దేశ సమగ్రతకు క్రీడలు ఓ మార్గం
Published Sunday, 24 July 2016న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తూ, జాతీయ సమగ్రతకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. దేశంలోనే వివిధ నగరాల్లో నిర్వహించే అతి పెద్ద స్కూల్, కాలేజి క్రీడల పోటీలుగా భావిస్తున్న రిలయెన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని శనివారం ఇక్కడ డిజిటల్గా ప్రారంభిస్తూ యువకులు బలమైన వ్యక్తులుగా తయారవ్వాలంటే క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలన్నారు. ‘మన దైనందిన జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండడం కోసం క్రీడలు అవసరమని కొంతమంది భావిస్తుంటారు. అయితే ఒక వ్యక్తి సమగ్రాభివృద్ధికి క్రీడలు ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని మోదీ అన్నారు. మనది చాలా పెద్ద, భిన్న సంస్కృతులున్న దేశమని, జాతీయ సమగ్రతకు క్రీడలు ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని అన్నారు. కేంద్ర యువజనుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం స్ఫూర్తిగా రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. తొలి సంవత్సరం ఎనిమిది నగరాల్లో నాలుగు కేటగిరీలు- జూనియర్ బాలురు( 7-10 ఏళ్లు), సీనియర్ బాలురు (11-12 ఏళ్లు), సీనియర్ బాలికలు(11-12 ఏళ్లు), కాలేజి బాలురు( గ్రాడ్యుయేట్ సంస్థలు)-లో ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు ఆగస్టులో ప్రారంభమయ్యే సిటీ క్వాలిఫైయర్లలో, ఆ తర్వాత ఆక్టోబర్/నవంబర్లో జరిగే సిటీ చాంపియన్షిప్స్లో, ఆ తర్వాత జనవరి/్ఫబ్రవరిలో జరిగే ఫైనల్స్లో పాల్గొనాల్సి ఉంటుంది.