మానవాళికి జీవనాధారం మొక్కలు
Published Monday, 25 July 2016భూత్పూర్, జూలై 24: మానవాళికి జీవనాధారమైన మొక్కలను ప్రతి ఒక్కరు నాటాలని జిల్లా ఫారెస్టు అధికారి రాంమూర్తి అన్నారు. మండలంలోని అమిస్తాపూర్ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్బంగా డిఎఫ్ఓ రాంమూర్తి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి 10 మొక్కలను నాటాలని, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు, ప్రతి నియోజక వర్గంలో 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. నాటి మొక్కను సంరక్షించుకోవాలని, మొక్క రాబోయే తరాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గృహకల్పలో అవసరమైన మొక్కలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంత ప్రజలకు మొక్కల నాటడంతో కలిగే ప్రయోజనాలు తెలియజేయాలని కాలని వాసులకు సూచించారు. నేడు తరిగి పోతున్న వన సంపదను మొక్కలను పెంచడంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల గ్రామీణ సిఐ గిరిబాబు, ఎస్సై ఆశోక్, ఫారెస్టు శాఖ సిబ్బంది, గృహకల్ప కాలనీ వాసులు పాల్గొన్నారు.