జాతీయ వార్తలు
కేరళకు 65 టన్నుల ఔషధాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/22n1_15.jpg?itok=taDHt6l1)
న్యూఢిల్లీ, ఆగస్టు 21: వరదలతో అతలాకుతలమైన కేరళలో అంటువ్యాధులు వ్యాపించినట్టు సమాచారం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. వరద తగ్గిన తరువాత వ్యాధులు ప్రబలకుండా ఉండేలా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)ని అప్రమత్తం చేసినట్టు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. గాలి, నీటి ద్వారా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉన్నందున రాష్ట్రానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఎక్కడైనా అంటురోగాలు వ్యాపించినట్టు సమాచారం అందితే తక్షణమై కేంద్ర వైద్య బృందాలను ఆ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంటురోగాలు సోకకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు ఎన్సీడీసీ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం కర్నాటకలోని కొడగు జిల్లాలో పరిస్థితి అత్యంత అధ్వనంగా ఉంది. భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తంగా మారింది.
బెంగళూరు నుంచి ఆ జిల్లాకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపారు. మందులు, సామగ్రితో బృందం తరలివెళ్లింది. కేరళలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశామని, ఏరోజుకారోజు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కేరళ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శైలజతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే 65 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులు విమానంలో తిరువనంతపురానికి తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.
క్లోరిన్ బిళ్లలు కోటి వరద పీడిత ప్రాంతానికి పంపినట్టు నడ్డా తెలిపారు. దశలవారిగా నాలుగు కోట్ల క్లోరిన్ మాత్రలు కేరళకు పంపనున్నట్టు ఆయన వివరించారు. రోడ్డు మార్గం గుండా 20 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడరు కేరళకు పంపామన్నారు. మంగళవారం నాటికి 10 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడరు చేరుకుందని, మిగతాది బుధవారం రాష్ట్రానికి చేరుకుంటుందని నడ్డా వెల్లడించారు. అదనంగా 12 ప్రజావైద్య బృందాలను కేరళకు పంపామని, బాగా దెబ్బతిన్న జిల్లాల్లో వారు సేవలందిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మరిన్ని బృందాలు, మందులు పంపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
చిత్రం..కేరళలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఔషధాలు