ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తా
Published Sunday, 24 July 2016నార్త్సౌండ్ (ఆంటిగ్వా), జూలై 23: ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడమే తనకు ఎంతో ఇష్టమని, అదే తన దీర్ఘకాలిక లక్ష్యమని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. వెస్టిండీస్తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్ సెంచరీ చేయడం తెలిసిందే. అంతేకాదు, అయిదో వికెట్కు కోహ్లీతో కలిసి 168 పరుగులు జోడించాడు. అశ్విన్కు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. ‘్భరత జట్టులో టాప్ సెవన్లో బ్యాట్ చేయాలనేది నా కోరిక. అది దీర్ఘకాలకంగా నా లక్ష్యం కూడా. అందుకోసం నేను చాలా కాలంగా శ్రమిస్తూ వస్తున్నాను’ అని అశ్విన్ చెప్పాడు. కాగా, తనపై నమ్మకం ఉంచి తనను ఆరో స్థానంలో బ్యాటింగ్కు పంపించిన కెప్టెన్ కోహ్లీకి, చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేకు కృతజ్ఞలు చెప్పాడు. అంతేకాదు గతంలో తాను బాగా బ్యాట్ చేసినప్పుడు సైతం ప్రమోషన్ లభించని సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పాడు. మీ బ్యాటింగ్ ఎలా మెరుగుపడిందని అడగ్గా, అన్నిటికన్నా ముఖ్యంగా సంజయ్ బంగార్(బ్యాటింగ్ కోచ్) తన స్టాన్స్ను మార్చుకునేందుకు ఎంతో కృషి చేశాడ, క్రీజ్లో ఎక్కువ సేపు ఉండడానికి ఇది చాలా తోడ్పడిందన్నాడు. వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ బౌలింగ్లో తాను తడబడినప్పుడు కోహ్లీ వచ్చి తనకు ధైర్యం చెప్పాడన్నాడు. కాగా, టెస్టుల్లో తాను సెంచరీ చేసిన మూడు సార్లు ఓ ఫ్రంట్లైన్ బ్యాట్స్మన్ తనతో ఉన్నాడని అశ్విన్ చెప్పాడు. ఒక సారి రోహిత్ ఉంటే రెండు సార్లు కోహ్లీ ఉన్నాడని చెప్తూ, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ తన బ్యాటింగ్ మెరుగుపర్చుకుని సెంచరీ చేయాలంటే అది చాలా ముఖ్యమని అతను చెప్పాడు. కాగా, పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్లాగా కనిపిస్తోందని, ప్రతి వికెట్ సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని అశ్విన్ అన్నాడు. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ, అశ్విన్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 8 వికెట్లకు 566 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసే వేళకు విండీస్ ఒక వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో బ్రాత్వైట్, డారెన్ బ్రావో లాంటి మంచి బ్యాట్స్మన్ ఉన్నారని అంటూ, ఆ జట్టును రెండు సార్లు ఆలౌట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు.