ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం ప్రధాని కాళ్లయినా పట్టుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, ఏప్రిల్ 24: ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లయినా పట్టుకుంటానని సినీనటుడు, బాగేపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయికుమార్ పేర్కొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గానికి చివరి రోజు మంగళవారం నామినేషన్ వేయడానికి ముందు అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కుమారుడు ఆదితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సినీ కుటుంబం తరపున క్షమాపణ కోరుతున్నానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మోదీ కాళ్లు పట్టుకుని సాధించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కర్నాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బాగేపల్లిలో రహదారులు, నీటి సమస్య పరిష్కరించడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. తన తల్లిదండ్రులు చెప్పిన మేరకు బాగేపల్లి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని నృసింహస్వామి సాక్షిగా మాట ఇస్తున్నానని చెప్పారు. గతంలో అక్కడ పోటీ చేసి ఓటమి చెందానని, కుటుంబ సమస్యల కారణంగా కొన్ని సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నానన్నారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలోనే నివాస గృహం, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసి ప్రచారం కొనసాగిస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు, అభిమానుల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని సాయికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, నాయకులు ఉత్తమరెడ్డి, తలుపుల గంగాధర్, వేణుగోపాల్‌రెడ్డి, జట్టి ఆంజినేయులు, నాగేంద్ర ప్రసాద్, రాజశేఖర్, వంశీ, శివ, హరి, కేశవరెడ్డి, నాగార్జున పాల్గొన్నారు.