Others

తిరుప్పావై - తిరువెంబావై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం.
హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు. ‘తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది. అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది.
ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగా శివభక్తిని రసప్రవాహంగా తిరువెంబావైని మాణిక్యవాచకులు అనుగ్రహించారు.
గోదాదేవికి ఆండాళ్ అనే పేరు ఉంది. శ్రీవిల్లిపుత్తూర్ క్షేత్రంలో విష్ణుచిత్తులకు (పెరియాళ్ళార్) తులసివనంలో దొరికిన భూదేవి ప్రతిరూపం. అల్లారుముద్దుగా పెరిగింది. పిన్ననాటనే విష్ణ్భుక్తిని పెంపొందించుకుంది. యుక్తవయస్సురాగానే భర్తగా పెరుమాళ్ళనే పొందాలనుకుంది.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు చేపట్టిన కాత్యాయిని వ్రత విధానాన్ని తండ్రి ద్వారా తెలుసుకుని గోదాదేవి మార్గళి (శ్రీవ్రతాన్ని) ఆచరించడానికి సంకల్పించింది. శ్రీ విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, వటపత్రశాయిని (శ్రీకృష్ణునిగా) భావించి కట్టుబొట్టులతో గొల్లపడతిగా తనను రూపుదిద్దుకుని, నెచ్చెలులను గోపికలుగా, నందకిశోరుని మేల్కొల్పడానికి ఉద్యుక్తురాలైంది. నందుని ఇంటికి చేరడానికి వీలుగా, రోజుకొక పాశురం ఆలపిస్తూ నందకిశోరుని కీర్తిని గానం చేసింది. ఈ పాశురాలలో భక్తితోపాటు హాస్యము లాస్యము చోటుచేసుకున్నాయి. పాశురాలన్నీ దివ్యప్రబోధాలు. బ్రహ్మానంద తరంగాలు. మోక్షసౌధాన్ని చేరే సోపానాలు. ‘నాలాయిరం’ అనే విష్ణ్భుక్తియుతమైన దివ్యప్రబంధానికి హృదయంగా తిరుప్పావై సుస్థిరస్థానం సంపాదించుకుంది.
తిరువెంబావై మాణిక్యవాచకుల శివభక్తికి స్పందన. మధురైకి సమీపంలోని తిరువాదపూర్ వీరి జన్మస్థలం. మాణిక్యవాచకులు పాండ్యరాజుల కొలువులో ఉండేవారు. వీరి జీవితం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు నాట రామదాసువలె, రాజాజ్ఞను ధిక్కరించడం చేత కఠిన కారాగారవాసం చేశారు. రాజు తన తప్పు తెలుసుని వాచకులకు విముక్తి కలిగించడమే కాక తాను కూడా పరమ శివభక్తుడయ్యాడు.
ధనుర్మాసంలో శివాలయాల్లో మేలుకొల్పుగా పాడే తిరువెంబావై ముప్ఫది పాశురాల సంపుటి. రెండు భాగాలుగా ఉంటుంది. తిరువణ్ణామలైలో ఇరువది పాశురాలను, తిరుప్పెతుందరై క్షేత్రంలో పది పాశురాలను గానం చేశారు తిరువాచకులు. వీటిని తిరువెంబావై, తిరుప్పళి పొళుచ్చి అని వరుసగా పిలుస్తారు. నాలాయిరంలో తిరుప్పావై వలె ఇవి తిరువాచకం అను శివభక్తి రసప్రధానమైన తమిళ కావ్యంలో సుస్థిర స్థానంపొందాయి.
శివభక్తులు (అర్చకులు) ధనుర్మాసంలో తిరువెంబావై సుప్రభాత వేళ గానం చేస్తారు. తిరుప్పావై వైష్ణవ ఆలయాల్లో సుప్రభావం బదులు పాడతారు. రెండూ ఒకే విధమైన భక్తిని ప్రకటిస్తాయి. తిరుప్పావైలో ప్రకృతి సౌందర్యం, శృంగార భక్తిని ప్రకటిస్తే, తిరువెంబావైలో ధ్వని చిత్రాలు హృదయాలను రంజిల్లి చేస్తాయి. అందువల్ల ఈ వ్రతాలను ఆచరించేవారి చేష్టలలో చాలా పోలికలున్నాయి. తిరుప్పావైలో అమలిన శృంగారం మనస్సులను దోచుకుంటే, తిరువెంబావైలో తత్త్వవివేచన హృదయాలను హత్తుకుంటుంది.
ఈ రెండూ మేలుకొలుపు పాటలే అనడానికి తార్కాణంగా రెండు సంపుటులలో ఎనిమిది పాదాల పాశురాలలో చివరి పాదంలో ‘ఏలోరెంబావై’ అను పదంతో ముగియడం. అంటే మేలుకో అని అర్థం.
తిరుప్పావైలోని ప్రేమ, భక్త్భివాలను, తిరువెంబావైలోని తాత్త్విక చింతనను, అవి వర్ణించిన చిత్ర విచిత్ర దృశ్యమాలికలను, కవితా మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభతిని పొందాలంటే ఈ రెండు అమూల్య గ్రంథాలను పఠించి జన్మలను సార్థకం చేసుకోవడం అభిలషణీయం.

-ఎ.సీతారామారావు