క్రేజీ క్రేజీగా..!
Published Saturday, 31 December 2016తెలుగు చిత్రసీమలో మలయాళీ భామల హవా జోరుగానే వుంది. అగ్ర హీరోల నుంచి యువతరం హీరోల వరకు ఈ భామలతో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. స్టార్ హీరోల నుంచి సైతం వీళ్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అలా వచ్చిన అవకాశాలను ఈ భామలు ఏ మాత్రం వృథా చేయకుండా తమ సత్తా చాటుకుంటున్నారు. అదే కోవలో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా చేరిపోయింది. ‘అ..ఆ’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ చిత్రం తెచ్చిన గుర్తింపుతో క్రేజీ ఆఫర్స్ను తన ఖాతాలో వేసుకుంటూ రివ్వున దూసుకెళుతోంది. ఆ తర్వాత వచ్చిన ‘ప్రేమమ్’ కూడా బాగానే క్రేజ్ని తెచ్చిపెట్టింది. అదే ఊపుతో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పవన్కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే చిత్రంలో అనుపమనే ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఎన్టిఆర్, రామ్చరణ్లతో కూడా జోడీ కట్టబోతోందిట. అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం ‘శతమానం భవతి’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాబోయే చిత్రాలతో టాలీవుడ్పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. దటీజ్..అనుపమ!!