Others
రసరమ్యం తీర్థుల కీర్తనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహావిష్ణువు అవతారాల్లో పిన్న పెద్దలను తారతమ్యమేమీ లేకుండా ఆకర్షించేది శ్రీకృష్ణావతారమే. ముఖ్యంగా సాధురక్షణకు, దుర్మార్గులను శిక్షించుటకు ధర్మసంస్థాపనకై దేవకీదేవి గర్భమున శ్రీకృష్ణుడుగా జన్మించాడు. కానీ ఈ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కనుమరుగు అయ్యేదాక ఎనె్నన్నో లీలలు, మరెన్నో బోధలు, ఇంకెన్నో చేతలు వారు వీరను భేదం ఇసుమంత లేకుండా అందరూ ఆ కృష్ణ రసాయనంలో మిళితం అయినవారే. కృష్ణ అన్ననామంలోనే ఆకర్షణ రసాయనం ఉందికదా. ఇప్పటి భాషలో చెప్పాలంటే కెమిష్ట్రి కృష్ణుని ఆకారంలోను, కృష్ణుని రూపంలోను ఉంది అంటే కాదను వారెవ్వరు?అఖిల ప్రాణికోటిని అమితంగా ఆకర్షించిన అవతారవిశేషం శ్రీకృష్ణావతారమే.
కథ. కావ్యం, నాటకం, కీర్తన, గానం, అసలు ఇలా సాహిత్యసంగీతాలల్లో కృష్ణుడు లేని చోటు లేదు. సామాన్యులకెవరికైనా బిడ్డ పుట్టితే ‘ఊ’ కొడితే ఉండ్రాళ్లు, బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులు వేస్తే అరిసెలు పంచుకుని తల్లిదండ్రులు ఆనందిస్తారు. కానీ పుట్టింది ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ పరబ్రహ్మను కన్న తల్లి, పెంచిన తల్లి పవిత్రులైన దేవకీదేవి, యశోదాదేవి. వారి ఆనందాన్ని కొలిచి చూపగలమా? కేవలం ఆ తల్లులకే కాదు ఆనాటి గోపకులమంతా గోపభామలందరూ ఆ కృష్ణుని మాయలో పడినవారే. ఆక్షణమే అమాయకునిగా ప్రవర్తించి ఆ మరుక్షణమే నేను పరబ్రహ్మను అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. వీటినన్నింటిని ఎరిగిన వారు కనుక శ్రీ నారాయణ తీర్థుల వారు మాధుర్యభరితమైన కీర్తనలల్లో శ్రీకృష్ణుని బాల్యక్రీడావిశేషాలు, రుక్మిణీమనోవల్లభుడైన ఘట్టాలను పొందుపరిచారు. ఆ నారాయణతీర్థుల వారి కీర్తనల్లో మరీ ముఖ్యంగా కాళీయమర్దనం, నలకూబరుడు, మణిగ్రీవుల శాపవిమోచనం కోసం జరిపిన ఉలూకల బంధనం, యశోదాదేవికి తన చిన్ని నోట్లోనే 14 భువన భోంతరాళ్లను చూపిన విధము, పెరుగు, వెన్న కుండలతో ఎనె్నన్నిఆటలు ఇలా ఇన్నింటినీ రసరమ్యంగా కీర్తనల్లో ఆలపించారు. ఇలాంటి మధుర ఘట్టములతో శ్రీనారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణ లీలాతరంగిణి అనుసంగీత కావ్యమును రచించియున్నారు. ఈ మాధుర్య రసప్రధానమైన ఆ పరబ్రహ్మ స్వరూపమును కీర్తి స్తూ భక్తిరస ప్రధానముగాఈ కావ్యమును లోకమునకు అందించిరి. సంస్కృత పద భూయిష్టమైనను, సంగీత రస ప్రధానములై సామాన్యులకు కూడా అర్థమగునట్లు రచించబడిన ఈ కావ్యము గాన సరస్వతికి కంఠాభరణం. భక్తి కలుగుననియు, గాయకులకు కోరికలు తీరుననియు వివిధ రీతులు .. ఫలశ్రుతిలో వివరించబడినది. ఇందలి కీర్తనలు నాట్యాభినయముతో, వాద్య బృందసహితమగు రాగ, తాళ శబ్దములతో గానమొనర్చిన శ్రోతలు తన్మయులగుట సత్యం. బాల్య క్రీడలతో ప్రారంభమై ఈ కావ్యకీర్తనలు రుక్మిణికృష్ణుల వివాహంతో ముగుస్తుంటాయ. శ్రీకృష్ణ లీలాతరంగిణిలో గానామృతం వాద్యరహితముగా కీర్తించిననూ శ్రవణానందసంధాయకమే.
భూభారము సహింపలేని భూదేవి శ్రీహరిని ఇలా ప్రార్థించింది.
‘శరణం భవ కరుణామయి కురుదీన దయాళో
కరుణారస వరుణాలయ కరి రాజ కృపాళో
అధునాఖలు విధినామయి సుధియామా సుభరితం
మధుసూధన మధుసూదన హర మామక దురితమ్॥
శ్రీకృష్ణుని చిలిపిచేష్టలు పెరుగు కుండలు పగుల గొట్టుట, పెరుగు ద్రావుట, మున్నగు నేరములు వెన్నదొంగపై చేయి చూపుతూ గోపిక మనోజ్ఞముగా ఇట్లు కీర్తించి యున్నారు.
కలయ యశోదా తవబాలం -ఖ ల బాలక ఖేలన లోలం
అపహృత బహుతర నవనీతం అనుపమ లీలా నటన కృతం
కపట మానుష బాలక చరితం
కనక కందుక ఖేలన నిరతం. ఇలా పాడుకుంటూ ఉంటే సంగీతం రాకపోయినా ఆ సంగీత సాహిత్య మాధుర్యం పామరులను సైతం కట్టిపడేస్తుంది.
గోపికలు శ్రీకృష్ణ పరమాత్మకు భోజనం తినిపించి మోక్షార్థులై శ్రీలీలా మానుష విగ్రహుని ఇట్లు కీర్తించిరి.
కలభ సుందర గమన కస్తూరి శోభితానన
నళిన దళాయత నయన నందనందన
మిళిత గోప వధూజన మీనాంక కోటి మోహన
దళత సంసార బంధన దారుణ వైరి నాశన॥
ఒక గోపకాంత పుణ్యఫలము ఫలించినదని కరుణ చూపుమని మాధువుని కీర్తించు కీర్తన జగత్ప్రసిద్ధమే
పూరయ మమకామం గోపాల పూరయ మమ కామం
వాదం వాదం వందన మనుతే వారిజదళనయన గోపాల
మనే్య త్యామిహ మాధవ దైవం మాయా స్వీకృత మానుష భావం
ధన్యైరాధృత తత్త్వ స్వభావం దాతారం జగతా మతి విభవం
మత్స్యకుర్మాది దశ మహితావతార
మదన గ్రహాదవ మదనగోపాల
వాత్సల్య పాలిత వరయోగి బృంద
నరనారాయణ తీర్థ వర్థిత మోద.... ఇలాంటి భక్తి రసప్రదానమైన ఈ మాధుర కీర్తనలను బహుళ ప్రచారం గావించవలసిన విధి మనందరిపైనా ఉంది. నేటి పిల్లలకు బాల్యదశలోనే ఈ గానామృతాన్ని సేవింపచేస్తే వారు శ్రీకృష్ణుని అంత గొప్ప వీరులుగా, గొప్ప యోధులుగా గొప్ప మనుష్యులుగా కీర్తించబడుతారు. కృష్ణనామామృతం నామ పరమానందదాయకమ్... అంటూ ఎందరో గొప్ప గొప్ప గాయకులు ఈ నారాయణ తీర్థుల వారి కీర్తనలను ఆలపిస్తూ కృష్ణ్భక్తులకు ఆనందానుభూతిని అందిస్తూన్నారు. మనమూ ఆ ఆనందాబ్ధిలో మునకలు వేద్దాం రండి. నారాయణ తీర్థుల వారి కీర్తనలు ఆలపించి, విని ఆనందిద్దాం.