బిజినెస్
ఐడియాలో వొడాఫోన్ విలీనం?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జనవరి 30: బ్రిటన్కు చెందిన టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్.. భారత్లోని తమ వ్యాపారాన్ని ఆదిత్యా బిర్లా గ్రూప్నకు చెందిన టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్లో విలీనం చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సోమవారం వొడాఫోన్ గ్రూప్ తెలియజేసింది. మొత్తం షేర్ లావాదేవీల్లో జరిగే ఈ డీల్తో దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థగా వొడాఫోన్, ఐడియా విలీనానంతర సంస్థ అవతరించనుంది. భారతీ ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమయ్యే వీలుండగా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ జియో ఇన్ఫోకామ్కు గట్టి పోటీనిచ్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నాయి వొడాఫోన్, ఐడియా. కాగా, ప్రస్తుతం వొడాఫోన్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థగా ఉంది.
ఐడియా సెల్యులార్ భారత్లో మూడో అతిపెద్ద సంస్థగా ఉంది. ఈ రెండు సంస్థలు ఏకమైతే ఏర్పడే సంస్థ వినియోగదారుల సంఖ్య 387 మిలియన్లకు చేరుతుంది. అంతేగాక ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్, వినియోగదారులున్న సంస్థల్లో ఒకటిగా కూడా ఉండనుంది. అయితే ఈ డీల్లో భారతీ, ఐడియా సంస్థలతో కలిసి ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ ఇండస్ టవర్స్ లేదని వొడాఫోన్ స్పష్టం చేసింది. ఇండస్ టవర్స్లో 42 శాతం వాటా వొడాఫోన్కు ఉంది. ఇక 2007లో భారతీయ మార్కెట్లోకి వొడాఫోన్ ప్రవేశించగా, దేశీయ టెలికామ్ రంగంలో ఎయిర్టెల్ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. అయినప్పటికీ హచిసన్ కొనుగోలులో 2 బిలియన్ డాలర్ల పన్ను వివాదంతో వొడాఫోన్ ఇబ్బందుల్లో పడింది. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ వొడాఫోన్ పోరాడుతూనే ఉండగా, ఈ వ్యవహారంపై ఎప్పట్నుంచో అసంతృప్తిగా ఉన్న సంస్థ.. ఈ తాజా విలీనానికి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉచిత కాల్స్, డేటాతో మార్కెట్లో దూసుకెళ్తున్న జియో కూడా కారణమేనని, జియో వినియోగదారుల సంఖ్య నానాటికి పెరుగుతుండటం, ఇప్పుడది 74 మిలియన్లకు చేరడంతో భవిష్యత్పై వొడాఫోన్ ఆశాజనకంగా లేకపోవడం వ్యాపార విక్రయానికి కారణమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
టెలికామ్ రంగంలో ఇప్పటికే 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ జియో.. మరో 4.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఇక ఐడియా సెల్యులార్లో ఆదిత్యా బిర్లా గ్రూప్నకు 42.2 శాతం వాటా ఉంది. అలాగే మలేషియాకు చెందిన అక్సియాట గ్రూప్ బహ్ద్కు 19.8 శాతం వాటా ఉంది. వొడాఫోన్ ఇండియా మాత్రం పూర్తిగా వొడాఫోన్ గ్రూప్దే.
ఐడియా షేర్లు ఆకర్షణీయం
వొడాఫోన్తో డీల్ వార్తల మధ్య ఐడియా సెల్యులార్ షేర్ల విలువ సోమవారం ట్రేడింగ్లో ఒక్కసారిగా పుంజుకుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ)లో 25.90 శాతం పెరిగి 97.95 వద్ద ఐడియా షేర్ విలువ స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఇ)లో ఇది 25.64 శాతం లాభపడి 98 వద్ద నిలిచింది. మదుపరులను ఆకట్టుకోవడంతో ఐడియా సెల్యులార్ మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే 7,257.41 కోట్ల రూపాయలు ఎగిసి 35,278.55 కోట్ల రూపాయలకు చేరింది. ఈ విలీనంతో జియో దూకుడుకు బ్రేకులు పడతాయన్న అంచనాల మధ్య భారతీ ఎయిర్టెల్ షేర్లకూ లాభించింది. బిఎస్ఇలో 7.48 శాతం, ఎన్ఎస్ఇలో 7 శాతం చొప్పున ఆ సంస్థ షేర్ల విలువ పెరిగింది. దీంతో సంస్థ షేర్ విలువ 347.65-346.40 రూపాయల వద్ద ముగిసింది.