ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు నీళ్లతోనే జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 29: ‘రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్‌కు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వడం ద్వారానే జవాబు చెబుతాం. పురాణాల్లోనూ జగన్ లాంటి రాక్షసులు హోమాలకు అడ్డుపడేవాళ్లు. చివరకు వారంతా ఏమయ్యారు? జగన్‌కూ అదే గతి పడుతుంది. పోలవరం పూర్తయితే జగన్ పార్టీకి పుట్టగతులుండవు. పులివెందులకూ నీళ్లివ్వడం ద్వారా ఆ నియోజకర్గ ప్రజలకు వైస్ కుటుంబ వైఫల్యాన్ని చెప్పగలిగాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిని కావడం నా అదృష్టం. పోలవరంతో చంద్రబాబు నాయుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం కాంక్రీటు పనుల ప్రారంభం సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’ తో మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. ‘పురాణాల్లో లోకకల్యాణం కోసం మహర్షుల సూచనల మేరకు పుణ్యపురుషులు యాగాలు చేస్తే అప్పుడూ జగన్ మాదిరిగానే రాక్షసులు అడ్డంకులు సృష్టించేవారు. వారిని ధీరోదాత్తంగా ఎదుర్కొని పీచమణిచేవారు. ఇప్పుడు జగన్ కూడా రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా అడ్డుపడుతున్నారు. నిర్వాసితులను రెచ్చగొడుతున్నారు. చివరకు రాష్ట్రానికి జీవధారైన పోలవరం పూర్తికాకుండా పక్కనే ఉన్న ఒడిశా నేతలను రెచ్చగొట్టి వారితో ఫిర్యాదులిప్పిస్తున్నారు. దానికోసం ఢిల్లీలో ఒక టీమునే నియమించారు. అమరావతి నిర్మాణం కాకుండా రైతులను రెచ్చగొట్టి భూములివ్వకుండా రెచ్చగొట్టినా, రైతులు పెద్దమనసుతో భూములిచ్చి జగన్‌కు గుణపాఠం చెప్పారు. అయినా జగన్‌కు బుద్ధిరాలేదు’ అని ఉమ ధ్వజమెత్తారు. ‘పోలవరం 70 ఏళ్ల ఆంధ్రుల కల. ఉమ్మడి రాష్ట్రంలో నెరవేరనిది ఇప్పుడు సాకారం కాబోతోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి పెద్దలే చంద్రబాబునాయుడి పట్టుదల చూసి ఆశ్చర్యపోయారు. వారందరితో కలిసి పనిచేయడం నా అదృష్టం. పోలవరం నిర్మాణంలో వారందరి సహకారం ఉంది. మా జట్టే పోలవరం పూర్తి చేస్తుంది. జగన్ ఏడుపుగొట్టు మొహంతో ఆ నిర్మాణాన్ని చూసి, నా తండ్రి హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయామా? అని కుళ్లుకోవలసిందే’ అని ఆయనన్నారు. ‘పోలవరం దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవబోతోంది. దీనిద్వారా 7లక్షల ఎకరాలకు సాగునీరు, 30లక్షల మందికి మంచినీరు అందబోతోంది. దేశంలోనే తొలిసారిగా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన చరిత్ర బాబు ప్రభుత్వానిదే. 10లక్షల ఎకరాలకు నీరిచ్చి రైతుల్లో ఆనందం నింపాం. పురుషోత్తపట్నం 9 నెలల్లో, భైరవనితిప్ప ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తిచేస్తాం. దానికోసం నిధులిస్తున్నాం. ఈ రెండేళ్లలోనే రూ.18,800 కోట్లు ఖర్చుచేస్తే, ఈ ఏడాది 9 నెలల్లోనే అనేక ప్రాజెక్టులకు 6 వేల కోట్లు ఖర్చుచేశాం. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికీ చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు’ అని ఉమ తెలిపారు. ‘ప్రాజెక్టుల గురించి గొంతు చించుకుంటున్న జగన్ ఆయన తండ్రి, కాంగ్రెస్ హయాంలో ఎందుకు వాటిని పూర్తిచేయలేదో చెప్పకుండా, సిగ్గులేకుండా చేస్తున్న విమర్శలు జనం చూస్తున్నారు. పులివెందులలో ఎప్పుడూ మా పార్టీ గెలవలేదు. వైఎస్ అక్కడి నుంచే పీసీసీ అధ్యక్షుడు, ఎంపి, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రీ అయ్యారు. జగన్, వాళ్ల చిన్నాన్న ఎంపీలయ్యారు. మరి అప్పుడు పులివెందులకు నీళ్లివకుండా ఏం చేస్తున్నారు? గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా? వాళ్లు నీళ్లిస్తామంటే మేం అడ్డుకున్నామా? మేం నీళ్లిస్తామని తెలిసి, ఆ క్రెడిట్ మాకు దక్కకుండా ఉండాలనే దొంగ ధర్నాలు చేశారు’ అని తూర్పారబట్టారు. ‘మా పార్టీ నేత, శాసనమండలి డెప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, తదితరులు పులివెందులకు నీళ్లు, కడప జిల్లాకు నీళ్ల కోసం పోరాడారు తప్ప అందులో జగన్ పాత్రేమీ లేదు. గండికోట పరిహారం ఇస్తామన్నా ముంపువాసులను గ్రామాలు ఖాళీ చేయవద్దని రెచ్చగొట్టి నీటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా పులివెందులకు కృష్ణాజలాలు రాకుండా ఆపలేడు. మేం సాధించిన విజయాన్ని కూడా సిగ్గులేకుండా వాళ్ల ఖాతాలో వేసుకోవడం నీచాతినీచం’ అని ఉమ అన్నారు. ‘జగన్ తండ్రి హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞమయింది. ఆ నిధులు ఖర్చుపెట్టి ఉంటే పులివెందుల, కడప ప్రజలకు ఎప్పుడో నీళ్లు వచ్చేవి. వైఎస్ ఖర్చు చేసిన రూ.55 వేల కోట్లు వాటికి కేటాయిస్తే ప్రాజెక్టులు ఎందుకు నిలిచిపోయాయి? బాబు ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ.19వేల కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమలో నీరు పారించింది. గండికోటకు నీరిచ్చింది. జనవరిలో కర్నూలు జిల్లాలో ముచ్చమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. తోటపల్లి ప్రారంభించి నీళ్లిచ్చాం. హంద్రీ-నీవాతో కర్నూలు, అనంతపురం జిల్లాలకు తాగు-సాగునీరు మోతాదు పెంచాం’ అని వెల్లడించారు. ‘పరిహారం గురించి గుండెలు బాదుకుంటున్న జగన్ గండికోట రైతులకు ఎందుకు పరిహారం ఇప్పించలేకపోయారు? పోలవరం రైట్‌బ్యాంక్ కెనాల్ రైతులకు తగిన పరిహారం ఇప్పించడంలో ఎందుకు విఫలమయ్యారు? రాష్ట్భ్రావృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జగన్ నిర్వాసితులు, రైతులను రెచ్చగొడుతున్నారు. పోలవరం పూర్తయి, జనవరిలో పులివెందులకు నీళ్లొస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి టికెట్లు అడిగే దిక్కుకూడా ఉండదు. జగన్‌కు అబద్ధాల సాక్షి పేపరు తప్ప, మనస్సాక్షి లేదు. అదే ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంత క్లిష్ట సమయంలోనూ చేస్తున్న కృషిని అభినందిచేవారు’ అని మంత్రి ఉమ స్పష్టం చేశారు.