సాహిత్య వైకల్యాలు (స్పందన)
Published Monday, 25 July 2016ఈ నెల 11వ తేదీ సాహితిలో ‘అది చపలచిత్త చార్వాకమే’ అంటూ సాంధ్యశ్రీగారు రకరకాల ‘వాద సాహిత్యాలు’ గురించి క్లుప్తంగా అయినా సవివరంగా నిరసించారు. కులాలు, మతాలు, ప్రాంతాల అవలంబనగా, ఇంకా స్ర్తివాద సాహిత్యం అంటూ వెర్రిమొర్రి అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు వంటివి వైషమ్యాలతో కూడుకున్నవని ఇంతవరకూ, బహుశా ఎవరూ చెప్పలేనంత స్పష్టంగా, నిర్దుష్టంగా వారు వివరించారు. ‘సదరు సాహిత్యాలు’ సృష్టించేవారికి కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, గురజాడ, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహుల రచనలలో మానవతావాదం, అభ్యుదయవాదం, విప్లవవాదం వంటివి కనిపించవు.
సాహిత్యానికి సాహితీ ప్రక్రియలు ముఖ్యం. (కథ, నవల, నాటకం, కవిత, కావ్యం వంటివి). అంతేకాని ‘వాద సాహిత్యాలు’ ఎంతమాత్రమూ కాదు. రాజు రాజ్యానికి, కవి భాషకి (్భవ వ్యక్తీకరణకి) నిరంకుశులు. ‘రవి గాంచనిది కవి గాంచును’ అన్న సూక్తి అక్షరసత్యం. కలకాలం నిలుస్తుంది. ‘ననృషిః కురుతే కావ్యం?’ అన్నట్లుగా ‘వాద సాహిత్యాలతో’ విషాగ్నిని చిమ్మేవారికి పక్షపాత ధోరణే తప్ప ‘సత్యశోధన, సత్యసాధన’ అన్న దృక్పథం అలవడదు. సాహిత్యంలో ‘వాద సాహిత్యాలను’ అరికట్టలేకపోవచ్చు. కాని సాంధ్యశ్రీగారు పేర్కొన్నట్లుగా అక్రమ ప్రయోజనమే అటువంటి వారి వికృత సాహిత్యానికి పర్యంక భాగం అవుతుంది.
ఈ సందర్భంలో నాదొక మనవి (స్థాయి అంటూ ఏదీ లేకపోయినా). నా అభిప్రాయంలో సాహిత్యం రెండే రకాలు - 1. సాహిత్యం, 2. బాలల సాహిత్యం. ఈ రెండూ ఒకదాంట్లో మరొకటి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు (పాత్రలను బట్టి). ఈ రెండు రకాల సాహిత్యాలకి అంశాలు, ప్రక్రియలు ఏవైనా కావచ్చును. కాని రాగద్వేషాలు ఆయా పాత్రలను బట్టి అవసరమైన మేరకు ఉండాలే తప్ప కుల, మత, లింగ, ప్రాంతాల వంటి వాదాలతో మాత్రం కూడి ఉండకూడదు.