జాతీయ వార్తలు
ఎస్పీలో ముదిరిన సంక్షోభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లక్నో, అక్టోబర్ 23: ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాది పార్టీలో, ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం అత్యంత వేగంగా సంభవించిన పరిణామాలతో ములాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఇద్దరూ బహిరంగంగానే నువ్వా, నేనా తేల్చుకుందాం అనే స్థితికి చేరుకున్నారు. దీంతో ఆ పార్టీ నిలువునా చీలిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అఖిలేష్ యాదవ్ తన బాబాయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన శివ్పాల్ యాదవ్ను, అమర్ సింగ్ అనుకూలురైన మరో ముగ్గురు మంత్రులను మంత్రివర్గంనుంచి తొలగించగా, పార్టీ అధినేత ములాయం వరసకు తన సోదరుడు, అఖిలేష్ అనుకూలుడైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ను పార్టీనుంచి బహిష్కరించారు. రాంగోపాల్ను పదవినుంచి తొలగించడంతోపాటుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఆరేళ్ల పాటు పార్టీనుంచి బహిష్కరించినట్లు యుపి ఎస్పీ అధ్యక్షుడు అయిన శివ్పాల్ యాదవ్ ప్రకటించారు. సోమవారం ములాయం సింగ్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మెగా సమావేశాన్ని ఏర్పాటు చేయనుండగా ఆదివారం ఉదయం అఖిలేష్ యాదవ్ తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో సమావేశం కావడంతో ఒకదానివెంట మరోటిగా చకచకా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం సమావేశంలో ములాయం కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించవచ్చని అంటున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసిన వెంటనే అఖిలేష్ తన బాబాయ్ శివ్పాల్తో పాటుగా కేబినెట్ మంత్రులు నారద్ రాయ్, ఓంప్రకాష్ సింగ్, సహాయ మంత్రి సరుూదా షబద్ ఫాతిమాలను మంత్రివర్గంనుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్ రామ్నాయక్కు సిఫార్సు చేశారు. గవర్నర్ ఈ సిఫార్సును వెంటనే ఆమోదించారు.
రాంగోపాల్ బిజెపితో కుమ్మక్కయ్యారని, తనను, తన కుమారుడ్ని అవినీతి కేసుల్లో సిబిఐ దర్యాప్తునుంచి కాపాడుకోవడానికి మూడుసార్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడితో భేటీ అయ్యారని శివ్పాల్ మీడియా సమావేశంలో ఆరోపించారు. మంత్రివర్గంనుంచి తొలగించినందుకు తనకు ఎలాంటి బాధా లేదని, ములాయం నేతృత్వంలోనే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మంత్రివర్గంనుంచి తనను తప్పించినట్లు తెలియగానే శివ్పాల్ ములాయం నివాసానికి వెళ్లి ఆయనతో సమాలోచనలు జరిపారు. అనంతరం ములాయం ఆదేశాల మేరకు రాంగోపాల్ యాదవ్ను పార్టీనుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
గత నెల ములాయం సమాజ్వాది పార్టీ యుపి అధ్యక్షుడిగా అఖిలేష్ స్థానంలో శివ్పాల్ను నియమించడంతో పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం మొదలైంది. అఖిలేష్కు సన్నిహితుడు, పార్టీ ఎమ్మెల్సీ ఉదయ్వీర్ సింగ్ను శనివారం సమాజ్వాది పార్టీనుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు శివ్పాల్ ప్రకటించిన 24 గంటలు కూడా కాకముందే శివ్పాల్ను మంత్రివర్గంనుంచి తప్పిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ములాయం రెండో భార్య అఖిలేష్కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ పార్టీ అధినేతకు ఒక లేఖ రాసిన కొద్ది రోజులకే ఉదయ్వీర్ను పార్టీనుంచి బహిష్కరించడం విశేషం. అంతేకాదు అఖిలేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని కూడా ఉదయ్వీర్ ఆ లేఖలో కోరారు.
చిత్రం... పార్టీలో విభేదాలకు అమర్ సింగ్ కారణమంటూ ఆదివారం లక్నోలో ఆయన ఫొటోలపై ‘చోర్’ అని రాసి బూటుతో కొడుతున్న అఖిలేష్ యాదవ్ అనుకూల ఎస్పి కార్యకర్తలు