హైదరాబాద్
వరద ముప్పు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోతట్టు ప్రాంతాలు జలమయం, బిక్కుబిక్కుమంటున్న నగరం ఒకరి మృతి, మరొకరు గల్లంతు
రోడ్లు జలమయం సాగర్కు పెరిగిన ఇన్ఫ్లో రంగంలోకి ఎన్డిఆర్ఎస్ బృందాలు
ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీలు: సిఎం ఆదేశం అర్ధరాత్రి భారీ వర్షం
గోల్నాకలో కూలిన గోడ..గాంధీనగర్లో కూలిన నాలా ప్రహరీ రోడ్లు నిర్మానుష్యం
జంట జలాశయాల్లోకి భారీగా చేరుతున్న నీరు జలసౌధలో కంట్రోల్ రూం... 23390794
బండారి లే అవుట్లో నివాసితుల తరలింపు రాంగోపాల్పేట ఠాణా భవనం పదిలమేనా?
అల్వాల్లో అత్యధికంగా 25 సెం.మీల వర్షం ఒకే రోజు 48 శిథిల భవనాల కూల్చివేత
ముంపు ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ పర్యటన 98 పునరావాస కేంద్రాలు సిద్ధం
***
హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరంలో అర్ధరాత్రి వరకూ కురిసిన భారీ వర్షంతో ఎపుడు ఏం జరుగుతుందోనన్న భయం నగరవాసులను వెంటాడుతోంది. మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతారణ శాఖ హెచ్చరికలు..మరో వైపు మూడు రోజుల క్రితం నీట మునిగిన ప్రాంతాల్లో ఇంకా నీటిలో ఉండటం..సహాయం కోసం సైన్యాన్ని రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో నగరవాసులు ఏమవుతుందోనని క్షణక్షణం భయపడుతున్నారు. మూడురోజుల పాటు కురిసిన వర్షాలకు సికిందరాబాద్లో సంతోష్ అనే వ్యక్తి మృతి చెందాడు. పాతకాలం భవనంలో కొనసాగుతున్న రాంగోపాల్పేట పిఎస్ కూలేందుకు సిద్దంగా ఉంది. ముందుజాగ్రత్త చర్యగా శుక్రవారం ఒక్కరోజే జిహెచ్ఎంసి అధికారులు 48 శిథిల భవనాలను కూల్చివేశారు. ఈ సీజనల్ అధికారులు కూల్చివేసిన భవనాల సంఖ్య 376కు చేరింది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రప్పించేందుకు శుక్రవారం మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గురువారం అర్థరాత్రి నుంచి కూడా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు చిరుజల్లులు కురిశాయి. ఫలితంగా మెట్రోపనులు జరుగుతున్న విఐపి జోన్లోని లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్పేట, అసెంబ్లీ, నాంపల్లి ఇతరాత్ర చౌరస్తాల్లో రోడ్లు బాగా గుంతలమయం కావటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. గోల్నాకలో ఓ గోడ కూలింది. మిగిలిన ప్రాంతాల్లో ప్రజలెక్కువగా రోడ్లపైకి రాక, పలు రహదార్లు ఖాళీగానే కన్పించాయి. అతిభారీ వర్షాలు కురిసిన బుధ, గురువారాల్లోని పరిస్థితులను గమనిస్తే నగరంలో శుక్రవారం ట్రాఫిక్ సమస్య కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. జిహెచ్ఎంసి పరిధిలోని విద్యాలయాలకు శుక్ర,శనివారాలు రెండురోజుల పాటు సెలవులు ప్రకటించటంతో వానల తీవ్రతను గుర్తించిన ప్రజలు ఎక్కువగా బయటకు రాలేదు. శుక్రవారం నగరంలోని ప్రధాన రహదార్లలో రాకపోకలు సాగించిన వాహనాలు, ప్రజల సంఖ్యను గురువారం నాటితో గమనిస్తే బాగా తగ్గింది. ఉదయం ఎనిమిది గంటల తర్వాత అపుడపుడు చిరుజల్లులు కురిసినా, ఆ తర్వాత పెద్దగా వర్షం కురవేదు. హుస్సేన్సాగర్కు వరద నీటి ప్రవాహం పెరిగి, సాయంత్రం స్వల్పంగా తగ్గింది. గాంధీనగర్లో సాగర్ సర్ప్లస్ నాలా జిఆర్సి ఐఏఎస్ అకాడమీ వద్ద ప్రహరీగోడ కూలటంతో దిగువ ప్రాంతాలైన సబర్మతినగర్, వివి గిరినగర్, చాచానెహ్రూ నగర్, అరుంధతినగర్, అశోక్నగర్, గాంధీనగర్ ప్రాంతాల ప్రజలు ఎపుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. అంతేగాక, హుస్సేన్సాగర్ నీటి మట్టం, విడుదల చేస్తున్న ఔట్ఫ్లోకు సంబంధించి రకరకాల పుకార్లు షికారు చేస్తుండటం వల్లే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారే తప్పా, ట్యాంక్బండ్కు ఎలాంటి హానీ లేదని, ఇన్ఫ్లోకు తగిన విధంగా అవసరమైనపుడుల్లా ఔట్ ఫ్లోను పెంచుతున్నామని జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు.
కాప్రాలో కూలిన వృక్షాలు.. విరిగిన కరెంట్ స్తంభాలు
కుషాయిగూడ: భారీ వర్షలతో కాప్రా సర్కిల్లో కాప్రా, ఎఎస్రావునగర్, కుషాయిగూడ, చర్లపల్లి, మీర్పేట్ హెచ్బికాలనీ డివిజన్లలో భారీ వృక్షాలు కూలాయి. ఈదురుగాలులతో కూలి కరెంట్ స్తంభాలపై పడిపోవడంతో లాండ్మార్క్ అపార్టుమెంట్, సాకేత్కాలనీ, జైజవాన్నగర్లో రాత్రి నుంచి కరెంట్ సమస్యల ఏర్పడింది. కుషాయిగూడలోని న్యూగాంధీనగర్, భవాణినగర్, వీరాట్నగర్, అశోక్కాలనీ, పూర్తిగా వర్షపునీటిలో మునిగిపోయి కనీసం ఇళ్ల నుంచి బయటికి రావడం ఇబ్బందిగా ఉందని స్థానికుడు నర్సింహ్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి చెరువు పొంగడంతో చిన్నచర్లపల్లి, జేఎన్ఎన్యూఆర్ కాలనీకి వెళ్ళేదారిలో పూర్తిగా వర్షపునీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చర్లపల్లి భారత్నగర్ కాలనీలో లోతట్టు కాలనీలు వర్షపునీరు చేరిపోవడంతో చిన్న పిల్లలకు తీవ్ర ఇబ్బందులు గురైయ్యరని కాలనీ మహిళ యాదమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియగాంధీనగర్, బిజెఆర్నగర్, మారుతీనగర్, పూకాట్, టీచర్స్కాలనీలో మోకాళ్ల లోతు నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు గురైన అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కుషాయిగూడలో బిఎన్రెడ్డినగర్, మారుతీనగర్, జమ్మిగడ్డ, సాయిలోక్కాలనీలో నాలాలు పోంగిపోర్లడంతో కాలనీలోకి వర్షపునీరు చేరిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాప్రా చెరువు
కాప్రా చెరువు మత్తడి ఉద్ధృతంగా ప్రవహిస్తుడంతో చెరువు నాలాలు పొంగిపోర్లుతూ లోతట్టు ప్రాంతాలు అశోక్కాలనీ, దాబాగార్డెన్, డిఆర్ఎల్ కాలనీ పూర్తిగా నీట మునిగిపోయాయి. చెరువు మత్తడి ప్రవాహంతో జనప్రియ అపార్టుమెంట్ ప్రహారీ గోడ కూలినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షలకు కాప్రా మున్సిపాల్ విభాగాల అధికారులు రాత్రి నుంచి కార్యాలయం ఉంటునే ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సరోజ తెలిపారు. కాప్రాలోని ప్రతి నాలాలను 15 జేసిబిల సహాయంతో పేరుకుపోయిన చెత్తను తొలగించామని చెప్పారు.
కూలిన కరెంట్ స్తంభాలు
భారీ వర్షలతో కాప్రా లాండ్మార్క్, సాకేత్ అపార్టుమెంట్ల సమీపంలోని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందుల పడ్డామని కాలనీ ప్రజలు తెలిపారు. విద్యుత్ స్తంభాలు కూలిన విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ సిఎండి రఘమారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఇ మోహన్రెడ్డి, డిఇ సుచిచంద్రర్, ఎడిఇ శ్రీనివాస్రెడ్డి సందర్శించి వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
లాలాపేట్లో బస్తీలను ముంచెత్తిన నాలా
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాలనీలు బస్తీలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వర్షం నీరు నిండిపోయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో లష్కర్లోని పలు ఇళ్లలోకి వాన నీరు చేరడంతో రాత్రిళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మహమ్మద్గూడ నాలా ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. నియోజకవర్గంలోని అన్ని నాలాలు వర్షపునీటితో పొంగిపొర్లుతున్నాయి. లాలాపేట్ చంద్రబాబునాయుడు నగర్ మీదుగా ప్రవహించే నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మల్కాజిగిరి ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురువడంతో వరుసగా గొలుసుకట్టు చెరువులు నిండిపోవడంతో కిందికి వదిలి చంద్రబాబునాయుడు నగర్ నాలా ద్వారా నాచారం చెరువు అటు నుంచి హెచ్ఎంటి చెరువు నేరుగా ఉప్పల్కు చేరుకుంటుంది. మల్కాజిగిరిలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి వరుసగా ఉన్న అన్ని చెరువులు నిండి పొంగిపొర్లుతుండడంతో లాలాపేట్ నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రక్కనే ఉన్న చంద్రబాబునాయుడునగర్, ఇందిరానగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలను ముంచెత్తింది. ఈ ప్రాంతంలో పలు నివాసాల్లోకి వర్షపునీరు చేరడంతో ప్రక్కనే ఉన్న ఫంక్షన్హాల్లో బాధితులకు తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. రాత్రి లాలాపేట్లోని బస్తీలు, కాలనీలలోకి వరద నీరు వస్తుందని తెలుసుకున్న మంత్రి పద్మారావు స్థానిక కార్పోరేటర్ ఆలకుంట సరస్వతితోపాటు తెరాస పార్టీ శ్రేణులు జిహెచ్ఎంసి సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకవైపు వర్షపు కురుస్తున్నప్పటికీ మంత్రి సికిందరాబాద్ నుంచి లాలాపేట్కు బయలుదేరారు. ఆలుగడ్డబావితోపాటు తార్నాక రైల్వేడిగ్రీ కళాశాల, లాలాపేట్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రక్కనే రైల్వే వర్క్షాపులో ఉన్న బతుకమ్మ కుంట నిండి వరదనీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో మంత్రి కాన్వయ్ని వదిలి కాలినడకన వర్షపునీటిలో దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి లాలాపేట్కు చేరుకున్నారు. లాలాపేట్లోని పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి బాధితులకు దైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. లాలాపేట్ నాలాను ఆధునీకరించినప్పటికీ రికార్డు స్థాయిలో వచ్చిన వర్షపునీటితో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. భవిష్యత్లో ఏమాత్రం సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని బాధితులను ఓదార్చారు. అధికారులు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు నిరంతరం అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి వివరించారు.
రైళ్లరద్దుతో ప్రయాణికుల పరేషాన్
వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు రవాణా మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు చెరువులు పొంగిపొర్లడంతో రోడ్లు తెగిపోవడంతోపాటు బిడ్జ్రిలు కూలిపోయిన సంఘనలున్నాయి. అదే సమయంలో రైలు పట్టాల పై నుంచి వర్షపునీరు ప్రవహించడడంతో పలు ప్రాంతాల్లో రైలు మార్గాలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేసి యుద్దప్రాతిపదికన పునరుద్దరణ చర్యలు చేపట్టారు. సత్తనపల్లి-పిడుగురాళ్ల మధ్య రైల్వేట్రాక్ దెబ్బతినడంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు తెగిపోవడంతో రోడ్డు రవాణా స్తంబించిపోయింది. దీంతో ప్రయాణీకులు రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు. రైలు మార్గాలు సైతం దెబ్బతినడంతో ఈ ప్రాంతాల్లో నడిచే రైళ్లను ఆకస్మికంగా రద్దు చేయడంతో తెలియని ప్రయాణీకులు రైల్వే స్టేషన్లకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. వివిధ ప్రాంతాలకు తప్పనిసరి బయలుదేరాల్సిన ప్రయాణీకులు రైల్వే సికిందరాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో రైల్వేస్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడింది. చాలా వరకు రైళ్లు రద్దయినప్పటికి నడుస్తున్న రైళ్లలో ప్రయాణీకులు క్రిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఏ రైలు ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాని తెలియని అయోమయ పరిస్థితిలో గంటల తరబడి ప్రయాణీకులు పడిగాపులు కాశారు. యుద్దప్రాతిపదికన పునరుద్దరణ పనులు జరుగుతున్నప్పటికి రద్దయిన రైళ్లను ఎప్పటికి నడుపుతారో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు మరో ఐదు రోజులపాటు భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరికలు జారీ చేయడంతో రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. దాదాపు అన్ని నదులు,వాగులు,చెరువులు నిండి పొంగిపొర్లుతుండడంతో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో వరదనీరు ఉప్పొంగితే మరిన్ని రైళ్లురద్దు కాకతప్పని పరిస్థితి. దీంతో ఇటు రోడ్లు తెగిపోయి, మరోవైపు రైళ్లు కూడ రద్దయితే రవాణా పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా గురు,శుక్ర వారాల్లో రైల్వేప్రయాణీకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికిందరాబాద్ స్టేషన్లో రైళ్ల రద్దు తెలియని ప్రయాణీకులు వర్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ స్టేషన్కు చేరుకుని గంటల తరబడి రైళ్లకోసం ఎదురుచూస్తున్నారు.
మల్కాజిగిరిలో అత్యధిక వర్షపాతం నమోదు
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో గడచిన 24 గంటలో భారీ వర్షపాతం నమోదయింది. గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. కుంభ వృష్టిగా కురిసిన వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన జ్యోతినగర్, హనుమాన్పేట ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఎగువ ప్రాంతమైన మహేంద్రహిల్స్, ఇందిరానెహ్రూనగర్, జెఎల్ఎస్ నగర్ నుంచి వరద ఉప్పెనలా రావటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోనికి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ముంపునకు గురయిన బాధితులు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షం ధాటికి ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని సత్తిరెడ్డినగర్, పివిఎన్ కాలనీ, దుర్గానగర్, ఎన్ఎండిసి కాలనీ , షిర్డీనగర్, ఎపిఐసిసి కాలనీల్లోకి వరదనీరు చేరటంతో ఇక్కడ నివసించే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. భారీగా కురిసిన వర్షానికి వివిధ ప్రాంతాల నుంచి బండచెరువుకు వరద పోటెత్తింది. దీంతో చెరువు గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. చెరువు పరిసరాల్లో నివసించే ఇళ్లలోనికి వరదనీరు చేరటంతో డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్సింగరావు సహాయక చర్యల్లో పాల్గొని అధికారులకు తగిన సూచనలు చేశారు. కాగా, మల్కాజిగిరి ప్రాంతంలో అత్యధికంగా కురిసిన భారీ వర్షానికి ఇక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. దుర్గానగర్లో శుక్రవారం కాంగ్రెస్ మల్కాజిగిరి ఇన్చార్జి నందికంటి శ్రీ్ధర్, మల్కాజిగిరి సర్కిల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి శ్రీనివాస్గౌడ్, సీనియర్ నాయకుడు వి.శ్రీనివాస్ గౌడ్, శంకర్గౌడ్ తదితరులు బాధితులను పరామర్శించారు. వర్షం సృష్టించిన బీభత్సానికి గౌతంనగర్ డివిజన్లో చెట్ల కొమ్మలు విరిగి పడి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సంబంధిత అధికారులు సకాలంలో స్పందించక పోవటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు విద్యుత్ తీగలపై విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించారు. గడచిన 24 గంటలో నగరంలోనే అత్యధికంగా మల్కాజిగిరిలో కురిసిన భారీ వర్ష బీభత్సం వల్ల ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త ఊరట చెందుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురవక పోవటంతో కాలనీలు, బస్తీలల్లో చేరిన వరదనీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నం కావటంతో బాధిత ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.