బిజినెస్

జూలై 1నే అమల్లోకి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి/హైదరాబాద్, జూన్ 13: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) జూలై 1 నుంచి అమలవుతుందని, వాయిదాపడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తేల్చిచెప్పింది. ఈ చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానం సవ్యంగా అమలయ్యేందుకు కావాల్సిన చర్యలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయని నొక్కిచెప్పింది. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి రాదన్న పుకార్లు వినిపిస్తుండటంతో దీనిపై స్పందించింది మోదీ సర్కారు. అలాంటి వాటిని నమ్మొద్దని కుండ బద్దలు కొట్టింది. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని కొందరు జిఎస్‌టి అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా సైతం నెల రోజులపాటు జిఎస్‌టిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జిఎస్‌టి అమలుపై అనుమానాలు, వదంతులు చేలరేగగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘ఈ ఏడాది జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు (సిబిఇసి) సమన్వయంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు జిఎస్‌టిపై అవగాహన కల్పిస్తున్నాం. వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాం.’ అని ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జిఎస్‌టి అమలుపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎవరూ కూడా మరెవరినీ ఈ విషయంలో తప్పుదోవపట్టించరాదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన జిఎస్‌టి మండలి ఇప్పటికే 1,200లకుపైగా వస్తువులపై, 500ల సర్వీసులపై జిఎస్‌టి రేటును నిర్ణయించింది కూడా. ఈ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. 5, 12, 18, 28 శ్లాబుల్లో అన్నింటికీ పన్ను వేశారు. వీటిపై కొన్ని రంగాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సదరు పన్నులను మళ్లీ తగ్గించారు. ఇంకొన్నింటికి పన్ను మినహాయింపులిచ్చారు. అయితే బంగారం పై మాత్రం ప్రత్యేకంగా 3 శాతం పన్ను విధించారు.
1 నుంచి జిఎస్‌టికి తెలంగాణ సిద్ధం
జూలై 1 నుంచి జిఎస్‌టి అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రెవిన్యూ కార్యదర్శి సోమేశ్ కుమార్ పిటిఐకి తెలిపారు. జిఎస్‌టి అమలును వాయిదా వేయాలని తాము కేంద్రాన్ని అడగలేదన్నారు. ఇప్పటికే 80 శాతం జిఎస్‌టిలోకి మారామన్నారు. త్వరలోనే మిగతా 20 శాతం కూడా పూర్తవుతుందని, వచ్చే నెల 1 నుంచి నూతన పరోక్ష పన్నుల విధానం ప్రకారం పన్ను వసూళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు.
పొగాకును మినహాయించాలి
ముడి పొగాకుపై 5 శాతం జిఎస్‌టి వద్దని, దీనికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇతర పంటల మాదిరిగానే పొగాకుపైనా పన్ను వేయరాదన్నాయి. జిఎస్‌టి పన్నుతో పొగాకు ధరలు పడిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల నష్టపోయేది రైతులేనన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులు పొగాకు వేలం కేంద్రాల్లో లావాదేవీలను నిలిపివేశారని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఎఐఎఫ్‌ఎ) ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నెల 18న జిఎస్‌టి కౌన్సిల్ మరోసారి సమావేశమవుతున్నందున అందులో తమ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరింది. 18న లాటరీ పన్నులు, ఈ-వే బిల్లు అంశాలను జిఎస్‌టి కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోనుంది. ‘పొగాకు పంటపై విధించిన 5 శాతం జిఎస్‌టిని, తురిమిన, ఎండిన పొగాకుపై వేసిన 28 శాతం జిఎస్‌టిని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లోని రైతులు తమ ఉత్పత్తిని మార్కెట్లలోకి తీసుకురాకూడదని నిర్ణయించారు.’ అని ఎఫ్‌ఎఐఎఫ్‌ఎ ఉపాధ్యక్షుడు గద్దె శేషగిరిరావు తెలిపారు. పొగాకు రైతుల ఇబ్బందుల దృష్ట్యా అప్పటి చరణ్ సింగ్ ప్రభుత్వం.. ముడి పొగాకు, తురిమిన, ఎండిన పొగాకుకు సెంట్రల్ ఎక్సైజ్ పన్ను మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. పొగాకును కూడా ఇతర వ్యవసాయ పంటల్లాగే చూడాలన్నారు.
పెరగనున్న కీలక ఔషధ ధరలు
జిఎస్‌టి అమల్లోకి వస్తే చాలా రకాల కీలక ఔషధాల ధరలు పెరగనున్నాయి. మిక్కిలి ప్రధాన ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జిఎస్‌టిని విధించడంతో జూలై 1 నుంచి ఆయా ఔషధాల ధరలు 2.29 శాతం వరకు పెరిగే వీలుంది. ప్రస్తుతం వీటిపై దాదాపు 9 శాతం పన్ను మాత్రమే అమల్లో ఉంది. అయితే ఇన్సూలిన్ తదితర కొన్ని ఔషధాల ధరలు మాత్రం తగ్గనున్నాయి. ఇంతకుముందు వీటిపైనా 12 శాతం పన్నును వేయాలని ప్రతిపాదించినప్పటికీ, దాన్ని 5 శాతానికి తగ్గించారు. కాగా, జిఎస్‌టి అమలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగానే సాగగలదన్న ఆశాభావాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) చైర్మన్ భూపేంద్ర సింగ్ పిటిఐ వద్ద వ్యక్తం చేశారు. జిఎస్‌టి అమల్లోకి రానున్న క్రమంలో ఏయే ఔషధాల ధరలు ఎలా ఉంటాయన్న వివరాలను ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు. దీని ఆధారంగా ఆయా ఔషధాలపై ఎమ్‌ఆర్‌పి ధరలను మార్చేలా కంపెనీలకు సూచనలు చేశామన్నారు.
అసంతృప్తిలో ట్రాక్టర్ తయారీదారులు
ట్రాక్టర్ విడిభాగాలన్నింటిపైనా జిఎస్‌టి పన్ను రేటును తగ్గించాలని, కొన్నింటిపైనే తగ్గించడంపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు ట్రాక్టర్ తయారీదారులు. జిఎస్‌టి కారణంగా ఒక్కో ట్రాక్టర్ ఉత్పాదక వ్యయం 25,000 రూపాయల వరకు పెరుగుతోందని ట్రాక్టర్ తయారీదారుల సంఘం (టిఎమ్‌ఎ) టెక్నికల్ కమిటీ చైర్మన్ టిఆర్ కేశవన్ తెలిపారు. ఫలితంగా ట్రాక్టర్ తయారీ పరిశ్రమపై 1,600 కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. ఇంజిన్లు, ట్రాన్స్‌మిషన్లు, ఇతరత్రా కీలక భాగాలపై 28 శాతం జిఎస్‌టి ఉందని, కొన్నింటిపై మాత్రమే 18 శాతానికి తగ్గించారని టఫె చైర్మన్, సిఇఒ మల్లికా శ్రీనివాసన్ చెప్పారు. యాక్సెల్స్, సెంటర్ హౌసింగ్, ఫ్రంట్, రేర్ టైర్లు, ట్యూబులు, ఇతరత్రా ముఖ్య భాగాలపైనా పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలంటూ రెవిన్యూ శాఖను కోరారు.
చమురు, గ్యాస్ పరిశ్రమకు ప్రతికూలం
చమురు, గ్యాస్ పరిశ్రమపై జిఎస్‌టి ప్రతికూల ప్రభావం చూపనుందని ఓ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత పన్ను విధానం, జిఎస్‌టి విధానం రెండూ కూడా ఈ రంగానికి వర్తించనున్నాయని పేర్కొంది. కొన్ని ఉత్పత్తులు జిఎస్‌టి పరిధిలో లేకపోవడం, మరికొన్నింటికి జిఎస్‌టి వర్తించడమే ఇందుకు కారణమని ఐసిఆర్‌ఎ-అసోచామ్ సంయు క్త నివేదిక పేర్కొంది. ముడి చమురు, సహజ వాయువు, మోటార్ ఇంధనం, హై-స్పీడ్ డీజిల్, విమానయాన ఇంధనాలకు జిఎస్‌టి వర్తించదని, ప్రస్తుత పన్ను విధానమే ఉంటుందని సదరు నివేదిక తెలిపింది. అయితే వంటగ్యాస్ (ఎల్‌పిజి), నాఫ్తా, కిరోసిన్, ఇతరత్రా చమురు ఇంధనాలకు జిఎస్‌టి వర్తిస్తుందని చెప్పింది. దీంతో రెండు రకాల పన్నుల మధ్య చమురు, గ్యాస్ పరిశ్రమ ఇబ్బందులకు గురయ్యే వీలుందంది.
రిటైల్ దిగ్గజాల సమావేశం
మరోవైపు దేశీయ రిటైల్ మార్కెటింగ్ దిగ్గజాలన్నీ సమావేశమయ్యాయి. జిఎస్‌టి అమలు క్రమంలో ధరల విధానం, లాభాలు, ఇతరత్రా అంశాలపై ఫ్యూచర్ గ్రూప్, ట్రెంట్ హైపర్‌సిటి, డిమార్ట్, ఆదిత్యా బిర్లా రిటైల్ తదితర పనె్నండుకుపైగా సంస్థలు మంగళవారం ముంబయిలో చర్చించాయి. భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్‌ఎఐ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై పన్ను విషయంలో స్పష్టత ఇవ్వాలన్న పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించారు. ఇదిలావుంటే ధరలను పెంచకుండా, అలాగే లాభాలు తగ్గకుండా నిర్ణయాలను తీసుకుంటున్నామని, వినియోగదారులపై భారం పడకుండా చూస్తామని ఫ్యూచర్ గ్రూప్ సిఇఒ కిశోర్ బియాని చెప్పారు. 2 నుంచి 20 శాతం మేర ఆయా ఉత్పత్తులపై ధరలను తగ్గించనున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టి అమలుపై పుకార్లు నెలకొన్న నేపథ్యంలో తమకున్న సమాచారం మేరకు జూలై 1 నుంచే జిఎస్‌టి అమలవుతుందని ట్రెంట్ హైపర్‌సిటి ఎండి జంషేడ్ దబూ అన్నారు.
ఇదిలావుంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించి జిఎస్‌టి పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల చిన్న, మధ్యతరహా సంస్థల వృద్ధికి దోహదపడినట్లైందని భారతీయ వస్త్ర పరిశ్రమ సమాఖ్య చైర్మన్ జె తులసిధరన్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు భంగం కలగకుండా ప్రభుత్వ నిర్ణయముండటంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే జిఎస్‌టి నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారైన ఈయన్ను మూడేళ్లకుగాను జిఎస్‌టిఎన్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా మంగళవారం నియమించింది కేంద్రం.