కోచ్లలో ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ
Published Sunday, 24 July 2016హైదరాబాద్, జూలై 23: మహానగరవాసులు తక్కువ సమయంలో, అతి తక్కువ ఛార్జీలకే ఎక్కువ దూరం, ఎంతో సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా అందుబాటులోకి రానున్న మెట్రోరైలు వ్యవస్థకు ఎంతో ఎంతో పటిష్టమైన సిసిటీవి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మెట్రో ఎండి డా.ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ(ఎన్ఐఎస్ఏ)లో శనివారం ‘వ్యక్తిగత వౌలిక వసతుల భద్రత’ అంశంపై నిర్వహించిన వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ఎన్నో ఆధునిక విధానాలను అవలంభిస్తుందని వివరించారు. ఒకవైపు ఉగ్రవాదం కూడా పెరుగుతుండటంతో వారు ఎపుడు ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నందున, అలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని, ప్రమాదాలను పసిగట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం పోలీసు విభాగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జోడించి ఆధునీకరించిన సంగతి తెలిసిందే! అంతేగాక, సిటీ మొత్తాన్ని కూడా సిసిటీవి నిఘా పరిధిలోకి తీసుకురావటంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలను చేస్తోందని వివరించారు. ఇదే తరహాలో మెట్రోరైలులో కూడా కోచ్లోనే గాక, స్టేషన్లు, స్టేషన్ల ఆవరణల్లోనూ ఎంతో పటిష్టమైన సిసిటీవి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు, వాటిని వైర్లెస్ ప్రతిపాదిత సిగ్నలింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మెట్రోరైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రత ఎప్పటికపుడు పరిశీలించేందుకు వీలుగా ఆధునిక వ్యవస్థలను ఇప్పటికే సిద్దం చేసినట్లు ఆయన వివరించారు. మెట్రోకోచ్లలో అనుమానాస్పదంగా కన్పించే వ్యక్తులను ముందుగానే గుర్తించి, ముందు రానున్న పోలీస్స్టషన్కు సమాచారం అందించేలా ఆటోమెటిక్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు డా.ఎన్వీఎస్రెడ్డి వివరించారు. ఈ వర్క్షాప్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు డిజి మేజర్ జనరల్ ఆర్.కె. బగ్గా, పోలీసు ఉన్నతాధికారి తేజ్దీప్ కౌరీ మెనన్, రిటైర్డు డిజిపిలు కమల్కుమార్, రామ్ అవతార్ యాదవ్, ఎన్ఐఎస్ఏ డిఐజి టి. విక్రమ్తో పాటు డిఫెన్స్, నేషనల్ పోలీస్ అకాడమీ, ఇసిఐఎల్, ఐఐఐటిలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.