నోట్ల రద్దుపై విపక్షాల రాద్దాంతం
Published Monday, 21 November 2016విజయవాడ, నవంబర్ 20: బ్లాక్ మనీ జబ్బులో మునిగిపోయిన దేశాన్ని పెద్దనోట్ల రద్దుతో ఒడ్డున పడేసేందుకు ప్రధాన మోదీ చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్షాలు సహకరించాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టేలా ఆరోపణలు చేయడం తగదని బిజెపి రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు చర్య దేశంలోని 545 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన సర్దార్ పటేల్, బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభించిన ఇందిరాగాంధీ, పోఖ్రాన్లో అణుబాంబు ప్రయోగం చేసిన వాజ్పేయి చేసిన చర్యలతో పోల్చదగినదని, వాటి కంటే పెద్దదని పేర్కొన్నారు. నల్లధనం వల్ల నల్లకుబేరులు తప్ప సామాన్యులకు ఎలాంటి సమస్య లేదన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ పెద్దనోట్ల రద్దును ఉరి ఉగ్రవాదులపై దేశం దాడితో పోల్చి భారత సైనికులను తీవ్రంగా అవమానించారన్నారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట సుబ్బయ్య, మీడియా ఇన్చార్జి దిలీప్ పాల్గొన్నారు.