అజ్ఞానాన్ని తొలగించేది కార్తీక దీపం
Published Monday, 21 November 2016జి.సిగడాం, నవంబర్ 21: మానవుల్లో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిని తొలగించేందుకు, జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు కార్తీకమాస పర్వదినాల్లో దీపం వెలిగిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని మైలారభట్ల వెంకటశ్రీనివాసశర్మ పేర్కొన్నారు. కార్తీక మాసం నాలుగో సోమవారం పర్వదినం సందర్భంగా స్థానిక ఉమారామలింగేశ్వర దేవాలయం ప్రాంగణంలో సుమారు మూడు వేల మంది భక్తులచే జ్యోతులు వెలిగించారు. కార్తీకమాసంలో హరిహరనామంతోపాటు శివాలయాలు దర్శించడం వలన, మనస్సు ప్రశాంతత చేకూరుతుందన్నారు. దీపోత్సవ కార్యక్రమానికి ఆలయకమిటీ వారు భక్తులనుంచి ఎటువంటి రుసుం తీసుకోకకుండా దీపాన్ని వెలిగించి ముక్తికి సోపానం కలిగించేందుకే ఈ ఉచిత దీపోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా శివాలయంలో సుమారు 30మంది దంపతులచే శివునికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ పూజారి మల్లాది కృష్ణచైతన్యశర్మ, ఆలయ కమిటీవారు పాల్గొన్నారు.