వాగులో చిక్కిన ఇద్దరు గిరిజన రైతులు
Published Monday, 26 September 2016మెదక్ రూరల్: వ్యవసాయ పొలాల వద్దకు వెళిల హల్దీవాగులో చిక్కుకున్న ఇద్దరు గిరిజన రైతులను జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డిఆర్ఎఫ్) సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో తరలివచ్చి వారిని రక్షించారు. మండలంలోని చిట్యాల గ్రామపంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఇద్దరు గిరిజన రైతులు లంబాడి సోపుల, లంబాడి పూల్యలు శనివారం రాత్రి తమ వ్యవసాయ పంట పొలాల వద్దకు వెళ్లారు. అర్దరాత్రి కురిసిన భారీ వర్షాలతో హల్దీవాగు ఉధృతంగా ప్రవహించడంతో తండాకు రాలేక చెట్టుపైన బిక్కుబిక్కుమంటు కూర్చుని సెల్ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ యాదాగౌడ్ ఆదివారం ఉదయం రెవెన్యు అధికారులకు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డికి తెలియజేశారు. ఏడుపాయల్లో 23 మంది కార్మికులు చిక్కుకోగా అక్కడే రాత్రి బసచేసి ఎన్డిఆర్ఎఫ్, ఎయిర్స్ ఫోర్స్ సిబ్బందిని రప్పించారు. వారిని సురక్షితంగా బయటకు తీయగా హల్దీవాగులో చిక్కుకున్న ఇద్దరు గిరిజనులను కూడా బయటకు తీయడానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అష్టకష్టాలమీద ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వారిని బయటకు తెప్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర గ్రామాల్లో, నీరు అధికంగా చేరిన చోట పరిస్థితులను ఆమె స్వయంగా అధికారులను అడిగి తెలుసుకుంటు ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. ఆమె వెంట జడ్పిటిసి లావణ్యారెడ్డి తదితరులున్నారు. అనంతరం మంబోజిపల్లి వైపు పసుపులేరును సందర్శించి వరదను పరిశీలించారు.