జాతీయ వార్తలు

ఎంపీల వేతనాలు ఇప్పట్లో పెరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పార్లమెంటు సభ్యుల వేతనాన్ని యాభై వేల నుండి లక్ష రూపాయలకు పెంచటంతోపాటు అన్ని అలవెన్సులు కలిపి మొత్తం వేతనాన్ని రెండు లక్షల ఎనభై వేలకు పెంచాలనే ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించినట్లు తెలిసింది. బిజెపి సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎంపీల వేతనాలను పెంచాలని సిఫారసు చేసింది. ఆదిత్యనాథ్‌తోపాటు అన్ని పార్టీలకు చెందిన పదిమంది ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వేతనాలు పెంచటం గురించి వివరించారు. ప్రధాని వారు చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీల వేతనాలు పెంచటం మంచిదికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ప్రస్తుతం ప్రతి నెలా యాభై వేల రూపాయల వేతనంతోపాటు నలభై ఐదు వేల రూపాయల నియోజకవర్గం అలవెన్సు ఇస్తున్నారు. వేతనాన్ని లక్ష రూపాయలకు, అలవెన్సును తొంబై వేలకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ రెండింటితోపాటు ఇతర అలవెన్సులను తొంబైవేలు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రతిపాదించారు. పార్లమెంటు సభ్యుల వేతనాలను 2010లో పెంచారు. అప్పుడు పదహారు వేలనుండి యాభైవేలకు పెంచారు. పార్లమెంటుకు హాజరైనందుకు చెల్లించే అలవెన్సును వెయ్యి నుంచి రెండు వేలకు పెంచారు. నియోజకవర్గం అలవెన్సును ఇరవై వేల నుండి నలభై ఐదు వేలు చేశారు. మాజీ ఎంపీల పెన్షన్‌ను ఎనిమిది వేలనుండి ఇరవైవేలకు పెంచారు. గత ఆరేళ్లలో పరిస్థితులు బాగా మారినందున ఎంపీల వేతనాలను బాగా పెంచాలన్నది యోగి ఆదిత్యనాథ్ ప్రతిపాదన. ఎంపీలకు గౌరవప్రదమైన వేతనాలు చెల్లించకుండా వారినుండి నిజాయితీని ఆశించలేమని పలువురు వాదిస్తున్నారు. శాసనసభ్యుల వేతనాలు బాగా పెరిగాయి, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది వేతనాలు సైతం పెరిగాయి, ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారుల వేతనాలు రెండు నుండి రెండున్నన లక్షలకు చేరినప్పుడు ప్రజాప్రతినిధులకు గౌరవ ప్రదమైన వేతనం చెల్లించకపోతే ఎలా అని వారు అడుగుతున్నారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డియేతోపాటు కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ మిత్రపక్షాలు, ఇతర అన్ని పార్టీల నాయకులు, సభ్యులు కూడా వేతన పెంపుదల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన సలహాదారులు మాత్రం వీరి వాదనతో ఏకీభించటం లేదు. ఎంపీల వేతనాన్ని నూటికి నూరు శాతం పెంచటం అసాధ్యమని వాదిస్తున్నారు. రాజకీయ నాయకులు, ఎంపీలపట్ల ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో వారి వేతనాలను పెంచితే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని పిఎంవో వర్గాలు వాదిస్తున్నట్లు తెలిసింది. పార్లమెంటు సభ్యుల వేతనాలు, అలవెన్సులను పెంచేందుకు సంబంధించిన బిల్లు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించి ఆమోదించాలనుకున్నారు, అయితే నరేంద్ర మోదీ తిరస్కరించటంతో ఇది ఆగిపోయింది.