హృద్యంగా రూపుదిద్దుకున్న పద్యకావ్యం!
Published Sunday, 24 July 2016పేజీలు: 40 - వెల : 30/-
ప్రతులకు:
కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం
జగిత్యాల,
సెల్.నం.9492457262
**
ఛందోబద్ధ పద్యాలు రాయడంలో సిద్ధహస్తులు.. పద్యకవి శిరోమణి, కవి రాజహంస బిరుదాంకితులు సూర్యశ్రీ కలం పేరుతో భాసిల్లే కవి కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం తన ఐదో పద్యకావ్యంగా ‘శ్రీ సరస్వతీ శతకము’ను పాఠకలోకానికి అందిస్తున్నారు. సుబ్రహ్మణ్యం పద్య రచన ఇందులో హృద్యంగా సాగింది. ‘శ్రీ సరస్వతీ! మముగటాక్షింపుమమ్మ!’ అన్న మకుటంతో రాసిన పద్యాలు అక్షర రమ్యతతో రూపుదిద్దుకున్నాయి. తేట గీతుల్లో రాయబడిన ఇందలి పద్యాలు కవి సుబ్రహ్మణ్యం యొక్క రచనా వైచిత్రికి అద్దం పట్టేలా వున్నాయి.. అమ్మవారిని వివిధ పేర్లతో స్తుతించి రాసిన ఈ పద్యాలు భావయుక్తంగా కొలువుదీరాయి!
శ్రీ సరస్వతీ! చిన్న పిల్లల చేత పలకలపై ముచ్చటగా శ్రీకారాన్ని చుట్టించి నీకు మ్రొక్కే వారినందరినీ కటాక్షింపుమని వేడుకున్నారు. పలుకు పలుకులో తేనెలొలికేలా.. మదిలో చక్కటి భావాలు పరుగెత్తేలా ఆయన కలం శరవేగంతో కదిలేలా అనుగ్రహించుమని శ్రీ సరస్వతి మాతను అర్థించారు.
బలమునిడితివి నా చేతి కలమునకును
నేర్పుమీరగ నల్లిక నేర్పినావు!
ఎంత దయగలదానవో! యమ్మనీవు
శ్రీ సరస్వతీ! మముగటాక్షింపు మమ్మ! అంటూ శ్రీ సరస్వతీ మాతను నేడుకున్నారు.
మనుష్యులకు అందానిచ్చేవి ఆభరణాలు కావనీ..వస్త్రాల వల్ల విలువ అసలే పెరుగదనీ.. విద్యతోనే లోకం ప్రకాశమానం అవుతుంది కనుక విద్యాబుద్ధులు ప్రసాదించుమని మరో పద్యంలో అమ్మవారిని ప్రార్ధించారు.
అంతటితో ఆగక కవి ఇంకొక పద్యం ద్వారా వివాహానంతరం భార్యలను కష్టాల కడలిలోకి త్రోసివేసే వారికి సద్బుద్దులు ప్రసాదించుమని శారదా మాతను అభ్యర్థించారు. శ్రీ వాగ్దేవీ! నీవు దయచూపితే.. మూగవాని గొంతు నుండి కూడా శ్రావ్యమైన స్వరఝరి పరుగు పెడుతుందని వ్రాయడం అమ్మవారి పట్టు కవి యొక్క శ్రద్ధ్భాక్తులు కానవస్తాయి! కవి కాంక్షించినట్లు శ్రీ సరస్వతీ అమ్మవారి కటాక్ష వీక్షణా తరంగాలు అందరిపై ప్రసరించాలని అభిలషిద్దాం.