జాతీయ వార్తలు

ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ ఏడాది రుతుపవనాలు మామూలుకన్నా మించి ఉంటాయని, పుష్కలంగా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ విభాగం మంగళవారం అంచనా వేసింది. వరసగా రెండేళ్లుగా వర్షాభావం కారణంగా వ్యవసాయ దిగుబడులు తగ్గిపోవడంతోపాటు వృద్ధి రేటు సైతం మందగించిన నేపథ్యంలో ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉంటాయోనన్న భయాలు ఈ వార్తతో కొంతమేరకు తొలగిపోనున్నాయి. ఈ సీజన్‌కోసం రుతుపవనాల ముందస్తు అంచనాను భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 106 శాతం ఉండవచ్చు. ఈ ఏడాది రుతుపవనాలు మామూలుస్థాయికి మించి ఉండే అవకాశం 94 శాతం ఉంది. మొత్తం మీద రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆగ్నేయ భారతం ముఖ్యంగా తమిళనాడులో మాత్రం మామూలు వర్షపాతం కన్నా కాస్త తక్కువ కురిసే అవకాశం ఉంది. కరవుపీడిత మరాఠ్వాడా ప్రాంతంలో కూడా మంచి వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక సగటు (ఎల్‌పిఏ)లో 90 శాతం దాకా వర్షపాతం ఉంటే దాన్ని లోటు రుతుపవనంగా పేర్కొంటారు. 96-104 శాతం మధ్య ఉండే దాన్ని మామూలు రుతుపవనంగా, అలాగే ఎల్‌పిఏలో 104-110 శాతం మధ్య ఉంటే మామూలుకు మించిన రుతుపవనంగా పేర్కొంటారు. 110 శాతానికి మించి ఉంటే అధికంగా పేర్కొంటారు. జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి)లో 15శాతం వాటా కలిగి ఉన్న, అలాగే 60 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం చాలావరకు రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. దేశంలో సాగయ్యే భూమిలో 40 శాతానికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉంది. 2015-16 సంవత్సరంలో వర్షాలు సరిగా కురవక పోవడంతో పది రాష్ట్రాలను కరవు రాష్ట్రాలుగా ప్రకటించడమే కాకుండా రైతులకు సహాయం అందించడానికి కేంద్రం దాదాపు 10వేల కోట్ల రూపాయల సహాయక ప్యాకేజిని సైతం ప్రకటించడం తెలిసిందే.