ఈ వారం స్పెషల్

హస్తినలో వసంతశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-బడబాగ్ని శంకరరాజు
94405 08511
-----------------------
విరబూసిన గులాబీని చూస్తే..
మనసు పరవశించిపోతుంది...
గులాబీల్లాంటి తులిప్ పూలబారులు చూస్తే
మనసు ఎటో వెళ్లిపోతుంది..
మత్తెక్కించే మల్లెపూల పరిమళం...
గమ్మతె్తైన బంతిపూల దొంతరులు...
ఆకాశాన్ని ముద్దాడేందుకు చిందులేసే నీటితుంపరులు...
మీదపడుతూంటే...ఒక్కో అడుగు వేస్తూంటే...
కాలం కరిగిపోతుంది.
ఏడాదిలో ఓమారు..జనసామాన్యానికి
కనువిందు చేసే దిల్లీ ఉద్యానవనోత్సవం
ఇప్పుడు అందరికీ ఆహ్వానం పలికింది.
ఈ అందమైన అనుభూతిని ఆస్వాదించేముందు అసలు ఈ తోటల కబుర్లు చెప్పుకోవాల్సిందే. మొఘలుల కాలంలో విస్తరించిన ఉద్యానవనాల ఊసులు తెలుసుకోవలసిందే. ప్రపంచంలోని అందమైన, అరుదైన పుష్పాలు, కాశ్మీర్ తులిప్ పూమొక్కలు...చేరిన మన రాష్టప్రతి భవన్‌లోని మొఘల్‌గార్డెన్ రారమ్మంటోంది. అక్కడ నెల్లాళ్లపాటు జరిగే ఉద్యానవనోత్సవం...మొఘల్‌గార్డెన్ల ఘనతను మరోసారి చాటుతోంది.
మన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉషోదయానే్న వాహ్యాళికి వెళ్లి...పూలమొక్కలతో ఊసులు చెప్పడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. అబ్దుల్ కలాం అయితే స్వయంగా ఈ తోటలపెంపకంలో పాలుపంచుకునేందుకు తహతహలాడేవారు. ఒకరూ ఇద్దరూ కాదు...మన రాష్టప్రతులంతా ఈ మొఘల్ గార్డెన్‌కు ‘్ఫదా’ అయినవారే. మనం రాష్టప్రతి స్థాయికి ఎదగకపోయినా....ఆ ఉద్యానవనంలోకి ‘రాజా’లా అడుగుపెట్టే సందర్భం మాత్రం వచ్చింది. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించడమే తరువాయి.
అద్భుతమైన ‘పూలతోట.. భూమి నవ్వులా’ ఉంటుందని ఎమర్సన్ కవి భావన. ఆ నవ్వు ఎలా ఉంటుందో చూడాలంటే రాష్టప్రతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌ను సందర్శించాలి. దిల్లీ, రాష్టప్రతి భవన్‌లోని విశాలమైన ప్రదేశంలో మొగల్ గార్డెన్ విస్తరించి ఉంది. 154 హెక్టార్ల రాష్టప్రతి భవన్ విస్తీర్ణంలో 15 హెక్టార్లలో భవన నిర్మాణాలున్నాయి. మిగిలిన 139 హెక్టార్లలో పూలతోటలు, వృక్షాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 13 ఎకరాల్లో రకరకాల రంగులతో కూడిన పూలమొక్కలు, వృక్షాలతో మొఘల్ గార్డెన్స్ రంగుల హరివిల్లులా దర్శనమిస్తుంది.
రాష్టప్రతి భవనం ఇంత శోభాయమానంగా రూపొందడానికి ఎడ్విన్ లుట్వన్స్ అనే బ్రిటీష్ వాస్తు శాస్తవ్రేత్త ప్రధాన కారకుడు. బ్రిటీష్ ప్రభుత్వం 1911లో బ్రిటీష్ ఇండియా రాజధానిని కలకత్తా నుండి దిల్లీకి మార్చాలని నిర్ణయం తీసుకొన్నది. వారి నిర్ణయాన్ని అనుసరించి ఎడ్విన్ లుట్విన్స్ ఢిల్లీలోని రాష్టప్రతి భవనం, ఉద్యానవనాన్ని సుందరంగా నిర్మింపజేశాడు. వీటి నిర్మాణం 1929 నాటికి పూర్తయ్యాయి.
జమ్మూ కాశ్మీర్, ఆగ్రాలలోని మొఘలుల ఉద్యానవనాల లక్షణాలు, పోలికలు దిల్లీ మొఘల్ గార్డెన్స్‌లో కనిపిస్తాయి. దీనిలో బ్రిటీష్ వారి ఉద్యానవన శైలి కలవడం వల్ల మొఘల్ గార్డెన్స్‌కు విలక్షణత ఏర్పడింది. పూల ప్రపంచంలోని అందాలన్నీ ఒక దగ్గర పోగేసినట్లుగా మొఘల్ గార్డెన్స్ కనిపిస్తాయి. వృక్ష, వివిధ రకాల పూలమొక్కలు, పొదరిళ్లు, పచ్చిక బయళ్లు, వాటర్ ఫౌంటెన్‌లతో ఈ ఉద్యానవనం చల్లని వాతావరణంలో స్వచ్ఛంగా కనిపిస్తుంది.
అరుదైన పూదోట
ఈ ఉద్యానవనంలోని 120 రకాల రోజా పూల మొక్కలు ఫిబ్రవరి, మార్చి మాసాలలో వికసించి వివిధ రంగులతో చూపరులను ఆకట్టుకొంటాయి. వీటిలో గ్రీన్‌రోజ్, ఆంజిలిక్ రోజ్ పూల మొక్కలు అరుదైనవి. సువాసనలు వెదజల్లే బిలామి, బ్లాక్ లేడి, డబుల్ డిలైట్, ఈఫిల్ టవర్, గ్రనడా, జాడిస్, మిస్టర్ లింకన్, సదాబహార్, తాజ్‌మహల్ వంటి 40 రకాల రోజా పూలమొక్కలున్నాయి.
కవులు సహజంగా సౌందర్య పిపాసకులై ఉంటారు. అందుకే ప్రముఖ ఆంగ్ల కవి షేక్స్‌స్పియర్ రోజా పూల సువాసనల గురించి ఇలా అన్నాడు. "What is a name? That which call a rose by any other name would smell as sweet.'
ఇక్కడ బక్లాహామా, బొన్ననట్‌లు నల్లరంగు పారడైజ్, బ్లూమూన్, లేడీ ఎక్స్‌లు నీలంరంగు రోజాపూలు ప్రత్యేక ఆకర్షణలుగా కనిపిస్తాయి.
జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుల పేర్లతో ఇక్కడి రోజా పూలను వ్యవహరిస్తారు.
మదర్ థెరిసా, జాన్ ఎఫ్ కెనడీ, క్వీన్ ఎలిజబెత్, రాజా రామమోహన్‌రాయ్, బి.పి.పాల్, మిస్టర్ లింకన్ మొదలగు పేర్లతో ఇక్కడి రోజా పూలను పిలుస్తారు. ఆ పూలను చూస్తే మహా వ్యక్తుల జీవిత చరిత్రలన్నీ గుర్తుకొస్తాయి.
మానవుల మనోభావాలు, ప్రవృత్తులను తెలిపే పేర్లతో కొన్ని పూల మొక్కలను వ్యవహరిస్తారు. సంతోషం, కిస్ ఆఫ్ లైఫ్, ఫస్ట్ ప్రైజ్ మొదలగు పేర్లతో కొన్ని మొక్కలను వ్యవహరిస్తారు.
అందుకే "and it is my faith, that every flower enjoys the air it breathes' అని ఒక ప్రముఖుడన్నారు. సిసిరో మహాశయుడు మరింత విశదంగా "if you have a garden, and a libray - you have everything you need' అని అన్నాఢు.
ఇతర రకాల పూలమొక్కలు
రోజా పూల మొక్కలతోపాటుగా ఇక్కడ వివిధ రంగులతో కూడుకొన్న 10 వేల తులిప్ పూల మొక్కలు, వివిధ ఋతువుల ననుసరించి పుష్పించే 70 రకాల పూల మొక్కలు ఉన్నాయి. వీటిలో లినేరియా, జెర్బరా, దాలియా, గజ్నియా అలిస్సమ్, అంథిరనియమ్, సెలుండ్సులా ముఖ్యమైనవి.
ఉద్యానవనాన్ని వివిధ బ్లాకులుగా ఏర్పరచి ప్రతి బ్లాక్ సరిహద్దుల - మధ్యలో ఒకే రంగు పూల మొక్కలు, కొన్ని బ్లాక్‌లలో వివిధ రంగుల పూల మొక్కలు ఏర్పరచి, సరిహద్దులు స్పష్టంగా తెలిసే విధంగా ఒకే రంగు పూల మొక్కలను ఏర్పరచారు. ఇక్కడ పిరమిడ్ ఆకారంలో వివిధ రకాల రంగుల పూల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు, ఎత్తు ఆధారిత వరసక్రమంలో అమర్చి ఉంటారు.
ఈ ఉద్యానవనం ప్రకృతి లాలిత్యానికి, భిన్నరూప ప్రకృతికి ‘చిరు ప్రతిరూపం’గా కనిపిస్తుంది. ఎతె్తైన రోజాపూల మొక్కల కింద అలీసమ్, ఫాన్సీస్ వయోల మొక్కలు తొంగి చూస్తున్నట్లు కనిపిస్తాయి. వీటిలో కొన్ని సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి రెండుసార్లు వికసించే పూల మొక్కలున్నాయి.
ఇన్ని రకాల పూల మొక్కలను ఈ గార్డెన్‌లో సేకరించి పొందుపరచడానికి ప్రేరణ.. దేశం మిగతా ప్రాంతాలలోని మొఘల్ గార్డెన్స్ అని చెప్పాలి. బాబర్ తన స్వీయ చరిత్రలో 29 రకాల మొక్కలను పేర్కొన్నాడు. జహంగీర్ తన స్వీయచరిత్రలో 10 రకాల మొక్కల పేర్లు పేర్కొన్నాడు. మొగలులు, సిక్లేయన్, ఇరిస్, పియోని, మేరీగోల్డ్, లాప్క్స్‌పూర్, లోటస్, జెన్నియా, వైలెట్, డెల్పినియం, స్టాక్స్, సాఫ్రన్, హాలికాక్, లిలాక్కెరేటియో పూల మొక్కలను దిల్లీ, ఆగ్రా, కాశ్మీర్, లాహోర్‌లలోని గార్డెన్స్‌లో పెంచారు. కొన్ని పూలు, చెర్రీ చెట్లను కాబూల్ నుంచి తెప్పించి నాటారు.
గ్రాస్‌లేన్స్
ఇక్కడున్న పచ్చిక మైదానాలలో జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన భారత రాష్టప్రతి ప్రముఖులకు విందు భోజనం ఏర్పాటు చేస్తారు. మొగలు పాలకులైన జహంగీర్, షాజహాన్‌లు ఉద్యానవనాలలోని పచ్చిక మైదానాలలో ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేసేవారని చరిత్ర చెబుతోంది. కుటుంబ సభ్యులతో కలసి విందువిలాసాలూ ఈ తోటల్లో నిర్వహించుకునేవారు.
ఆ ప్రదేశంలో పొడవైన గ్రాస్‌లేన్స్, దానికి సమాంతరంగా ఋతువుల ఆధారిత పూలమొక్కలు, 2500 దాలియా పూల మొక్కలు కళ్ల ముందు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లుంటాయి.
కాబూల్ గార్డెన్స్‌లో పచ్చిక మైదానాలలోగల పసుపు పచ్చని ఆర్గాన్ పూల మొక్కలు మధ్యమధ్యలో ఎర్ర ఆర్గాన్ పూల మొక్కలు, పచ్చని చెట్లు, ఎర్రని పొమిగ్రెనేట్ పండ్ల గుత్తులతో ఎంత అందంగా కనిపిస్తాయో అంతే అందంగా దిల్లీ మొగల్ గార్డెన్స్ కనిపిస్తాయి.
వృత్తాకార తోటలు
వృత్తాకార పూల తోటలు ఈ ఉద్యానవనంలోని మరొక ఆకర్షణ. దీనిలో ఋతువుల ఆధారంగా పుష్పించే 30 రకాల పూల మొక్కలున్నాయి. వీటిలో స్వీట్ విలియం, క్లార్కియా, రింగ్ ఆఫ్ ఆరెంజ్, మేరీ గోల్డ్, దాలియా పూలమొక్కలుంటాయి. ఇవి 8 అడుగుల
పొడవుతో గల తోట ప్రహరీగోడ ననుసరించి కొన్ని పూల మొక్కలు అందంగా కనిపిస్తాయి. ఈ పూల మొక్కలు రాష్టప్రతి భవన్ అందాలను ఇనుమడింప జేస్తుంటాయి.
అందుకనే వాటి విలువను తెలిసిన రచయిత ఎమ్మాగోల్డ్ మెన్ -PI would rather have roses on my table than diamonds on my neck' అని అన్నారు.
ఆధ్యాత్మిక పూలతోట
దేశంలోని జాతి, మత, భాషా భిన్నత్వాలకు ప్రతీకగా ఒక ఆధ్యాత్మిక పూల తోటను ఈ ఉద్యానవనంలో రూపొందించారు. ఇక్కడ రుద్రాక్ష, షిగ్, డేట్‌పామ్, కృష్ణబుర్గాద్, కొబ్బరి, మర్రి, రావి, చందనం, కదంబ వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలు మనకు అనేక ఆధ్యాత్మిక గాథలను గుర్తుకు తెస్తాయి.
వీటి మధ్య సంచరిస్తుంటే ఎవరికైనా మరో లోకంలో విహరిస్తున్నట్లు అనిపించక మానదు. ఆ వాతావరణంలో తిరిగే వారికి, వారి మనసులలోని బాధలన్నీ బయటికొచ్చి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది.
"All my hurts my garden spade can heal' అని ఎమర్సన్ అన్నట్లు - ఉధ్యానవనంలో విహరిస్తుంటే తవ్వుపారతో మనసులోని బాధలను తీసి బయట పారవేస్తున్నట్లు అనిపిస్తుంది. యుద్ధాలలో పాల్గొని అలసిపోయి వచ్చిన మొఘల్ పాదుషాలు ఈ ఉద్యానవనాలలోకి వచ్చి విశ్రమించి సేదదీరేవారు.
ఔషధ మొక్కల తోట
ఔషధ మొక్కల తోట మొఘల్ గార్డెన్స్‌లో ప్రత్యేకంగా ఏర్పరచబడింది. దీనిలో 33 రకాల ఔషధ మొక్కలున్నాయి. మధుమేహానికి ఔషధంగా వాడే స్టెవియా, జిట్రోపా, తులసి, అశ్వగంధి, జరీనియమ్, డామస్క్‌రోజ్ మొదలగు ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయి.
మొగల్ గార్డెన్స్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2003 సం.లో 80 రకాల మొక్కలతో కూడిన కాక్టస్ తోటను తొలిసారిగా ఇక్కడ పెంచారు.
మ్యూజికల్ ఫౌంటెన్
సహజమైన ఉద్యానవనానికి తోడుగా అందమైన జలసిరి కల్పించారు. నీటిని వివిధ ఎత్తులలో ఎగజిమ్మే 12 ఫౌంటెన్లు 2005లో ఏర్పరిచారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల మధ్యన ఈ జలరాశి నృత్యం చేస్తున్నట్లుగా ఫౌంటెన్‌ల నుండి విడుదలవుతూ ఉంటుంది. అదే సమయంలో షెహనాయ్, వందేమాతరం రాగాలాపన ఫౌంటెన్‌లో నుంచి వినవస్తూ వుంటుంది. కాంతి, శబ్దం, దృశ్యం కలగలిసి చూపరులకు పరిపూర్ణ ఆనందాన్ని కలుగజేస్తాయి.
ఇటువంటి దృశ్యాలను తిలకించాడేమో ‘ఇలియట్’ మహాకవి. ఆ దృశ్యాన్ని ఈ క్రింది విధంగా అతికినట్లు తన మాటలలో చెప్పాడు.
"You have love the roses so do I wish the sky would rain down roses as thy rain from off the shaken bush, why will it not? Then all the valley would be pink and white and soft to trea on, they would fall as light as feathers, smelling sweet, and it would be like sleeping and like walking go all at once'.
నక్షత్రాల తోట
ఈ ఉధ్యానవనంలో ప్రభుత్వం 2006లో ‘నక్షత్రాల తోట’ను ఏర్పాటు చేసింది. హిందువుల జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన 27 రకాల ఆకాశం ఆకృతులు, 27 రకాల నక్షత్రాలకు ప్రతీకలుగా 27 రకాల వృక్షాలను ఇక్కడ పెంచారు. దీనినే ‘నక్షత్రాల తోట’ అని పిలుస్తారు. ఇందులో పెంచిన వృక్షాలు మనకు మానసిక, శారీరక ప్రశాంతతను సమకూరుస్తాయని నమ్మిక.
బోన్సాయ్ తోట
బోన్సాయ్ తోటను 2010లో ప్రభుత్వం 250 రకాల మొక్కలతో పెంచింది. చైనా ఆరెంజ్, మాలిగియా, కసూరినా, బోగన్‌విల్లా, పినస్, మిముసప్స్, ఎలంగి, ఇస్పాక్టోరియా, ఫికస్ పాండా మొదలగు బోన్సాయి మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తాయి. అలాగే బయో డైవర్సిటీ పార్క్‌లో జింకలు, మయూరాలు, గినియా ఫౌల్స్, తాబేళ్లు, కుందేళ్లు, వలస పక్షులు మన మనసును ఆహ్లాదపరుస్తాయి.
చూసొద్దామా...
ఇన్ని వైవిధ్యాలుగల మొఘల్ గార్డెన్ చూడటానికి లక్షల మంది ఫిబ్రవరి, మార్చి మాసాలలో వస్తుంటారు. ఇప్పటివరకు - 2006లో - 3.25 లక్షల మంది, 2007లో - 3.15, 2008లో - 4.5, 2009లో - 5.17, 2010లో -3.79, 2011లో - 5.32, 2012లో - 6.57, 2013లో - 4.80, 2014లో - 5.84 లక్షల మంది రాష్టప్రతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్‌ను సందర్శించారు. 2006లో సందర్శకులకు రెట్టింపుసంఖ్యలో 2012లో గార్డెన్స్‌ను సందర్శించారు. 2003 - 2010 సం.ల మధ్య జరిగిన గార్డెన్స్ అభివృద్ధి ప్రభావం యొక్క ఫలితాన్ని 2012లో పెరిగిన సందర్శకుల సంఖ్య తెలియజేస్తున్నది.
మొఘల్ గార్డెన్స్ దిల్లీ, ఆగ్రా, కాశ్మీర్, లాహోర్‌లలో ఉన్నాయి. వీటిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.
* ఉద్యానవనాలలో నీటి కాలువలు ‘+’ ఆకారంలో ఏర్పరచబడి ఉంటాయి.
* ఆకాశం, గార్డెన్‌ల రూపాలు ప్రతిబింబించే విధంగా నీటి

కొలనులు ఉంటాయి.
* మొఘలుల అదృష్ట సంఖ్యగా భావించే 8,9 అంకెల ఆకారాలు భవన నిర్మాణాలలో ఆక్టోజోనల్ పోల్స్‌లోనూ కనిపిస్తాయి.
* ఇస్లాం గాథలలోని స్వర్గం ఉండే నాలుగు నదులను పోలిన రీతిగా, తోటలలో నాలుగు నీటి కాలువలు కనిపిస్తాయి.
* స్వర్గ ఉద్యానవనం కింది నీటి కాలువలు ప్రవహిస్తుంటాయని ఇస్లాం గ్రంథాలు చెబుతాయి. దానికి ప్రతిరూపంగా భవన నిర్మాణం ఒకవైపు నుంచి ప్రవహించే కాలువ నిర్మాణం వద్ద అదృశ్యమై, నిర్మాణానికి ఆవలి వైపున మళ్లీ కనిపిస్తుంది. ఉదా: హుమాయూన్ సమాధి.
* ఉద్యానవనాలలో ఫౌంటెన్లు, పాలరాతి వేదికలు, కాలిబాటలు, బావులు, అక్విడెట్‌లు, స్నానపు శాలలు కనిపిస్తాయి.
* కొన్ని మొఘల్ గార్డెన్స్‌లో అరటిపళ్ల చెట్లు, మామిడి, కోకో, ఫిగ్ చెట్లు, ద్రాక్ష, అఫ్రికోట్, జామ, ఆపిల్, పోమోగ్రెనేట్, చెర్రీ పళ్ల చెట్లు కనిపిస్తాయి.
* మొగలు పాలకులు ఉద్యానవనాలలోనే కాకుండా రహదారుల వెంబడి మార్గోసా, పైపల్, బహార్, ధక్ మొదలగు చెట్లను నీడ కోసం నాటించారు. ఉదా. జహంగీర్.. ఆగ్రాలోని రోడ్ల వెంబడి చెట్లు నాటించాడు. నేటి ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనుల వలన ఉద్యానవనాలు కొత్త హంగులను సంతరించుకొంటున్నాయి.
ఉద్యానోత్సవం సందర్భంగా రాష్టప్రతి భవన్ మొగల్ గార్డెన్స్‌ను సందర్శకుల కోసం 12 ఫిబ్రవరి నుండి 19 మార్చి 2016 వరకు ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ సెలవురోజుల్లో ప్రవేశం ఉండదు.
పర్షియన్ పద్ధతిలో మొఘలులు ఈ ఉద్యానవనాలు నిర్మించారు. ఇండియా గేట్, రాష్టప్రతిభవన్ వద్ద మొఘలుల ఉద్యానవనాలున్నాయి. దీనికి సమీపంలో ఉన్న మెట్రో రైల్వేస్టేషన్ ‘సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రోస్టేషన్ కన్నాట్ పాలస్ వద్ద నుంచి దిల్లీ టూరిజం (డిటిసి) బస్సు ద్వారా కూడా మొఘల్ గార్డెన్స్‌ను చేరుకోవచ్చు. విమానంలో ప్రయాణం చేసి వచ్చేవారు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి ఇక్కడికి టాక్సీలో చేరుకోవచ్చు. ఇక్కడికి విమానాశ్రయం 12 కి.మీ. దూరంలో ఉన్నది.
సందర్శకులు లోనికి వెళ్లేప్పుడు కెమెరాలు తీసుకెళ్లరాదు. మొఘల్ గార్డెన్స్ మొత్తం చూడటానికి గంట నుండి 3 గంటల వరకు సమయం పడుతుంది. స్వంత వాహనాలలో వచ్చేవారు ఇండియా గేటు వద్ద వాహనాన్ని పార్క్ చేసి అక్కడ నుండి ఆటోలో మొగల్ గార్డెన్స్ చేరుకోవాలి.
లోనికి ప్రవేశం పొందడానికి ప్రతి సందర్శకుని వద్ద పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐ.డి. డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు ఉండాలి.
2015- మొగల్ గార్డెన్స్ ఉద్యానోత్సవంలో 12 రకాల రోజా పూల మొక్కలు, 10వేల తులిప్ మొక్కలతో దీర్ఘచతురస్రాకారంగాను, వృత్తాకారంగాను అమర్చి తోటలను ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏడాది 15వేల తులిప్ పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది ఉద్యానవనోత్సవంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ప్రదర్శనలలో రాష్టప్రతిభవన్ మొఘల్ గార్డెన్స్ మరిన్ని కొత్త పూల తోటలను, ఏర్పాట్లను సందర్శకులు చూడవచ్చు.
ఈ పూల తోటలలో మొఘలుల కాలం నుండి ఆధునిక కాలం వరకు ప్రజల మనోభావాలు, ఆనందాలను పంచిపెట్టిన పూదోటల మనసును సేదదీరుస్తాయి.
దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక రాష్టప్రతి భవన్. రాష్టప్రతి భవన్ గార్డెన్స్ దేశసౌందర్యానికి ప్రతీక. 2016 ఉద్యానవనోత్సవంలో ఈ రెండు పార్శ్వాల దృశ్యాలను సందర్శకులు చూడగలరు.
"Count the garden by the flowers
Never by the leaves that fall
Count your life with Smiles
and not the tears that roll'

కాశ్మీర్ గార్డెన్ అంటే ప్రేమ

మొఘల్ సామ్రాజ్యంలో ఉద్యానవనాలకు ప్రాణం పోశారు. ప్రకృతి రమణీయతకు నాయకుల అభిరుచి తోడవడంతో పూదోటలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించిన కాశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్ మిగతావాటికన్నా భిన్నమైనది, ప్రత్యేకతలకు కలిగినది. దిల్లీ, లాహోర్‌లలోని మొఘల్ గార్డెన్లు కోటలు, భవనాలు, టూంబ్‌ల మధ్య తీర్చిదిద్దితే కాశ్మీర్‌లోని గార్డెన్ పూర్తిగా పూదోటగానే పెంచారు. సహజసిద్ధంగా ఉన్న హిమాలయాలు, లోయలు, ఎప్పటికప్పుడు కురిసే మంచు ఈ తోటలకు అద్భుతమైన అందాన్నిచ్చాయి. మొఘల్ చక్రవర్తులందరూ కాశ్మీర్‌లోని గార్డెన్‌ను సందర్శించడం, విడిది ఉండటానికి ఇష్టపడేవారు. బాబర్ హయాంలో మొఘల్ గార్డెన్లు రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి. హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో మరింత విస్తృతంగా, పద్ధతిగా వీటిని తీర్చిదిద్దారు. కాశ్మీర్, కాబూల్ వెళ్లివచ్చినప్పుడల్లా ఈ చక్రవర్తులు ఇక్కడ ఆగేవారు. జహంగీర్ 14 సార్లు కాశ్మీర్ గార్డెన్‌ను సందర్శించారు. ఔరంగజేబు ఏడాదిన్నరపాటు ఇక్కడే ఉండిపోయాడు. ఇక షాజహాన్ 9సార్లు సందర్శించడమే కాకుండా ఈ తోటలో రెండుసార్లు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు.
పర్షియన్, మొఘల్, బ్రిటిష్ శైలిని కలగలిపి వీటిని తీర్చిదిద్దారు. నిజానికి బాబర్ చార్‌భాగ్ శైలిని అమలుచేయడానికి ఇష్టపడేవారు. క్రమంగా పర్షియన్, మొఘల్ (ఇస్లాం) శైలిని కలగలిపారు. ఇక మన రాష్టప్రతి భవన్‌లోని మొఘల్‌గార్డెన్‌కు కాస్త బ్రిటిష్ శైలి కలిసింది. చార్‌భాగ్ శైలి అంటే నాలుగువైపులా నీటికాలువలు, ఒక్కోవైపు పదహారు అంచెల్లో పూదోటలు ఉండటంగా చెప్పుకోవచ్చు. ఇక ఫౌంటెయిన్లు, ఆధునిక సొబగులు ఆ తరువాత వచ్చాయి. నిజానికి మొఘలుల కాలంలో కాశ్మీర్‌లో 700 ఉద్యానవనాలుండేవి.
బాబర్ కాబూల్‌లో ఉన్నప్పుడు అక్కడి ‘వౌర్-ఉన్-నహర్’ నగరం (ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్), సమర్‌కంద్, హీరత్ పట్టణాలలోని టిమురిప్, ఉజ్బెక్ గార్డెన్లను ముగ్ధుడయ్యాడు. అంతకన్నా అందంగా ఉండే ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలని భావించి వాటిపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం మనం మొఘల్ గార్డెన్లుగా పిలుస్తున్నవాటిలో మూడింటిని షాజహాన్ ఏర్పాటు చేస్తే మరో నాలుగింటిని అతని పూర్వీకులు తీర్చిదిద్దారు.
దిల్లీ మొఘల్ గార్డెన్..
13 ఎకరాల్లో విస్తరించి ఉంది. మూడు ప్రధాన గార్డెన్లు, ఉత్తర-దక్షిణ దిక్కులను, తూర్పు-పశ్ఛిమదిక్కులను కలుపుతూ రెండు ఛానల్స్, వాటి క్రాసింగ్‌వద్ద మొత్త ఆరు కలువపూలమాదిరి ఫౌంటెన్లు ఉన్నాయి. ఇందులో అందమైన రెండు పచ్చికబయళ్లు ఉన్నాయి. వీటిలో సెంట్రల్ లాన్ చతురస్రాకారంలో, ఒక్కోవైపు 45 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఈస్ట్‌లాన్ దీర్ఘచతురస్రాకారంలో సెంట్రల్ లాన్‌కన్నా కాస్త చిన్నదిగా ఉంటుంది. ఈ బయళ్లలో ఉండే గడ్డిని కోల్‌కతాలోని బెల్వెడెర్ ఎస్టేట్‌నుంచి తెప్పించి పెంచారు. ఈ గడ్డి పేరు ‘డూబ్’.

-బడబాగ్ని శంకరరాజు 9440508511