మనలో మనం (ఎడిటర్తో ముఖాముఖి)
Published Saturday, 19 November 2016డి.చంద్రశేఖర్, పుల్లేటికుర్రు
కరెన్సీ నోట్లపై ఎక్స్పైరీ డేటు ముద్రించాలన్న ఒక విజ్ఞానిని మనం ఎలా సత్కరించుకోగలమండీ?
చెల్లని నోట్ల దండతో.
డి.ఎస్.శంకర్, వక్కలంక
నాగేశ్వర్రావు, సావిత్రి, ఆదుర్తి, కె.వి.రెడ్డి, ఘంటసాల, సుశీల- యిలాంటివారిని మళ్లీ చూడగలమా?
యూట్యూబ్లో చూడవచ్చు
నీలకంఠం, వక్కలంక
భోపాల్ జైలులోని ఖైదీలు గ్లాసులు, పళ్లాలు ఉపయోగించి గార్డులను చితకబాది తప్పించుకున్నారుట. తప్పించుకోవడం యింత సుళువా?
నమ్మశక్యంగా లేదు. పోలీసుల కబుర్లు ఎప్పుడూ ఇంతే. కాని దీని గురించి మరీ రాద్ధాంతం తగదు.
ఎ.శ్రీనివాస రావు, గద్వాల
భోపాల్లో జైలుగార్డును చంపి, గోడలను ఎక్కి తప్పించుకు పారిపోయిన ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతమైన సందర్భంలో గార్డు మరణాన్ని పట్టించుకోకుండా ఎన్కౌంటర్లో లోపాలను వెతికే మేధావులను, రాజకీయ నాయకులను ఏమనాలి?
బుద్ధిలేని బుద్ధిజీవులు
పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
గతంలో (2013) ఓసారి సిమి ఉగ్రవాదులపై పోలీస్ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పుడు జైలులో గార్డ్ను చంపి గోడ దూకి పారిపోయిన సిమి ఉగ్రవాదుల్ని గంటల వ్యవధిలోనే వెదికి ఎన్కౌంటర్లో మట్టుపెట్టారా? ఏదైనా కిరికిరి జరిగిందంటారా? ఈ ఎన్కౌంటర్ చర్యలు సరైనవేనంటారా? కాలాన్నిబట్టి తప్పదంటారా?
ఆ టెర్రరిస్టులు దేశానికి శత్రువులు. సమాజానికి ప్రమాదకారులు. వారి గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. జాతి విరోధులకు పౌరహక్కులు వర్తించవు.
ఎ.సి.పుల్లారెడ్డి, అనంతపురం
తెలుగు సినీ వినీలాకాశంలో ప్రగతి రథ సారథులుగా వెలిగినవారు ఎందరో ఉన్నారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన అలనాటి చిత్ర ప్రముఖుల గురించి నేటి తరానికి తెలియాలి. వారి గురించి మేము రచనలు పంపవచ్చునా?
పంపవచ్చు. కాని ఆ పని ఇప్పుడు జరుగుతూనే ఉంది.
బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
బ్రాహ్మణుడిని ఉద్దేశించి కొందరు బాపనాయన అనడం వింటున్నాం. నోరు తిరక్కనా? తెలుగు నిఘంటువులో ఆ పదం ఉందా?
అది తిట్టుపదం కాదు. ఎప్పటినుంచో వాడుకలో ఉన్నదే.
దసరా ఊరేగింపులో కుప్పిగంతులేమిటి? డ్యూయెట్ సాంగ్స్ ఏమిటి? అమ్మవారిమీద పాటలు లేదా భక్తిరస పాటల రికార్డులు వెయ్యాలిగాని. నిర్వాహకులకు తెలియదనుకోవాలా? లేదా సినిమాల దుష్ప్రభావం అనుకోవాలా?
ఎవరి ఇష్టం వారిది. ఎవరి పద్ధతి వారిది. మన మహామేధస్సుకు ఆక్షేపణలు, అభ్యంతరాలు అన్నీ కేవలం హిందువుల వేడుకల విషయంలోనే ఎందుకు పొడుచుకొస్తాయి అన్నది మొదట ఆలోచించాలి.
సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఈమధ్య కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలకే కాకుండా అధికార పార్టీపరంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఇంత ఆర్భాటానికి పోవడంకంటే సింపుల్గా కానిస్తే, ఆదా అయ్యే ధనంతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేయవచ్చుకదా! ఇలాంటి ఆడంబరాల వలన ప్రజలకు ఒరిగేదేముంది? ప్రజాధనం వారి ప్రచారాలకు వాడుకునే హక్కు ఎవరిచ్చారు?
ఎవరూ ఇవ్వలేదు. సాక్ష్యాధారాలుంటే చట్టపరంగా నిలదియ్యవచ్చు.
ఎం.కనకదుర్గ, తెనాలి
టెక్నాలజీ పుణ్యమా అని నేటి తరానికి లక్షల్లో జీతాలు అందుతున్నాయి. జీవన ప్రమాణాలు పెరిగి విదేశాలలో ఉండే సౌకర్యాలను అనుభవించగలుగుతున్నారు. అయితే కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు, సంస్కృతి పట్ల గౌరవం, భారతీయత నేటి ఆధునికతలో లోపిస్తున్నాయనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏమిటి?
తప్పు వాళ్లది కాదు. పరిసరాల ప్రభావం, పెంపకం లోపం.
ఎ.వి.సోమయాజులు, కాకినాడ
‘పేకేజీ రూపంలో కేంద్రం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వదని, అన్ని రాష్ట్రాలకు యిస్తున్న మాదిరిగానే నిధులు కేటాయిస్తున్నారని’ శ్రీ ధర్మాన వ్యాఖ్య! ఇటువంటి ప్రశ్న అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగితే.. జైల్లో, కోర్టులో చూసుకో అంటారెందుకు?
వారు చెబితేనే సత్యం. పరులు అడిగితే దుర్మార్గం.
ఎం.పి.లకు రెట్టింపు జీతం! పాపం వాళ్లకు పెంచకపోతే ఎలాగండీ?
ఔను. వారు చేసే ప్రజాసేవకు ఎంత ఇచ్చినా తక్కువే!
పట్నాల కూర్యనారాయణ, రాజమండ్రి
ఈ మధ్య వచ్చిన హారర్ చిత్రాలలో దుష్టశక్తులను ఆరాధించే మాంత్రికులు జై పాతాళభైరవి, మహాకాళి, జై బేతాళ, జై భద్రకాళి అంటూ బిగ్గరగా అరుస్తారు. మహాకాళి, భద్రకాళి దైవాంశసంభూతులు కదా. పాప కార్యాలకు పాల్పడే మాంత్రికులకు ఎలా సహాయం అందిస్తారు. దేముళ్లకు పాపం అంటుకోదా?
సినిమా మాంత్రికుల ముందు ఇలాంటి శంకలు దండుగ
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com