సత్యసాయి తాగునీటి పథకాన్ని పునరుద్ధరించాలి
Published Monday, 26 September 2016మక్తల్, సెప్టెంబర్ 25: మక్తల్, నారాయణపేట నియోజకవర్గంలోని 70 గ్రామాల ప్రజలకు సత్యసాయి తాగునీరు అందక దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ఎంతవరకు సమంజసమని అఖిలపక్ష నాయకులు మక్తల్ మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి దయాకర్రెడ్డి, కాంగ్రెస్ నేత డిసిఎంఎస్ చైర్మన్ నిజాంపాష, జెడ్పీటిసి వాకిటి శ్రీహరి, పిసిసి సభ్యులు శ్రీనివాస్గుప్త, బిజెపి నాయకులు కోళ్ల వెంకటేష్లు మండిపడ్డారు. ఆదివారం అఖిలపక్ష నాయకులతోపాటు పంచదేవ్పాడ్, పస్పుల, దాదన్పల్లి, పారెవుల గ్రామాలకు చెందిన రైతులతో కలసి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన మక్తల్, నారాయణపేటకు చెందిన నియోజకవర్గ అఖిలపక్ష నాయకులతో మక్తల్ పట్టణంలో సత్యసాయితాగునీటి పునరుద్ద్ధరణ, బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని 6గంటల పాటు చేపట్టిన ధర్నా చేసిన పట్టించుకోలేదన్నారు. ఈనెల 20 తేదీలోపు తాగునీటి సమస్యతోపాటు, బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి కృపాకర్ హామీ ఇవ్వడంతో అప్పట్లో ధర్నాను విరమింప చేశామన్నారు.నేడు ఇక్కడి వచ్చి చూస్తే పనుల పురోగతిలో మచ్చుకైనా చేపట్టలేకపోడంతో వారు ప్రభుత్వ అధికారులపై, అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు 2లక్షల 50 వేలమంది ప్రజలకు ప్రతిరోజు తాగునీటిని అందించే సత్యసాయి తాగునీటి పథకాన్ని తలువని వారంటు ఉండరని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28న మక్తల్ బందకు పిలుపునిస్తున్నామని వారు తెలిపారు. అదేవిధంగా సోమవారం మంత్రి హరీష్రావును కలువనున్నామని అఖిల పక్షం నాయకులు తెలిపారు.