ఆంధ్రప్రదేశ్‌

నిస్సహాయ వృద్ధురాలికి చిత్రహింసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: మంచంపై పడి ఉన్న అసహాయ వృద్ధురాలిని ఆమె బంధువైన మరో మహిళే కర్కశంగా చిత్రహింసలకు గురి చేసిన సంఘటన అందరినీ ఆవేదనకు గురిచేసింది. పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో ఉన్న 60ఏళ్ల వృద్ధురాలిని సంరక్షించే ఓపిక, సహనం లేక ఆమె అక్క కుమార్తె కర్రతో గొడ్డునుబాదినట్లు బాదడంతో పాటు, మంచంపై పడుకున్న వృద్ధురాలిని జుట్టుపట్టుకుని కొట్టిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో మానవత్వం మంటగలిసిందా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేసిన మహిళను అరెస్టు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా పెనికేరుకు చెందిన పంతం పుష్పవతి (60) అనే వృద్ధురాలి భర్త మరణించాడు. దీంతో ఆమెకు నా అన్న వారు ఎవరూ లేకుండాపోయారు. రాజానగరం మండలం నరేంద్రపురంలోని సోదరి వరసయ్యే ప్రగడ మంగాదేవికి భర్త మరణించాడు. ఆమె కూడా వ్యాధితో బాధపడుతోంది. కొంతకాలం నరేంద్రపురంలోనే కలిసి ఉన్నారు. పుష్పవతి ఓపిక ఉన్నంత కాలం కూలి పనిచేసి ఆ సొమ్మును తన బాగోగులు చూస్తున్న మంగాదేవికి ఇచ్చేది. ఏడాదిక్రితం పుష్పవతికి పక్షవాతం సోకింది. పుష్పవతికి పెనికేరులో ఉన్న కొంత ఆస్తిని తనకు రాస్తుందన్న ఉద్దేశంతో ఆమెను మంగాదేవి కొంతకాలం బాగానే చూసింది. అయితే ఆమెకు ఆస్తిని రాసిచ్చే ఉద్దేశం లేదని తేలడంతో మంగాదేవి ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించింది. గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీరిద్దరూ లాలాచెరువు హౌసింగ్‌బోర్డుకాలనీలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న పుష్పవతికి అన్నీ మంచంపైనే సేవలు అందించాల్సి రావడంతో సహనం కోల్పోయిన మంగాదేవి గత మూడు నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తోంది. ఆమెపై మరో వ్యక్తి కూడా కాలితో తన్నడం వీడియో చిత్రాల్లో కనిపించింది. ఆవ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వారి ఇంటిపక్కనే నివసించే ఒక యువకుడు మంగాదేవి కర్కశంగా పుష్పావతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించి స్థానిక నిర్భయ మహిళా సంఘం నాయకురాలు ముత్యం లక్ష్మికి పంపారు. దీంతో ఘాతుకం వెలుగులోకి వచ్చింది.ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి, మంగాదేవిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పుష్పవతికి ఉన్న ఆస్తిపత్రాలను తన పేరిట బదిలీ చేయాలనే మంగాదేవి ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్రం..సోషల్ మీడియాలో వైరల్ అయిన వృద్ధురాలిపై దాడి దృశ్యం