బిజినెస్

ఏపిలో 13,182 పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 16: పారిశ్రామికీకరణకు రాష్ట్రంలో వున్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్యతరహా, చిన్న సూక్ష్మ పరిశ్రమల వరకు వున్నాయి. ప్రభుత్వ విధానాలు - భౌగోళికంగా, ఉత్పత్తి, వాణిజ్యానికి అనుకూల పరిస్థితులతో పాటు నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉండటంతో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించడంతో పాటు ఏ పరిశ్రమకైనా కావలసిన పత్రాలన్నీ సక్రమంగా వుంటే 14 రోజుల్లోనే ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ప్రారంభించింది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఏపి పారిశ్రామిక, వౌలిక వసతుల కల్పన సంస్థ (ఎపిఐఐసి) లక్షా 21వేల 655 ఎకరాల్లో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది.
రాష్ట్రంలో ఇన్ని అనుకూల పరిస్థితులు వుండటం వల్ల సింగిల్ డెస్క్ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు 14,181 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 13,182 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారని అధికారులు చెప్పారు. అత్యధికంగా ఎనర్జీ విభాగంలో 2926 దరఖాస్తులకు ఏపిఎస్ పిడిసిఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఆమోదం తెలిపింది. ఆ తరువాత పరిశ్రమలశాఖ 1594 దరఖాస్తులకు పరిశ్రమ ప్లాన్ల అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు పొందిన వాటిలో అతి భారీ పరిశ్రమలు (మెగా ప్రాజెక్టులు), భారీ పరిశ్రమలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా అన్ని పరిశ్రమలు వున్నాయి. 811 దరఖాస్తులను తిరస్కరించారు. సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ పరిధిలో 188 దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయి. ఈ విధంగా 14 రోజుల్లో పూర్తిగా ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేసే రాష్ట్రం ఏపీ ఒక్కటేనని అధికారులు చెప్పారు.
పరిశ్రమ స్థాపించడానికి ఉత్పత్తి అయ్యే వస్తువు, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వంలోని 14 శాఖల నుంచి 20 నుంచి 30 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌర సరఫరాలు, అటవీ, భూగర్భ జలాలు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటి, సీఎస్టీ తదితర అనుమతులు పొందాలి.
గతంలో ఈ అనుమతులు పొందడానికి ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇందుకు సుదీర్ఘకాలం పట్టేది. అయితే ఇప్పుడు ఆ జాప్యాన్ని నివారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులు మొదలుకొని చిన్నతరహా పరిశ్రమల వరకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికాశాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరెంజ్ క్యాటగిరీ, పవర్ ఫీజుబిలిటీ సర్ట్ఫికేట్, బాయిలర్ సర్ట్ఫికేట్, విద్యుత్‌శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, బావుల తవ్వకం, అగ్నిమాపకశాఖ, వ్యాట్, సీఎస్టీ రిజిస్ట్రేషన్, 11 కెవి లేక 35 కెవి విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. కొన్ని పరిశ్రమలకు సంబంధించి ఉత్పత్తుల ఆధారంగా ఆయా శాఖలు కోరిన విధంగా కంపెనీలను వివరణ కోరారు. పరిశ్రమలకు కావలసిన ముడిపదార్థాలు బొగ్గు, ఆల్కాహాల్ వంటి వాటి కేటాయింపుల విధానాన్ని కూడా సింగిల్ డెస్క్ పరిధిలోకే తీసుకువచ్చారు. ఇంతటి అద్భుతమైన ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ విధానాన్ని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించిన విషయాన్ని పరిశ్రమల శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.