మెయిన్ ఫీచర్

భావితరాలకు వెలుగుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేద పిల్లల పాలిట విద్యాదాయని ‘దీపాలయ’

హర్యానాలోని సోలాపట్టి అనే ముస్లిం గ్రామంలో మతం మచ్చుకైనా లేదు. మనసున్న మంచి మనుషులంతా వాళ్ల దృష్టిలో దేవుళ్లు. మానవత్వమే వారు నమ్మే మతం. సర్వమత సమైక్య సహజీవనం ప్రతిబింబిస్తుంది. ముస్లిం ఆధిపత్యం ఎక్కువగా వుండే ఆ ఊరిలో ఓ హిందూ హెడ్‌మాస్టర్, ఓ క్రిస్టియన్ హాస్టల్ వార్డెన్ కలిసి చేసిన కృషి భావితరాల తల రాతనే మార్చింది.
హర్యానాలోని సోలాపట్టికి వెళ్లాలంటే మనెసర్ కొండలు ఎక్కి దిగాలి. చుట్టూ పచ్చని వాతావరణం. చెట్లు, పొలాలు, పక్షుల కిలాకిలారావాలు. మధ్యలో ఎర్రటి ఇటుకలతో కట్టిన చిన్న బడి. అడుగు పెట్టగానే పిల్లలు వల్లెవేస్తున్న ఎక్కాలు. పద్యాలతో సందడి సందడిగా అనిపిస్తుంది. 14 ఏళ్లకే పెళ్లి అనే ఊబిలో దిగకుండా హాయిగా చదువుకుంటున్న షహీన్. 15 సంవత్సరాలు వచ్చినా పొలం తప్ప పలకా బలపడం తెలియని తాహిల్. ఇలా ఎందరో చిన్నారులు అక్షరాలు అనే వెలుగుదారిలో నడుస్తున్నారు.
మొదట్లో ఎంత కష్టమైందంటే..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే! నడుస్తున్నకొద్దీ దారులు అవే పరచుకుంటాయి. దీపాలయ విషయంలో అదే జరిగింది. మొదట్లో పిల్లలను బడిదాకా తీసుకురావడమే గగనమయ్యేది. తల్లిదండ్రులను ఒప్పించడం తలకు మించిన భారం. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగేవారు. అయినా ఒప్పుకునేవారు కాదు. ఇలా అయితే లాభం లేదని చదువు గురించి ప్రాక్టికల్‌గా వివరించడం మొదలుపెట్టారు. మీ పిల్లాడిని కనీసం డ్రైవర్‌గా చూడాలనుకున్నా 8వ తరగతి పాస్ కావాలి! ఒక ఫ్యాక్టరీలో వర్కర్‌గా పనిచేయాలన్నా కనీస అర్హత పది పాస్ కావాలి. ఇలా చెప్పేవారు. నయాన్నో భయాన్నో ఒప్పించేవారు. అలా పిల్లలంతా ఇప్పుడు బడి బాట పట్టారు. అబ్బాయిల విషయంలో అయితే ఏవో తంటాలు పడి ఒప్పిస్తారు. కానీ అమ్మాయిల విషయంలోనే కొంచెం కష్టం. ఆడపిల్ల చదువుకుంటే తలబిరుసుగా ప్రవర్తిస్తుందని అక్కడి గ్రామస్తుల పిచ్చి నమ్మకం. అదొక్కటే కాదు. అమ్మాయి చదువుకుంటే తమకు నచ్చిన అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుంటుందట! ఆడవాళ్లంటే వాళ్ల దృష్టిలో వినయంగా మసలుకుని చెప్పినవాడితో తాళి కట్టించుకుని ఒక భార్యగా భర్త అడుగుజాడల్లో జీవితాంతం మెదలాలి. ఇదే సోనాపట్టి గ్రామ ప్రజల సిద్ధాంతం. ఈ స్థాయిలో అభిప్రాయాలున్నవారిని ఒప్పించాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఊహించండి! అయినాసరే దీపాలయ వెనకడుగు వేయలేదు.
కో-ఎడ్యుకేషన్ కష్టాలు
ఒప్పుకున్నారు సరే! కాని మగపిల్లలతో కలిసి అమ్మాయిలు పాఠాలు చదవడం, మగపిల్లలతో కలిసి స్కూల్‌కి రావడం అంటే మాత్రం ససేమిరా అన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు పక్కపక్కన కూచోడానికే ఇష్టపడలేదు. అక్కా చెల్లీ అని మాత్రమే పిలవాలని రూలు పెట్టారు. ఆ షరతుమీదనే అమ్మాయిల్ని బడికి పంపారు. తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే దీపాలయకు వున్న మూడు బస్సుల్లో ఒకదాన్ని బాలికలకోసం కేటాయించారు. అన్నట్టు నెల ఫీజు కూడా చాలా తక్కువ. అమ్మాయిలకు 75 రూపాయలు, అబ్బాయిలకు 225.
అభిప్రాయాలు మారుతున్నాయి
అక్కడ ఇప్పుడిప్పుడే వాతావరణం, అభిప్రాయాలు మారిపోతున్నాయి. గ్రామస్తులు టీచర్, పేరంట్ మీటింగ్‌కు హాజరవుతున్నారు. గత నెలలో 81 మంది స్కూల్‌కు వచ్చారు. మొత్తం 1103 మంది పిల్లలుంటే కేవలం 81 మంది రావడం తక్కువే అయినా అదే గొప్ప. ఈ 81 మందిలో కూడా చాలామంది ఫీజుల గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చినవారే. అయినా అదీ శుభపరిణామమే. తల్లిదండ్రులు స్కూల్ మెట్లు ఎక్కడమంటే మంచిదేకదా. ప్రస్తుతం స్కూల్లో బాలబాలికల నిష్పత్తి 60:40. ప్రతి యేటా స్కూల్ ఫీజుల రూపంలో 12 లక్షల రూపాయలు వస్తున్నా.. ఖర్చు మాత్రం 70 లక్షలకు పైమాటే. విరాళాలతో నెట్టుకొస్తున్నామని హెడ్‌మాస్టర్ అంటున్నారు.
అనాథల కోసం హాస్టల్ వసతి
ఇంటి నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, అనాథల కోసం స్కూల్‌కు అటాచ్‌గా ఓ హాస్టల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. దానికి వార్డెన్ జాన్ రమేశన్. అతనొక క్రిస్టియన్, భార్య పిల్లలంతా అదే హాస్టల్‌లో వుంటారు. ఇలా ఒక క్రిస్టియన్ హాస్టల్ వార్డెన్, హిందూ స్కూల్ హెడ్‌మాస్టర్ కలిసి ముస్లిం ఆధిపత్యం కలిగిన క్లస్టర్‌లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమంటే, ఇక్కడ ఎవరూ మతం గురించి మాట్లాడరు. క్రిస్టియన్లమని, హిందువులమని ముస్లింలమని ఎవరికీ చెప్పరు.
మానవత్వమనే మతం, మంచి మనుషులే దేవుళ్లు. దేశంలో అసహనం మీద చర్చోపచర్చలు, దాడులు కూడా జరిగాయి. కానీ సోలాపట్టిలో మాత్రం గంగా జమునా సంస్కృతి కనిపిస్తుంది. పరస్పరం సహకరించుకుని జీవించే విధానం అబ్బుర పరుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. దీపాలయ వాలంటీర్లు సాధించిన ఈ విజయం ఊహకందనిది. అసలు గెలుపు అంటే వారు చెప్పే నిర్వచనమే వేరు. దీపాలయ దృక్పథం అలాంటిది.

దీపాలయ 1979లో ప్రారంభమైంది. ఐఎస్‌ఓ-9001-2008 సర్టిఫైడ్ ఎన్జీవో సంస్థ. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రాజెక్టులు ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ యూపిలలో వున్నాయి. ఇప్పటివరకు 2,70,000 మంది పేద చిన్నారులకు విద్యను అందించింది. పేద పిల్లల పాలిట విద్యాదాయినిగా మారిన ఈ సంస్థకు విరాళాలు అందించాలనుకున్నా, వాలంటీర్‌గా పని చేయాలనుకున్నా- sponsorachild....deepalaya.org, resource...deepalaya.org వెభ్‌సైట్‌లో సంప్రదిస్తే చాలు.