పులు ప్రజలకు కనిపించేలా తాను చర్యలు చేపట్టనున్నానని ఇన్చార్జి డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం డిజిపి క్యాంప్ కార్యాలయంలో జెవి రాముడు నుంచి బాధ్యతలు స్వీకరించిన తదుపరి పోలీస్ ఉన్నతాధికారులు, 13 జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలను సమీక్షించారు. ముందుగా పోలీస్ అధికారులందరినీ తన గ్రూప్ యాప్లోకి తీసుకుని దినవారీ తమ తమ పరిధుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నది తెలుసుకోగలనని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రతి అధికారిని పిలిచి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడింపచేసారు. పోలీస్ అధికారులందరూ క్రమశిక్షణతో ఒకరికొకరు పరస్పర సహకారంతో ఒకరి అభిప్రాయాలను మరొకరికి తెలుపుకుంటూ ఎదుటివారి సలహాలను కూడా అందుకుంటూ ఎపి పోలీసింగ్కు పేరు ప్రతిష్ఠలను సముపార్జింపచేయాలని కోరారు. వకృష్ణా పుష్కరాలను విజయవంతం చేసే బాధ్యతను ప్రతిఒక్కరూ తమ భుజస్కంధాలపై వేసుకోవాలన్నారు. హైదరాబాద్లో పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని తక్షణం విజయవాడకు తరలింపచేయగలనని నండూరి స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 830 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఫిర్యాదు చేసేందుకు ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరూ సంతృప్తికరంగా వెళ్లేలా చర్యలు చేపట్టబోతున్నానని స్పష్టం చేశారు.
చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఇన్చార్జి డిజిపి సాంబశివరావు