జాతీయ వార్తలు
ఫైర్బ్రాండ్ యోగి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లక్నో, మార్చి 18: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన యోగి ఆదిత్యనాథ్ పార్టీలో ఓ ఫైర్బ్రాండే. ఆయన చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి పార్టీని ఇబ్బంది పెట్టినా ఆయనకు జనంలో ఉన్న పాపులారిటీయే ఆయనను కాపాడుతూ వచ్చింది. హిందూ అతివాది అయిన ఆదిత్యనాథ్ అన్ని వేదికలపైన, చివరికి ఎన్నికల ప్రచారంలో సైతం హిందూత్వ అజెండాను విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాషాయ వస్త్రాలే ధరించే ఆయన గోరఖ్పూర్ మఠాధిపతిగా కూడా కొనసాగుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా విశేష జనాదరణ కలిగిన ఆయన ఇతర మతాల వారిని హిందువులుగా మార్చడమే తన జీవిత లక్ష్యమని చెప్తుంటారు. ఆ ఆశయ సాధనకోసం పోరాడుతూ ఉంటానని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్తుంటారు.
1972 జూన్ 5న జన్మించిన ఆదిత్యనాథ్ 26 ఏళ్ల అత్యంత పిన్న వయసులో లోక్సభలో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. 1998నుంచి ఇప్పటిదాకా ఆయన అయిదు సార్లు గోరఖ్పూర్నుంచి వరసగా విజయం సాధిస్తూ వచ్చారు. 2002లో ఆయన హిందూ యువవాహినిని స్థాపించారు. అప్పటినుంచి ఆ సంస్థ ఆదిత్యనాథ్ ఓ విద్యార్థి నాయకుడి స్థాయినుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడానికి వారధిగా తోడ్పడింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని గట్టిగా కోరే ఆయన బిజెపి అధినాయకత్వంపై ఎన్నో సార్లు తిరుగుబాటు చేశారు. అయితే హిందూ ఓటర్లపై ఆయనకున్న పట్టు దృష్ట్యా బిజెపి అధినాయకత్వం ఆయనపై ఎలాంటి చర్య తీసుకునే సాహసం చేయలేక పోయింది. 2005లో ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఎటాలో ఇతర మతాలకు చెందిన దాదాపు 5వేల మందిని హిందూమతంలోకి మార్చారు. ఉత్తరప్రదేశ్ను, భారత దేశాన్ని హిందూ జాతిగా మార్చేదాకా విశ్రమించేది లేదని ఆ సందర్భంగా ఆయన ప్రకటించారు. 2007 జనవరిలో గోరఖ్పూర్లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా కొందరు జరిపిన కాల్పుల్లో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆదిత్యనాథ్ హిందువులకు న్యాయం చేస్తానని ప్రతిజ్ఞచేశారు. నిషేధాజ్ఞలను సైతం ధిక్కరించి రద్దీగా ఉండే నడిరోడ్డుపై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చివరికి ఆయనపై కేసు నమోదు చేయడమే కాక జైల్లో సైతం పెట్టారు. ఆదిత్యనాథ్ అరెస్టు మరిన్ని అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇక ఆదిత్యనాథ్ చేసిన వివాదాస్పద ప్రకటనలకు అంతే లేదు. 2015లో దేశంలో అసహనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఆయన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ను పాకిస్తానీ ఉగ్రవాది హఫీజ్ సరుూద్తో పోల్చడమే కాకుండా ఈ దేశంలోని మెజారిటీ ప్రజలే తనను స్టార్ను చేసిన విషయాన్ని షారుక్ మర్చిపోరాదన్నారు. వాళ్లే గనుక షారుక్ సినిమాలను బహిష్కరిస్తే ఆయన రోడ్లపై తిరగాల్సి వస్తుందన్నారు. అలాగే సూర్య నమస్కారాలు యోగాలో భాగమని, దీన్ని వ్యతిరేకించే వారు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లవచ్చని, లేదంటే సముద్రంలో దూకవచ్చని కూడా ఆయన అన్నారు. 2016 జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగిన మర్నాడు ఆదిత్యనాథ్ పాకిస్తాన్పై మండిపడుతూ సైతాన్నైనా మార్చవచ్చునేమో కానీ పాక్ను మాత్రం మార్చలేమన్నారు. ఇప్పటికీ ఆయనపై కొన్ని కేసులున్నాయి. అయినప్పటికీ ఆయన తాను చెప్పదలచుకున్న మాటలను చెప్పకుండా వదిలిపెట్టరు. అది పార్లమెంటు కావచ్చు.. మరోటి కావచ్చు. మరి ఇప్పుడు కులాలు, మతాలకు పెద్ద పీట వేసే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఎలా నెగ్గుకు వస్తారో, బిజెపి అజెండాను ఎలా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.
చిత్రం.. యుపి కొత్త సిఎం యోగి ఆదిత్యనాథ్