బిజినెస్
నాలుగో రోజూ నష్టాలే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/19b5_2.jpg?itok=PjKmZPKo)
ముంబయి: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తోడు ప్రపంచ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో మదుపరులు అమ్మకాలకు పూనుకోవడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ 300 పాయింట్లు పడిపోయి, కీలకమయిన 35వేల పాయింట్ల స్థాయికి దిగువన 34,848.30 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 10,600 పాయింట్ల స్థాయికి దిగువన ముగిసింది. విదేశీ ఫండ్ల పెట్టుబడుల ఉపసంహరణ నిరాటంకంగా కొనసాగడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో యెడ్యూరప్ప ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంటుందో, లేదో అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మదుపరులు శుక్రవారం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారని బ్రోకర్లు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ కీలక సూచీలు పడిపోవడం వరుసగా ఇది నాలుగో సెషన్. సెనె్సక్స్ శుక్రవారం దిగువ స్థాయి వద్ద ప్రారంభమయి, సెషన్లో ఎక్కువ భాగం ప్రతికూల ధోరణిలోనే కొనసాగింది. ఒక దశలో ఇంట్రా-డేలో 34,821.62 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 300.82 పాయింట్ల (0.86 శాతం) దిగువన 34,848.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు సెషన్లలో కలిసి 407.59 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 86.30 పాయింట్ల (0.81 శాతం) దిగువన 10,596.40 పాయింట్ల వద్ద ముగిసింది.
అంతకు ముందు ఈ సూచీ 10,589.10- 10,674.95 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, ఈ వారంలో సెనె్సక్స్ 687.49 పాయింట్లు (1.93 శాతం) పడిపోగా, నిఫ్టీ 210.10 పాయింట్లు (1.94 శాతం) పడిపోయింది. మార్చి తొమ్మిదితో ముగిసిన వారం నుంచి ఇప్పటి వరకు ఒక వారంలో దేశీయ మార్కెట్ సూచీలు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి.
మొండి బకాయిల కారణంగా నాలుగో త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలహాబాద్ బ్యాంక్, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ల విలువ 4.67 శాతం వరకు పడిపోయింది. సెనె్సక్స్ ప్యాక్లోని ఎల్అండ్టీ అత్యధికంగా 3.54 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 3.21 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థలలో సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో, మారుతి సుజుకి, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, అదాని పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 3.21 శాతం వరకు పడిపోయింది. అయితే, మరోవైపు హెచ్యూఎల్, కోటక్ బ్యాంక్, ఇండస్బ్యాంక్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, టీసీఎస్, యెస్ బ్యాంక్ షేర్ల విలువ పెరిగింది.