విజృంభించిన షమీ
Published Sunday, 24 July 2016నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 23: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో విరుచుకుపడి కరీబియన్ల వెన్ను విరిచాడు. అతని జోరును ప్రతిఘటించడంలో వెస్టిండీస్ బ్యాట్స్మన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ దిశగా దూసుకెళ్తోంది. ఒక వికెట్ నష్టానికి 31 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు విండీస్ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నైట్ వాచ్మన్ దేవేంద్ర బిషూ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్లో వికెట్ల వెనుక వృద్ధిమాన్ సాహా చేతికి చిక్కగా, అతని స్థానంలో వచ్చిన డ్వెయిన్ బ్రావో (11) స్వల్ప స్కోరుకే షమీ బౌలింగ్లో సాహాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 90 పరుగులు సాధించి మధ్యాహ్న భోజన విరామ సమయానికే 3 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టును ఆ తర్వాత కూడా కష్టాలు వెంటాడాయి. 48వ ఓవర్లో సీనియర్ బ్యాట్స్మన్ మర్లాన్ శామ్యూల్స్ (1)ను పెవిలియన్కు పంపిన షమీ అదే ఓవర్ చివరి బంతికి జెర్మయిన్ బ్లాక్వుడ్ (0)ను కూడా పెవిలియన్కు చేర్చాడు. దీంతో 92 పరుగుల స్కోరు వద్దే మరో రెండు వికెట్లు చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే 156 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్న ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్ (53), రోస్టన్ చేస్ (10) స్థిమితంగా ముందుకు సాగుతున్నారు. దీంతో కడపటి వార్తలు అందే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 108 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు టీమిండియా కంటే ఇంకా 458 పరుగులు వెనుకబడి ఉంది.
చిత్రం.. మహమ్మద్ షమీ (4/35)