క్రీడాభూమి
సుబ్రతా పాల్పై వేటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: డోపింగ్ టెస్టులో విఫలమైనాడన్న ఆరోపణపై ప్రముఖ భారతీయ ఫుట్బాల్ గోల్కీపర్ సుబ్రతా పాల్పై మంగళవారం తాత్కాలికంగా నిషేధం విధించారు. అయితే మరోసారి ధ్రువీకరణ శాంపిల్ టెస్టును కోరి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన అన్నాడు. గత నెల పోటీలు లేని సమయంలో నిర్వహించిన డోపింగ్ టెస్టులో పౌల్ విఫలమయ్యాడని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కార్యదర్శి కుశాల్ దాస్ చెప్పాడు. ఒక వేళ పాల్పై అభియోగం రుజువయితే ఆయన నాలుగేళ్లు నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ‘ఏఐఎఫ్ఎఫ్కు జాతీయ యాంటీ డోపింగ్ ఏజన్సీ (నాడా) రాసిన లేఖ ప్రకారం పాల్ వాడిన నిషేధిత ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ అని, ఆయనను తాత్కాలికంగా నిషేధించా’మని దాస్ విలేఖరులకు చెప్పాడు. టెర్బుటలైన్ అనేది సాధారణంగా శ్వాస సంబంధమైన ఇబ్బందుల్లోను, ఆస్తమాతో బాధపడుతున్న వారు తీసుకుంటూ ఉంటారు. దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యల్లోను దీన్ని తీసుకుంటుంటారు. అయితే అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజన్సీ(వాడా) ఈ మందును అన్ని సమయాల్లో నిషేధిత డ్రగ్స్ జాబితాలో ఉంచింది. అందువల్ల క్రీడాకారులు ఎవరైనా దీన్ని తీసుకోవలసి వస్తే ముందుగా అనుమతి తీసుకోవాలి.
అయితే తాత్కాలికంగా నిషేధం విధించినప్పటికీ పాల్ ఈ నెల 30న ఐ-లీగ్లో భాగంగా మినర్వా పంజాబ్తో జరిగే మ్యాచ్లో సొంత క్లబ్ డిఎస్కె శివాజియన్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో ఆడవచ్చా అని విలేఖరులు అడగ్గా, బి శాంపిల్ టెస్టుకోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఆయన అపీలు చేసుకోవచ్చని కుశాల్ దాస్ చెప్పాడు. అప్పుడు ఆయన ఆడవచ్చని, అయితే అపీల్కు వ్యతిరేకంగా నాడా తీర్పు చెప్పిన పక్షంలో అప్పుడు ఆ క్లబ్ మ్యాచ్ని కోల్పోవలసి ఉంటుందని దాస్ చెప్పాడు. భారత జట్టు ముంబయిలో జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నప్పుడు మార్చి 18న పాల్ మూత్రం శాంపిల్ను తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. శిబిరం సమయంలో అందరి ఆటగాళ్ల మూత్రాన్ని పరీక్షించారు. వాడా నిబంధనల ప్రకారం డోప్ ఫలితం గురించి ఆటగాడికి, వాడాకు కూడా జాతీయ యాంటీ డోపింగ్ ఏజన్సీ తెలియజేయాల్సి ఉంటుంది. మరోసారి ధ్రువీకరణ కోసం బి శాంపిల్ టెస్టును కోరే అధికారం ఆటగాడికి ఉంటుంది. అయితే దాని ఫలితం వచ్చే దాకా అతనిపై తాత్కాలిక నిషేధం కొనసాగుతుంది.
నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా ..
కాగా, తాను బి శాంపిల్ టెస్టుకోసం వెళ్తానని, తన నిర్దోషిత్లాన్ని నిరూపించుకుంటానని 36 ఏళ్ల పాల్ చెప్పాడు. 2007లో భారత జట్టుకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించిన పాల్ 2015 దాకా 86 సార్లు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. గత పదేళ్లకాలంలో తాను సాధించాల్సినదంతా సాధించానని, ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం కానీ, తన ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే పని కానీ చేయాల్సిన అవసరం తనకు లేదని అర్జున అవార్డు గ్రహీత కూడా అయిన సుబ్రతా పాల్ చెప్పాడు. పశ్జిచమ బెంగాల్కు చెందిన పాల్ దేశంలోనే అత్యుత్తమ గోల్ కీపర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.