ఆంధ్రప్రదేశ్‌

చౌదరి అవునంటే.. నాయుడు కాదనిలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: క్రమశిక్షణకు మారుపేరయిన తెలుగుదేశం పార్టీలో చివరకు అది కరవయిపోతోంది. కీలక అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను సీనియర్లే ధిక్కరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్లు ఒకే అంశంపై పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరుకునపెడుతున్నారన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన ప్రత్యేక ప్యాకేజీ అంశంపై, అధికారపార్టీలోనే భిన్న స్వరాలు వినిపించడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్యాకేజీ అద్భుతమని, దాన్ని స్వాగతిస్తున్నామని స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమక్షంలోనే ప్రకటించారు. హోదా సాధించిన రాష్ట్రాలకు ఏమి ఒరిగిందంటూ విధానమండలిలో కూడా మాట్లాడారు. పార్టీ నేతలను కూడా ప్యాకేజీని జనంలోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు.
ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో భాగస్వామిగా ఉన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా, ఇంతకంటే మంచి ప్యాకేజీ దొరకదని,ఇది రాష్ట్రానికి లాభదాయకమని, సెంటిమెంటు-ఎకనామిక్స్ వేర్వేరని స్పష్టం చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు.
అయితే, పార్టీలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ అయిన మాజీ మంత్రి గాలి ముద్దుమకృష్ణమనాయుడు మాత్రం.. అధినేత, కేంద్రమంత్రి అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా మాట్లాడి పార్టీని ఇరికించడం చర్చనీయాంశమయింది.
‘అప్పుడు హోదా కావాలని వెంకయ్య అడిగారు. జైట్లీ కూడా పదేళ్లు కావాలని హడావిడిగా బిల్లు ఆమోదించుకున్నారు. ఇప్పుడు హోదాతో ఏం లాభమని ప్యాకేజీ ఇస్తామంటూ కాకిలెక్కలు చెప్పడం కేంద్రానికి తగదు. హోదా ఇవ్వకుండా దానికి బదులుగా లక్షల కోట్ల నిధులిస్తామనడం హాస్యాస్పద’మని గాలి ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు.
‘విభజన ముందు వరకూ బాబు హోదా గురించి అడగలేదు. 5లక్షల కోట్ల ప్యాకేజీ కావాలన్నారు. బిజెపి వాళ్లు ఇస్తామన్న తర్వాతనే కావాలన్నారు. వాళ్లు హోదా గురించి మాట్లాడకపోతే ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్లు హోదా వల్ల లాభం లేదంటున్నారు. మరి లాభం లేనప్పుడు ఇస్తే నష్టమేమిటి? అసలు హోదా అనేది బిజెపికి సంబంధించిన విషయం. దానితో బాబు కూడా ఇచ్చినవి తీసుకుందాం. పోరాడటమెందుకని అన్నారు. వాళ్లు లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు. దానిపై వాళ్లకే క్లారిటీ లేదు. మరి అన్ని కోట్లు ఇస్తే బాబు ఏం చేసినట్లు అన్న అనుమానం జనాలకు కలుగుతుంది కదా? వాళ్లే గందరగోళం రేపుతున్నారు. ఏపి జనం దిక్కులేకుండా చెట్ల కింద ఉన్నారు. ఆదుకునే వాళ్లని ఎందుకు వద్దనాలి’ అన్నారు. అయితే, దీనిపై గాలిని వివరణ కోరగా, చెన్నైలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, బిజెపి వాళ్లు చేస్తున్న ప్రచారానికి ప్రభావితులైన జనం బాబు ఏం చేసినట్లు అనే అనుమానపడతారు కదా అని మాత్రమే అన్నానని వివరించారు. దానిపై మళ్లీ వివరణ ఇస్తామన్నారు.
గాలి వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రంగా మారాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాము ఇదే విషయం చెబుతుంటే ఎదురుదాడి చేస్తున్న తెదేపా, ఇప్పుడు గాలి చేసిన వ్యాఖ్యలపై బాబు ఏమి సమాధానం చెబుతారని వైకాపా నేతలు ప్రశ్నిస్తే, పరిస్థితి ఏమిటన్న ఇరకాటం నేతల్లో కనిపిస్తోంది.
అదేవిధంగా, హోదా-ప్యాకేజీ అంశాలపై ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చి మాట్లాడుతున్న జనసేన పవన్ కల్యాణ్‌పై, ఎవరూ విమర్శలు చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే, సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ చేసిన ప్రకటన, పార్టీలో కట్టుదాటుతున్న క్రమశిక్షణను సూచిస్తోంది. ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే మళ్లీ గెలిపించుకుంటామని పవన్ చేసిన ప్రకటనపై పాత్రుడు తీవ్ర స్థాయిలోవిరుచుకుపడ్డారు.
అనకాపల్లిలో సొంత బావ అల్లు అరవింద్‌నే చిరంజీవి, పవన్ గెలిపించుకోలేకపోయారని, ఇక అవంతి శ్రీనివాస్‌ను ఏం గెలిపిస్తారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామం పవన్‌కు ఎక్కడ ఆగ్రహానికి గురిచేస్తుందోనన్న సంకటం తెదేపా నేతల్లో కనిపిస్తోంది.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి మొదలయి, అది భవిష్యత్తులో మరికొందరికి ఆదర్శమైతే పార్టీ క్రమశిక్షణ పూర్తిగా దారితప్పుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంతపెద్దవాళ్లకయినా షోకాజు నోటీసులిస్తే భవిష్యత్తులో అది ఒక హెచ్చరికగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.