ఈ వారం స్పెషల్

అల్లుకుపోతున్న అంతర్జాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు
వాట్సాప్ వినియోగదారుల
సంఖ్య.. 91 కోట్లు
‘నెటిజన్ల’లో ట్విట్టర్ వాడుతున్న
వారు.. 23 శాతం
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పంచుకున్న’
ఫొటోల సంఖ్య.. 400 కోట్లు
అతిపెద్ద ‘ప్రొఫెషనల్ నెట్‌వర్క్’గా
అవతరించిన ‘లింక్డ్‌ఇన్’ విస్తరించిన
ఏరియా.. 200 దేశాలు
... ఇవన్నీ అతిశయోక్తులు కావు, అభూత కల్పనలు అంతకన్నా కావు. కుగ్రామాల ముంగిళ్లకు సైతం ‘అంతర్జాల’ సేవలు అందుబాటులోకి రావడంతో అన్నివర్గాల వారినీ సామాజిక మీడియో సమ్మోహన పరుస్తోంది. ‘ఆన్‌లైన్’ను వినియోగించుకోవడం ఇపుడు హోదా కాదు, నిత్యావసరమై పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల జీవనశైలిలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. ‘కంప్యూటర్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్’ అన్న మాటకు కాలం చెల్లింది. స్మార్ట్ఫోన్లను వాడుతూ అరచేతిలో అంతర్జాలాన్ని వీక్షించడం ఇపుడు సర్వత్రా కనిపిస్తున్న దృశ్యం. విజ్ఞానం,వినోదం, కెరీర్, వ్యాపారం, క్రయవిక్రయాలు.. ఇలా జీవితంతో ముడిపడిఉన్న ప్రతి విషయానికీ ‘ఆన్‌లైన్’ను ఆశ్రయించడం సర్వసాధారణమైంది. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడం.. వీటన్నిటికీ సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మీడియాతో మమేకం అవుతోంది. కాలేజీలో చదువుల సంగతేమో కానీ- సెల్‌ఫోన్ వాడని వారే లేరు. ‘టెక్స్ట్‌బుక్’ల ఊసెత్తని వారు నిత్యం ‘ఫేస్‌బుక్’తో బిజీగా కాలక్షేపం చేస్తుంటారు. వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, గూగుల్ సెర్చి.. వీటిని వాడని వారు అరుదు. సోషల్ మీడియా ‘సమ్మోహన శక్తి’కి యువత ఇంతలా దాసోసం అవుతోంది. అందుకే- ‘జీవితమంటేనే సామాజిక మాధ్యమం’ అనంతలా పరిస్థితి మారిపోయింది.
కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు.. సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నా వారూ ఉన్నారు. ‘ఉద్యోగాలను వదిలేస్తాం.. సొంత వ్యాపారాలతో సత్తా చూపుతాం’ అంటూ సంకల్పబలంతో గెలుపుతీరాలకు చేరినవారూ ఉన్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారూ ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్టెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్.. వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలను సాధించి యువతలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.
‘నెట్’లో పడితే జాగ్రత్త..!
ఔను. రోజులు మారిపోయాయి. ‘అంతర్జాలం’లో చిక్కుకుని మనిషి తననితాను మర్చిపోతున్నాడు. ‘నెట్’ను మరిచిపోతే జీవితం నరకప్రాయమవుతుందని భయపడుతున్నాడు. ఇంటర్‌నెట్‌ను వదలలేక, వదలకుండా ఉండలేక ఆన్‌లైన్ జీవితానికి అలవాటుపడిపోతున్నాడు. జీవితంలో మనిషి చేయాల్సిన పనుల్లో చాలామటుకు కంటి ఎదుట కంప్యూటర్ లేదా ఓ స్మార్ట్ఫోన్ పెట్టుకుని, మీటనొక్కి కానిచ్చేస్తున్నాడు. ఆటలు, పాటలు, సినిమాలు, చిందులు ఒక్కటేమిటి సరదా జీవితమైనా, సీరియస్ పనీపాటా అయినా మీటింగులైనా, డేటింగులైనా ‘టింగురంగా’ అంటూ మీటలపైనే మీటవుతున్నారు. కావలసిన వస్తువుల ఖరీదు చేయడమూ, అమ్ముకోవడమూ ఆన్‌లైన్‌లోనే. ఆధునిక జీవితానికి ఇంటర్నెట్ ఓ సాధనమైపోయింది. తప్పనిసరిగా దానిపై ఆధారపడేలా చేసేస్తోంది. సంప్రదాయ జీవనవిధానాన్ని మెచ్చుకునేవారూ దీనిపై ఆధారపడక తప్పడం లేదు. లేదంటే దూసుకువెళుతున్న ఈ విశ్వప్రపంచంలో మనం అంతేవేగంగా వెనకబడతాం. మానవసంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఆన్‌లైన్ శకం నడుస్తోంది. ముఖ్యంగా గడచిన ఏడాది (2015) ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య, అప్రతిహత ప్రగతి సాకారమైంది. కొత్తసంవత్సరంలో సరికొత్త మార్కెట్‌ను సృష్టించబోతోంది. ఇంటర్నెట్ ఆధారంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాలు, వాటి పోకడపై మన జీవనవిధానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇక కొత్తసంవత్సరంలో ఆ అధునాతన వేదికలపై మనం ఏ చేయచ్చో, ఏం చేయబోతున్నామో తెలుసుకోవడం తప్పనిసరి.
వేషభాషలు మారిపోతున్నాయ్...
ఆధునిక జీవితంలో మనిషి పోకడ పూర్తిగా మారిపోయింది. హావభావ విన్యాసాలనుంచి జీవనశైలిలో వినూత్న, వింతైన ధోరణి కన్పిస్తోంది. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపాలు ఎక్కువైపోయాయి. మనిషి మాట మరిచి మీటపై ప్రేమ పెంచుకున్నాడు. మాటామంతీ కరువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడినా ఆ భాషలోనూ కొత్తకొత్త పదాలు చేరిపోతున్నాయి. కొత్త సాంకేతిక పరిభాషను పాతతరం వారూ ప్రేమిస్తున్నారు. అలాగని ద్వేషిస్తున్న వారూ లేకపోలేదు. ‘లైకులట..కామెంట్లట, షేరింగ్ అట.. ఒకడు ఎఫ్‌బి అంటాడు. మరొకరు వాట్సాప్ అంటాడు. ఇంకొకరు ట్విట్టర్ అంటారు. రీట్వీట్ అట.. ఏమిటీ గోలంతా.. నలుగురం కలిసి మనసువిప్పి మాట్లాడుకోవటం అన్నది లేకుండా పోయింది. ఇదేం జీవితం.’ అని విసుక్కునే వారి వేదనలో కొంత నిజం ఉంది. నిత్యం ఆ ‘నెట్’లో మునిగిపోతే బయటపడటం అంత తేలిక కాదు. ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ‘అదేదో టాబ్లెట్ అట. ఆ మాట వింటే భయపడి చచ్చాను. ఏం రోగమని దాన్ని వాడాలన్నారో తెలీలేదు. తీరా చూస్తే అదీ ఓ యంత్రమే. బాగుంది వరస..’ అనే వారూ ఎక్కువే. ఆధునిక సాంకేతిక పరికరాలూ, వాటి పేర్లూ కొత్తతరానికి వింతగానూ, పాతతరానికి రోతగానూ అన్పిస్తే అన్పించవచ్చు. కానీ, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వాటిని వాడుకోవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అవసరం లేకపోయినా వాడుకోవడం తప్పంటూ తప్పుపట్టే తరాన్ని నవతరం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకూ ఈ ఇంటర్నెట్, దాని ఆధారంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇతర మాధ్యమాలూ, సదుపాయాలూ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులకు లోనవుతాయో, మన జీవితాలను ఎలా మారుస్తాయో అంచనావేయడం తక్షణ కర్తవ్యం. ఈ కొత్తజీవితాన్ని స్వాగతిస్తారా...విసుక్కుంటూ అలవాటుపడతారా అన్నది వేరే విషయం. కానీ ఏం జరగబోతోందో తెలుసుకోకతప్పదు.
ఇంటర్నెట్
కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉన్నవారికి ఇంటర్నెట్ ఉండటం నేడు పరిపాటైపోయింది. దీనిద్వారా దేనికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి ఎన్నోమార్గాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. 2014 డిసెంబర్ నాటికే మనదేశంలో 30.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారుంటే 2015 జూన్ నాటికి ఈసంఖ్య 35.4కోట్లకు పెరిగింది. ఇది అమెరికా జనాభాతో సమానం. 2017 నాటికి ఈ సంఖ్య 40కోట్లకు చేరుతుందని అంచనా. ఇక ఇంటర్నెట్‌ను కంప్యూటర్ ద్వారా (డెస్క్‌టాప్) వినియోగిస్తున్నవారికంటే మొబైల్, స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగిస్తున్న వారే అధికం. భారత్‌లో 35.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదార్లుంటే వారిలో 15.9 కోట్లమంది మొబైల్‌ఫోన్లద్వారా నెట్‌ను వాడుతున్నవారే ఉన్నారు. ఆ సంఖ్య డిసెంబర్ 2015నాటికి 21.3కోట్లకు పెరిగిందంటే ఫోన్ ద్వారా నెట్ వినియోగానికి ఎంత ప్రాధాన్యం లభించిందో అర్థమవుతుంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 31.4 కోట్లకు పెరుగుతుందని ‘అసోచామ్’ అంచనావేస్తోంది. ఇప్పుడు పట్టణాల్లో విస్తృతంగానూ, పల్లెల్లో ఒకమోస్తరుగాను ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మున్ముందు పల్లెపల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ ఆలోచనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి భారతావని ఇంటర్నెట్ సామ్రాజ్ఞిగా మార్చేసే అవకాశం ఉంది.
గూగుల్ ముందంజ
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌కు కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్‌లో 64.9 శాతం మార్కెట్‌ను గూగుల్ సొంతం చేసుకుంది. యాహు, బింగ్ వంటివి గూగుల్‌కు దరిదాపుల్లో లేవు.
ఫేస్‌బుక్
కబుర్లు, మాటామంతీ, వ్యాఖ్యలు, వీడియో, ఫొటో షేరింగ్, చాటింగ్‌కు వీలుగా జనం చేతిలో వేదికగా మారిపోయిన ఫేస్‌బుక్ మున్ముందు సరికొత్త సౌలభ్యాలను అందించనుంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో 56శాతంమంది విధిగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. డిసెంబర్ -2014 నాటికి ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లమంది అయితే గత ఏడాది డిసెంబర్ 2015నాటికి ఈ సంఖ్య 13.2కోట్లకు చేరింది. సోషల్ నెట్‌వర్క్ వినియోగంలో 54.4 శాతంతో ఫేస్‌బుక్ ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోనూ ఇదే పోకడ ఉంటుంది. కొత్త ప్రాంతాల్లో, ముఖ్యంకా చైనాలో ఫేస్‌బుక్ కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశాలున్నాయి.
వాట్సాప్
భారత్‌లో ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య అక్షరాలా 90కోట్లు. టెక్స్ట్, ఫొటో షేరింగ్ యాప్‌ను చిన్నాపెద్దా నిరంతరం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలు చిన్నబోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు బిజీ అయిపోయాయి. స్నాప్‌చాట్, వియ్‌చాట్, లైన్ వంటి ఇతర ఫొటోషేరింగ్ యాప్‌లు పోటీలో ఉన్నప్పటికీ అది పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. వాట్సాప్ ఇప్పుడు కేవలం, మెసేజింగ్, ఫొటో షేరింగ్, చాటింగ్‌కే పరిమితమైంది. మున్ముందు వీడియో ఛాటింగ్ అవకాశంకూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే ప్రభంజనమే. ఇప్పటికే అనేక సేవలు, చాలావరకు ఉచితంగా అందిస్తున్న యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు యాప్‌ల వల్ల ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. ఏ సమాచారాన్నైనా, సేవలనైనా యాప్స్‌ద్వారా చాలావరకు ఉచితంగా పొందే అవకాశాన్ని అందించి తద్వారా వ్యాపారాన్ని వృద్ధిచేసేలా కొత్తరకం యాప్‌లను రూపొందిస్తున్నాయి.
యూ ట్యూబ్
వీడియోషేరింగ్ అవకాశం ఉన్న ఈ మాధ్యమానికి ఆదరణ ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ కన్నా వెనుకబడే ఉంది. నిజానికి మనదేశంలో 7 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు సైతం యూ ట్యూబ్ వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతం, గేమింగ్, జంతువులకు సంబంధించిన దృశ్యాలను వీరు వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కానీ, ఈ జనరేషన్ పట్టించుకోవడం లేదు. వివిధ వెబ్‌సైట్లలో వీడియో యాడ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూ ట్యూబ్ సహాయంతో వీడియోయాడ్ మార్కెట్ మున్ముందు మరింత విస్తృతం కానుంది. బింగ్, యూట్యూబ్ వంటి సంస్థలు ఇప్పటికే వీడియోయాడ్ ప్యాకేజీలు ప్రకటించాయి. వాటికి మంచి స్పందనకూడా లభిస్తోంది. గూగుల్‌కూడా ఇప్పుడు ‘ఇన్-సెర్ప్’ వీడియో అడ్వర్టయిజింగ్ విధానాన్ని తీసుకొస్తున్నది.
ఇన్‌స్టాగ్రామ్
ఈ ఫొటోషేరింగ్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య మనదేశంలో 40 కోట్లు. రోజుకు 80 మిలియన్ ఫొటోలను వీరు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. ట్విట్టర్ కన్నా దీని వినియోగదారులే ఎక్కువ. మున్ముందు ఈ యాప్ మరికొన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాన్ని, మార్కెట్‌ను పెంచుకున్న ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలకు వేదికకాబోతోంది.
ట్విట్టర్
ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో 17శాతంమంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నవారితో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2.6 కోట్లమంది నెట్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. 2.2 కోట్లమందితో భారత్ రెండోస్థానంలో ఉంది. మనదేశంలో గతేడాది 1.7 కోట్లమంది ట్విట్టర్ వినియోగదారులుంటే డిసెంబర్-15నాటికి 2.2కోట్లకు ఆ సంఖ్య పెరిగింది. మరో మూడేళ్లలో 16కోట్లమంది ట్విట్టర్ ఖాతాదారులుంటారని అసోచామ్ అంచనావేసింది. గతేడాది ట్విట్టర్‌కు పెద్దగా కలిసివచ్చిందేమీలేదు. వినియోగదారుల సంఖ్య పెరిగిందికానీ ఆదాయంలో గణనీయమైన మార్పు లేదు. కొత్త ఫీచర్లు ప్రవేశపెడితే దశ తిరగవచ్చు. కొత్త ఎమోజీ టూల్స్, అభివృద్ధి చేసిన ‘ఎంగేజ్‌మెంట్ ఆప్షన్స్’ తీసుకొస్తే మంచిరోజులే. ట్విట్టర్‌ను ఈ ఏడాది గూగుల్ కొనుగోలు చేస్తుందని, గూగుల్ ప్లస్‌కు బదులు దీనిని ప్రమోట్ చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
ఏటేటా ఎంతో వృద్ధి..
అంతర్జాల వినియోగం, అంకుర పరిశ్రమల (స్టార్టప్స్) ఆవిర్భావం, సామాజిక మీడియా జోరు, ఇ-కామర్స్‌లో క్రయవిక్రయాలు వంటి విషయాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి మన దేశంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, కొత్త సంవత్సరంలో వీటి వృద్ధి మరింత అధికం కాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటికీ ‘అంతర్జాలం’ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. మన దేశంలో అంతర్జాల వినియోగం 2014లో కంటే 2015లో దాదాపు 49 శాతం వృద్ధి చెందింది. ‘నెట్’ వినియోగదారుల్లో 60 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ సేవలు పొందుతున్నారు. 2015 అంతానికి ‘నెటిజన్ల’ సంఖ్య 213 మిలియన్లు దాటుతుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా టెలికామ్ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తరింపజేసింది. మన దేశంలో కళాశాల విద్యార్థులు రోజుకు కనీసం 8 గంటలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు 5 నుంచి 8 గంటల సేపు, పాఠశాల విద్యార్థులు వారాంతపు సెలవుల్లో 3-4 గంటలు ‘అంతర్జాలం’తో గడుపుతున్నారు. ఇంటాబయటా ‘నెట్’ వినియోగం పెరగడంతో కార్యాలయాల్లోనే కాదు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో, బస్సుల్లో, రైళ్లలో ‘వైఫై’ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద వసతి పొందేవారికి ‘ఉచిత వైఫై సౌకర్యం’ అంటూ హోటళ్లు, ఉమెన్స్ హాస్టళ్లు ప్రచారం చేస్తున్నాయంటే ‘నెట్’ వాడకం ఎంతగా అనివార్యమైందో ఊహించవచ్చు. ‘నెట్’ సౌకర్యం కల్పించే టెలికామ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రైవేటు సంస్థల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులన్ని తమ వలలో వేసుకునేందుకు ప్యాకేజీల ఆఫర్లు, రాయితీల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ‘కొత్త’ అనుకుంటున్నది రేపటికి ‘పాత’ అయిపోతోంది. వేగవంతమైన ‘నెట్’ సేవలు అందించేందుకు 2జి,3జి, 4జి.. ఇలా ఎప్పుడు ఏ ‘ప్రోడక్టు’ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేస్తుందో, ఏది ఎంత తొందరగా అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోదారులను మెప్పించడానికి ‘ప్రచార యుద్ధం’ జోరుగానే సాగుతోంది. విజ్ఞానం, వినోదంతో పాటు పలురకాల సేవలందించేందుకు విభిన్న ‘యాప్స్’ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి బ్రౌజర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ‘నెటిజన్ల’ సంఖ్యతో పాటు వారి ఆకాంక్షలు, అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో స్టార్టప్స్, ఇ-కామర్స్, సోషల్ మీడియా వృద్ధి భారీగానే ఉంటుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగంలోకి వచ్చాక అత్యధిక జనాభా ఉన్న భారత్ ఐటీ సంస్థలకు కల్పతరువుగా కన్పిస్తోంది. ప్రభుత్వాల ప్రాధామ్యాలు కూడా వాటికి అనుకూలంగానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు ధారాళంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో మేలిమార్పులు తప్పవు. కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక వాటి వినియోగంలో విచక్షణ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. విపరీతపోకడలకు పోయి దుర్వినియోగం చేస్తే మిగిలేది అనర్థమే. *

-మధురిమ