అనంతపురం

ఎంతటి వీరుడవో తెలిసెరా! (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింట్లోంచి ‘‘కెవ్వు’’మని అరిచింది విశాలక్షి. అదొక పెద్దకేక.
హల్లో కూర్చుని టి.వి. చూస్తున్న మేజర్ ప్రతాపరావ్ ఉలిక్కిపడ్డాడు. అంతలోనే కెవ్వు, కెవ్వుమని మరో రెండు అరుపులు అరిచింది విశాలక్షి.
దాంతో ఏమైందో ఏమోనని యమ కంగారు పడిపోతూ, సోఫాలోంచి దిగ్గున లేచి వంటింట్లోకి పరుగుతీశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
అతను వెళ్లేసరికి-
ఇంకా కెవ్వు, కెవ్వుమంటూనే చిందులు వేస్తూ కనిపించింది విశాలక్షి.
‘‘ఏమైంది విశాలా? ఏమైంది?’’ ఒక్క ఉదుటున ఆమెను చేరుకుని, భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగాడు మేజర్ ప్రతాపరావ్.
‘‘బొ...బ్బొ... బొద్దింక్కండీ..’’ అంది విశాలక్షి గజగజా వణికిపోతూ.
నవ్వాలో.. ఏడ్వాలో తెలియలేదు మేజర్ ప్రతాప్‌రావ్‌కి.
పరమ వీరచక్ర బిరుదాంకితుడైన ఈ మేజర్ ప్రతాపరావ్ భార్య ఆఫ్ట్రల్ ఓ బొద్దింకని చూసి గజగజా వణికిపోవడమా?
హతవీధి! ఎంత వైపరీత్యం?!
ఈ మాటే అన్నాడు భార్యతో.
‘‘చాల్లే ఊర్కోండి.. మీరు పరమవీర చక్ర బిరుదాంకితులని బొద్దింకకి తెలుసునా ఏమిటి? తోలుతున్న కొద్దీ మళ్లీమళ్లీ వచ్చి నామీదే వాలుతోంది! కూడితేనో, కరిస్తేనో ఇంకేవన్నా ఉందా? చూడండి.. దాని మీసాలు? ఇంతింత పొడవున వేసుకుని ఎంత అసహ్యంగా ఉందో!’’ అందామె బియ్యం డబ్బా మీదున్న బొద్దింకకేసి భయవిహల్వంగా చూస్తూ. యుద్ధ్భూమిలో అనేకమంది శతృసైనికుల్ని మట్టి కరిపించిన వీరాధివీరుడైన కొండంత భర్త అండగా ఉన్నా కూడా ఆమెలో వణుకు ఇంకా తగ్గలేదు.
‘‘బొద్దింక కుట్టడం, కరవటం ఏంటి విశాలా? నీ పిచ్చి కాకపోతే! బొద్దింకలు కుడతాయని ఎవరు చెప్పారు నీకు? అదేం చెయ్యదు.. చాల్లేగానీ ఊర్కో’’ అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు మేజర్ ప్రతాప్‌రావ్.
ఆమె - ‘‘నాకు భయం బాబూ! దాన్ని తీసి అవతల పారేసి రండి...’’అంది భర్తని బల్లిలా కరుచుకుపోతూ.
‘‘ ఏదీ - నువ్ నన్ను వదిల్తే కదా, నేను దాన్ని పారేసి రావడానికి?’’ అంటూ ఆమెను మరింత గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు మేజర్ ప్రతాప్‌రావ్.
దొరికిన ఛాన్స్‌ని మిస్ చేస్కోవడం దేనికన్నది అతని
ఉద్దేశ్యం.
అవడానికి మేజరే అయినా అతను వయసులో మాత్రం చిన్నవాడే! ఆర్నెల్లు ఇంట్లో ఉంటే, ఆర్నెల్లు ఆర్మీలో ఉంటాడు. వాళ్లకి పెళ్లయ్యి నిండా రెండేళ్లు కూడా కాలేదు. సంతానం కూడా కలగలేదింకా. అతను ఆర్మీ నుండి వచ్చి వారమే అయినందున ప్రస్తుతం పగలూ, రాత్రీ అదే ధ్యాస అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి.
‘‘ఇలాంటి పనులన్నీ రాత్రికి వాయిదా వేయండి, ఒక పక్క నేను భయంతో వణికి ఛస్తుంటే సరసానికిదా మీకు సమయం? ముందెళ్లి ఆ బొద్దింకని పారేసిరండి’’ అంది విశాలక్షి - అతని కౌగిల్లోంచి విడివడుతూ.
‘‘అటులనే దేవీ’’! అంటూ బియ్యం డబ్బాకేసి దూసుకుపోయి, ఇంకా అక్కడే తచ్చాడుతున్న ఆ బొద్దింకని చేత్తో పట్టుకుని, కిటికీలోంచి అవతలకి విసిరేశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
యుద్ధరంగంలో అతని శౌర్యానె్నప్పుడూ చూసి వుండకపోయినా, ఇపుడీ సాహస కృత్యాన్ని కళ్లారా చూసినందు వల్ల ‘అబ్బ! భయం లేకుండా బొద్దింకని ఎలా చేత్తో ఒడిసి పట్టుకున్నారో.. ఇందుకేనన్న మాట ఈయనకి పరమవీరచక్ర బిరుదిచ్చింది..’ అనుకుంది విశాలక్షి.
అదేమాట పైక్కూడా అని ‘‘ఆ చెయ్యి కడుక్కోండి.. దాని విషం అంటుకుందో ఏంపాడో..’’ అంది బెరుగ్గా, ఆ బెరుకులో కొంచెం చీదరని కలిపి.
‘‘బొద్దింక విషకీటకం కాదోయ్!’’ అని అన్నప్పటికీ, భార్య మాటను మన్నిస్తూ, సింక్ దగ్గరకెళ్లి సబ్బుతో చేతులు రెండూ కడుక్కున్నాడు. లేకపోతే బొద్దింకనంటుకున్న చేత్తో నన్నంటుకోవద్దంటుందేమోనన్న భయంతో.
అతను దండెం మీదున్న టవల్తో చేతులు తుడుచుకుంటూ ఉండగా -
‘‘అంకుల్! మీకేదో లెటరొచ్చింది..’’ అంటూ చేతిలో ఓ ఇన్‌లాండ్ లెటర్‌తో అక్కడికొచ్చాడు పక్కింటబ్బాయి టింకూ.
వాడిచేతిలోంచి దాన్నందుకుని ఓపెన్ చేశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
అందులోని విషయం చదివాక ‘‘కెవ్వు’’మని ఓపెన్ కేక వేసి అతను గజగజా వణికిపోవడం ప్రారంభించాడు.
పరమవీర చక్ర బిరుదాంకితుడైన తన భర్త అలా గజగజా వణికిపోవడం చూసి నిర్ఘాంతపోయిందీ విశాలక్షి.
‘‘ఏంటండీ..అలా వణికిపోతున్నారు? ఈ రోజుల్లో ఉత్తరాలేంటి? కొంపదీసి మా కామేశం అన్నయ్య రాశాడా ఏంటి? ఫోన్లు వాడిచావనిది వాడే. ఉత్తరాల్లో మధురిమ అని ఏవో పిచ్చిమాటలు అంటుంటాడు.. అలాంటి మధురిమ ఉత్తరం కాదా ఏంటి? అంతలాకెవ్వుమన్నారు?’’ అంది ఎంతో గాబరాగా.
అతనికి ఇవేవీ వినపడలేదు.
‘‘నేను ఆర్మీ నుండి సెలవు మీదొచ్చానని నువ్వేమి కామేశం అన్నయ్యకి ఫోన్ గానీ చేసి చెప్పావా.. ఏం?
‘‘అవును.. చేశారు.. చెప్పాను.. ఏం?’’
‘‘మీరొచ్చారని తెలిసింది. మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది కదా! అందుకని మీరున్నన్ని రోజులు మీతో గడపటానికి వస్తున్నాను..అన్రాశాడు మీ అన్నయ్య’’ అన్నాడు మేజర్ ప్రతాప్‌రావ్ ఇంకా అలాగే గజగజా వణికిపోతూ.
‘‘దానికి మీరింతగా వణికిపోవాల్సిన పనేముందీ?’’ అంది విశాలక్షి - అప్పటికీ సంగతేంటో అర్ధంకాక.
‘‘మీ కామేశం అన్నయ్యకి ఏం ఇష్టం?’’ అడిగాడు మేజర్ ఇంకా అలాగే గజగజ వణికిపోతూ.
‘‘ ఉల్లిపాయ పెసరట్టు, ఉల్లిదోశ, ఉల్లిముక్కలు దండిగా వేసిన పెరుగుపచ్చడి, ఉల్లిపాయల పేస్ట్‌తో చేసిన బీరకాయ, బంగాళాదుంపల తియ్యగూర.. ఇంకా... ఉల్లిపాయల్ని అచ్చంగా ఉడకబెట్టి పళ్లెంలో పెట్టామో.. మాయాబజార్‌లో యస్వీ రంగారావే.. మరోకటండోయ్ ఉల్లిపాయలతో చేసిన కోడిగుడ్డు పులుసు, అచ్చంగా ఉల్లితో చేసిన కోడిగుడ్డు పొరుటు... ఈ పొరుటులోనండీ, గుడ్డు ఒకటి వేసి, ఉల్లిపాయలు ఒక కిలో తరిగి వేపామంటే.. నాసామిరంగా ఒక పట్టు పడుతాడు..’’ అని బదులిచ్చి - ‘‘సమయానికి గుర్తు చేశారండీ.. మా అన్నయ్య ఓ వారం రోజులు ఉండేటట్టయితే కనీసం ఓ పాతిక కేజీలైనా ఉల్లిపాయలు అవసరం పడతాయ్... బజారుకెళ్లి తీసుకురండి..’’ అంది విశాలక్షి విష్ణుసహస్రనామం చదివినట్లు చదివింది ఏకబిగిన.
పరమవీర చక్ర బిరుదాంకితుడైన మేజర్ ప్రతాపరావ్ ‘‘కెవ్వు’’మని నిలదొక్కుకుని - ‘‘ఇంకా ఏమిష్టం?’’ అన్నాడు - తనకు తెలిసినప్పటికీ.
‘‘ ఆ భలేవారండీ.. మీరు నంగనాచి.. మీకు తెలియదా? నన్నడుగుతారేం? కంది పచ్చడంటే మా కామేశం అన్నయ్యకి ప్రాణం. కందిపప్పుని బాగా వేపి పప్పు చేస్తే గుండెరొప్పు లేకుండా తినేస్తాడు. కందిచారు కూడా బాగా ఇష్టమండీ.. కందిపప్పుని కుక్కర్‌లో బాగా ఉడికించి, పోపుపెట్టి, ముద్దపప్పు చేశామో.. కంచం ముందు నుండి లేవడనుకోండి.. కందిపప్పుతో పప్పులుసు, సాంబారూ సరేసరి ముఖ్యంగానండోయ్.. మనం మినపప్పుతో గారెలు చేసుకుంటామా - మా అన్నయ్యకి కందిగారెలంటే ప్రాణం. గారెల మీద నెయ్యి పోసుకుని బకాసురుడు తిన్నట్టు తింటాడు.. మరొకటండోయ్ కందిపప్పు ఛఛ ..కాదు..కందిపిట్టు... ఇది ఏంటో తెలుసా? కందిపప్పుని ఆవిరిమీద ఉడకబెట్టి నీళ్లు లేకుండా పొడిపొడి చేసి గ్రైండ్ చేసిన చక్కెరని, యాలకుల్ని, జీడిపప్పుని, కిస్‌మిస్‌ని, బాదంపప్పుని బాగా కలిపి దబరకు పోసి వడ్డించామంటే.. దబర ఖాళీ. కందితోనే...’’ అంటూ ఏకధాటిగా చెప్పి ‘‘కంది పప్పు ఓ పాతిక కిలోలు తెండి...’’ అని అంటున్న ఆమె మాటలకు అడ్డుతగిలి..
‘‘వాటి రేట్లు ఇప్పుడు ఎంతున్నాయో తెలుసా?’’ అని ప్రశ్నిస్తూనే - ఆ రేట్లు తనకు గుర్తురావడంతో అంతటి పరమవీరచక్ర - దబ్బున స్పృహతప్పి పడిపోయాడు.
డోంట్‌వర్రీ!
కామేశం వచ్చేలోపు స్పృహ వస్తుందిలెండి!!

- కోలపల్లి ఈశ్వర్, చరవాణి : 8008057571

పుస్తక సమీక్ష

ప్రతులకు
అష్టావధాని పణిదపు వీరబ్రహ్మం,
విశ్రాంత తెలుగుపండితులు
చాకలకొండ, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా.
చరవాణి : 99599 61070

భక్తిరసం.. ముక్తి మార్గం

భగవంతుడ్ని చేరుకోడానికి తొమ్మిది మార్గాలున్నాయి. అందులో సులభమైన మార్గం భక్తి. భక్తిద్వారానే మోక్షం సిద్ధిస్తుందని పెద్దలు చెపుతుంటారు. మోక్షప్రాప్తికి జ్ఞాన, కర్మ, భక్తిమార్గాలున్నాయని వారు మార్గనిర్దేశం చేశారు. ఇందులో జ్ఞాన, కర్మమార్గాలు ఏ కొందరికోకాని సాధ్యం కాదు. స్రీ, పురుష, బాల, వృద్ధ వయో భేదం లేకుండా కులమతాలకు అతీతంగా మోక్షానికి దగ్గర దారి భక్తి మార్గం ఒక్కటే. ఈ విషయాన్ని భాగవతంలో పోతనామాత్యుడు సులభశైలిలో మనకు అందించాడు. రామాయణ, భారత, భాగవతాల్ని ఎవరు ఎన్నిరకాలుగా రచించినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే కావ్యాలే. ఇందులో భక్తివిషయ ప్రధానంగా ఉండే భాగవతాన్ని పోతనామాత్యుడే సులభశైలిలో తెలుగువారికి అందించడం మన మహద్భాగ్యం. అందులో ప్రతి పదమూ, ప్రతిపద్యమూ పిల్లలు కూడా చదువదగినవి. ఆ కోవలోనే శారదామాత కృపతో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాలకొండ గ్రామానికి చెందిన అష్టావధాని ఫణిదపు వీరబ్రహ్మం అలవోకగా భాగవతం ఘట్టాలను టిటిడి సౌజన్యంతో కావలిలో ఉపన్యసించిన అంశాల్లో కొన్నింటిని సంకలనం చేసి లోకానికి అందించారు. ఆయన ఉపన్యాసంలో భక్తిరసం తొణికిసలాడింది. భగవంతుడి గురించి వినడం, కీర్తించడం, స్మరించడం, పాదములను సేవించడం, పూజించడం, నమస్కరించడం, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే తొమ్మిది రకాల భక్తిమార్గాల్లో వినడం వల్ల పరీక్షిత్తు మోక్షం పొందాడు. వ్యాసుని పుత్రుడైన శుక మహర్షి శ్రీమహావిష్ణువు గుణగణాల్ని కీర్తించడం వల్ల, శ్రీమహాలక్ష్మి శ్రీహరి పాదపద్మాలను పూజించడం వల్ల, విష్ణునామాన్ని స్మరించడం వల్ల ప్రహ్లాదుడు, శ్రీమహావిష్ణువును పూజించి అంగదేశాధిపతి అయిన పృథు చక్రవర్తి, అంబరీషుడు, దాస్యభక్తితో ఆంజనేయుడు, శ్రీవిష్ణు నామ సంకీర్తనతో ఖట్వాంగుడు అనే మహీపతి ముక్తిపొందినట్టు భాగవతం మనకు ఉపదేశిస్తుందని వీరబ్రహ్మంగారు తన ఉపన్యాసంలో చక్కని ఉదాహరణలతో వివరించారు. తన సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడం ద్వారా బలి చక్రవర్తికి మోక్షప్రాప్తి సిద్ధించింది. మధ్యమధ్యలో పోతనామాత్యుని విరచిత భాగవతంలోని పద్యాలను ఉంటంకిస్తూ ఆహూతులను తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు.
గజేంద్రమోక్షం కథ, ప్రహ్లాద చరిత్ర, బలిచక్రవర్తి కథ చక్కగా వివరించారు. ఈ అంశాలన్నీ సంకలనం చేస్తూ భాగవతము నవవిధ భక్తితత్వము పేరిట పుస్తకంగా వెలువరించడం ముదావహం. సర్వతోముఖ ప్రతిభాశాలి అయిన వీరబ్రహ్మం విశ్రాంత తెలుగుపండితులు, ఆపై అష్టావధాని, తన ప్రజ్ఞాపాటవాలతో తొమ్మిది భక్తి గ్రంథాలను వెలువరించారు. మరో ఏడు అముద్రిత గ్రంథాలుగా ఉన్నాయి.

- గౌతమి, 9347109377

అర్థం లేని నిశ్శబ్దం
కాల ప్రవాహంలో
జ్ఞాపకాలను పాతరేసి
ఆశల గూట్లో
బాల్యం అదృశ్యమైంది

అక్షర నిక్షిప్తమైన మెదళ్లు
అనంత విజ్ఞాన హృదయాలు
ఆకాశానికెగబాకుతున్నా
పాతాళానికి చేరుతున్నాయి

ఇంటర్వ్యూల పద్మవ్యూహాన్ని
పదవులే ఛేదిస్తుంటే
నిరుద్యోగపు చితి మంటల్లో
సర్ట్ఫికెట్లు ఆహుతవుతున్నాయి

పువ్వుల్ని వారధిగా వాడుకునే
రాజకీయ మాయాజాలం
చీకటిదార్లు చూపుతూ
జేబుల్లో వెలుగు నింపుకుంటుంది

మనిషి బ్రతకలేని మనసు
మనిషినే మర్చిపొమ్మంటుంటే
కడదాకా సాగాల్సిన జీవితాలు
అర్ధాంతరంగా నిలుస్తున్నాయి

మొదలే కాని తుది లేని
నిరుద్యోగ మహా వృక్షాలకు
రాలిపోయే పండుటాకులు
రక్ష రేకులవుతుంటే
ఆధారం కావాల్సిన చేతులే
భారాన్ని మోపుతున్నందుకు
అర్థం లేని నిశ్శబ్దం
గుండె గదుల్లో
రాజ్యమేలుతున్నది

- కుర్రా ప్రసాద్‌బాబు,
చరవాణి : 9440660988

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా...
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

మరో వరం
నవమాసాలు
నను ఊపిరిగా తలంచి
ఊపిరి ఆగే క్షణంలో....
ఈలోకంలో....నను కనులు తెరిచేలా...
నా...మలమూత్రముల మరకలను చెరిపి
తలంటి సాంబ్రాణి ధూపం వేసి
ఒళ్లో నను దాచుకుని
నా... జీవం సజీవం అయ్యేందుకు
అమృత సమానమైన క్షీరాన్ని
తలనిమురుతూ నాకందించిన
రక్తపుబొట్టు
బొట్టు బొట్టు పెరిగి
సాగరమంత లోతైనదై
నిను నింపుకుంది ప్రేమై నాలో...
ఎక్కి ఎక్కి ఏడుస్తోంది
నీపైన మమకారం
తల్లడిల్లుతోంది
నీపైన అనురాగం
పున్నమి వెన్నలను
మ్రింగే కారుచీకట్లై
నా జీవితంలో వెలుగు లేకుండా...
ఎడారిలో చెట్టులా...
మోడుబారుతావేమోనని
నను ఒంటరిగా...
వదిలెల్లిపోతావేమోనని
పీడకలై నను వెంటాడుతోంది
దేవుడా...
మరోవరం ఇవ్వు
అమ్మతోపాటు నను తీసుకుపో...
మరో జన్మలో అమ్మకు నేను మళ్లీ పుట్టనీ..

- చింతా లక్ష్మినారాయణ
ఎద్దులపల్లి, అనంతపురం జిల్లా
చరవాణి : 99088 30477

అసహనం
క్రోధం కట్టలు తెంచుకొని
పైత్యం మదమెక్కి కొట్టుకుంటే
మతతత్వం మారణ హోమం సృష్ఠిస్తే
ద్వేషం మితిమీరి అతి చేస్తే
పెద్ద తలలు పెద్దకూర, గొడ్డు మాంసంతో విందుచేస్తే
అభాండాలు అంబరాన్ని తాకితే
భూతాపం గతి తప్పి పరిభ్రమిస్తే
సమస్యలు చుట్టుముట్టించి సతమతాయిస్తే
ఉగ్రవాదం ఊచకోతలతో నరమేధం దాల్చితే
మనుషుల మధ్య వైషమ్యం కలత రేపితే
నేర, క్రూర అసాంఘిక కృత్యాలు ముదిరి మొద్దు బారితే
చిరాకూ, చింతలు చెమట పుట్టిస్తే
మనశ్శాంతి కరువయి మానసిక క్షోభ వేదనగా విజృంభిస్తే
వాతావరణ విపత్తులు వెంబడించి వేటాడితే
అనారోగ్యం మేనిలో గాయాన్ని చేసి నొచ్చుకుంటే
హింసా, విధ్వంసం నివురుగప్పి నిప్పులు చెరిగితే
మానవతా విలువలు మంటగలిపి పశువులుగా మారి..
అసన కంపంతో ఆర్థనాదాల కేకలు కరాళ నృత్యం చేసినా
అచంచల వక్రబుద్ధి వీడని నరుడు
అసహనం శీర్షాసనం వేసినా
కఠిన మనస్సు వీడని కఠోర కబోధ అసుర మృగాలు..
అసహనం కుంపట్లో మగ్గి మండి పోతున్నారు..

- డి.చాంద్‌బాష,
కృష్ణానగర్, కర్నూలు
చరవాణి : 97010 30480

అధ్యయన కాలమొక
వసంత రుతువు
సోదర భావానికీ, సౌభ్రాతృత్వానికీ
నెలవైన ఈ భారతావనిలో
భిన్నత్వంలో ఏకత్వానికి
దర్పణమైన ఈ కర్మభూమిలో
వ్యధలకూ, వేదనలకూ
ఆత్మబలిదానాలకూ చోటులేదు

ర్యాగింగ్ కాలనాగుల పడగల కింద
బిక్కుమంటున్న సోదరీమణులారా
రాక్షస క్రీనీడల గొడుగుల కింద
ఉక్కిరి బిక్కిరవుతున్న
భరతమాత ముద్దుబిడ్డలారా
ఉజ్వల భవిష్యత్తు
ఉరిపాలు చేయొద్దు

అధ్యయన కాలమొక వసంత రుతువు
కాకూడదు అది
వికృత హేలల క్రతువు
ఎదురు తిరిగి ప్రశ్నిస్తే
ఎంతోకాలం ఉండవులే
ఈ అరాచకాలు
ధైర్యంతో ఎదుర్కొంటే
తోకముడిచి పారిపోవునులే
క్షుద్ర భూతాలు!

- అన్నపురెడ్డి కొండారెడ్డి
లెక్కలవారిపల్లె, కడప జిల్లా,
చరవాణి : 99639 55545

పద్యం

ఉగ్రవాదము
ధర్మచింతన నాశియించి దైత్యులగుచు
మంచిచెడ్డలు మరచిన మనుజమృగము
లట్టుల చరియించి సల్పరే హత్యకాండ
తీవ్రముగ నెంచి తుదముట్టతెగువవలయు

సుంత కరుణయు లేనట్టి సంతకాళి
ఎచట పాదమ్ము మోపునో ఎవరికెరుక?
ఇందు గలదందులేదను సందియమ్ము
వలదు నుగ్రవాదమదుండె వసుధయంత

మానవత్వము విడనాడి దానవులుగ
ఊచకోతగ చంపెడు నుగ్రవాది
భూత జృంభణ మెక్కుడై మాప్పొనర్చు
నట్టి దుశ్చర్య వణికించె నఖిలజగతి

ఏమి యెరుగనమాయకు లెల్ల మడియ
గుండెకోతకు గురిన మెండుగాను
అంతమొనరింప పూనరే ఆధ్యులేచు
జగతి యంతయు నేకమై సుగతికొరకు

- కరణం రాజేశ్వరరావు,
హిందూపురం, అనంతపురం జిల్లా
చరవాణి: 94908 56577

కథలు, కవితలు, పద్యాలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, తపోవనం, బెంగళూరు బైపాస్, అనంతపురం -515 001 ఫోన్ : 08554 -276068

- కోలపల్లి ఈశ్వర్