సరదా ట్వీట్స్!
Published Saturday, 21 January 2017సోషల్ మీడియా అంతా ఇప్పుడు హాట్ హాట్గానే హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇదొక సూపర్ సరదాగా మారిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక సినీ తారలకైతే పండగే..పండగ! తమ అభిమానులకు దగ్గరయ్యేందుకు..వారితో ఎన్నో విషయాలను షేర్ చేసుకునేందుకు ఇది బాగా దోహదపడుతోంది. అందుకు దీనిని ఒక వేదికగానే మార్చుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు వారు చేసే సినిమాల గురించి, వ్యక్తిగత విజయాల గురించి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా షేర్ చేస్తుండటం మనం చూస్తున్నదే. మరి కొందరు తారలైతే సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచినప్పటికీ అప్డేట్స్ విషయంలో మాత్రం చాలా వెనుకంజలోనే వున్నారు. బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఈ కోవలోకే వస్తుంది. అందరు కథానాయికల్లా సోషల్మీడియాలో ముందుండటం లేదు ఎందుకు? అని విద్యాబాలన్ను కదిలిస్తే- ‘‘అవును..నిజమే! ట్విట్టర్ అకౌంట్ తెరిచి చాలా కాలమే అయింది. కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వడంలేదు. ఏదో ఒక విషయాన్ని అభిమానులతో సరదాగా పంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తా. ఒక వేళ అలా ఓపెన్ చేసినా ఎంతో సేపు వుండను. ఏదైనా ట్వీట్ చేశాక ‘నేనేనా ట్వీట్ చేసింది’ అని కూడా ఆశ్చర్యపోతా. సోషల్ మీడియాతో మంచి-చెడూ రెండూ వున్నాయి. శిరీష కుందర్ ట్వీట్లను నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తా. ఈ మధ్యనే ఫేస్బుక్ కూడా ఓపెన్ చేశా. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎక్కువగా ఫొటోలు పెడుతుంటా’’అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిస్టారికల్ కథతో తెరకెక్కుతున్న ‘బేగమ్జాన్’ చిత్రంలో నటిస్తున్న విద్య ఆ చిత్రంలోని పాత్రను ఆసక్తికరంగా మలిచేందుకు తన వంతు పాత్రను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. అదీ..సంగతీ!!