రాష్ట్రీయం
‘కిడ్నాప్’లో కొత్త మలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 31: అరకు ఎంపి కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావు కిడ్నాప్, విడుదల ఉదంతం గురువారం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే తనను ఆరు గంటలు బంధించి గచ్చిబౌలిలోని తన ఐదెకరాల భూమి పత్రాలపై సంతకం చేయించుకున్నారని రామకోటేశ్వర రావు చేసిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు బిల్డర్ రామకృష్ణ, తలసాని కొడుకు సాయియాదవ్పై ఐపిసి సెక్షన్ 348, 384 కింద కేసు నమోదు చేసినట్టు పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు.
రామకోటేశ్వర రావు డ్రామా: తలసాని
రామకోటేశ్వర రావు కిడ్నాప్తో తన కుమారుడు సాయియాదవ్కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బిజెనెస్ డెవలప్మెంట్ డీల్లో తన కుమారుడి హస్తం ఉందనడం అవాస్తమని తేల్చి చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడిన తలసాని తన కుమారుడు, బిల్డర్ రామకృష్ణ, దానం నాగేందర్ స్నేహితులని, వ్యాపారంలో భాగస్వాములు మాత్రమేనన్నారు. ఈ ప్రాజెక్టులో తాము రూ.13 కోట్లు పెట్టుబడి పెట్టామని, డబ్బు ఇవ్వకుండా రామకోటేశ్వర రావు డ్రామా అడుతున్నాడని అన్నారు. తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రామకోటేశ్వర రావు మోసగాడని, అతనిపై బ్యాంకు ఫ్రాడ్ కేసులు అనేకం ఉన్నాయని, సిబిఐ కేసుల్లో ఆయన తమకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. 2013 నుంచి ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడ్డామని, తమవద్ద ఉన్న అన్ని ఆధారాలు త్వరలో బయటపెడతానన్నారు.
ఇలావుండగా, గచ్చిబౌలిలోని తనకు చెందిన ఐదెకరాల స్థలానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో చర్చిద్దామని పిలిచి దస్తావేజులు లాక్కున్నారని ఎంపి గీత భర్త కొత్తపల్లి రామకోటేశ్వరరావు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ నిర్మాణ సంస్థకు చెందిన రామకృష్ణ, మంత్రి తలసాని కుమారుడు సాయియాదవ్ తనను హోటల్ నుంచి వెళ్లనీయకుండా అడ్డుపడ్డారని, వ్యాపారులతో చర్చిస్తుండగానే ఓ వాహనంలో తీసుకెళ్లారని ఆరోపించారు. బలవంతంగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకొని బుధవారం అర్ధరాత్రి దాటాక కొండాపూర్ ప్రాంతంలో విడిచి వెళ్లిపోయారని తెలిపారు. ఆర్ఆర్ సంస్థ యజమాని, సాయియాదవ్పై చర్య తీసుకోవాలని కోరుతూ పంజగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆయన వివరించారు.
అసలు ఏం జరిగిందంటే..
అరకు ఎంపి కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు గచ్చిబౌలిలో సుమారు రూ. 75 కోట్లు విలువచేసే ఐదెకరాల స్థలం ఉంది. 2012లో ఆ స్థలాన్ని ఆర్ఆర్ నిర్మాణ సంస్థ యజమాని రామకృష్ణ, సుధాకర్ రావుతోపాటు మరికొందరికి డెవలప్మెంట్కోసం ఇచ్చారు. కాగా ఏళ్లు గడుస్తున్నా డెవలప్మెంట్ జాడ లేకపోవడంతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ స్థలంపై పెట్టుబడి పెట్టిన కొందరు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆర్ఆర్ నిర్మాణ సంస్థ యజమానిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఐదెకరాల స్థలం తనకు ఇవ్వాలని నిర్మాణ సంస్థలోని కొందరు రామకోటేశ్వర రావును బుధవారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్కు తీసుకెళ్లి చర్చలు జరిపారు. ఆరుగంటల పాటు జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఆయన చేత బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. అప్పటికే ఎంపి గీత పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానంతో డ్రైవర్కు ఫోన్ చేయగా జరిగిన విషయం తెలిసింది. ఈ మేరకు ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో తాను సురక్షితంగా ఉన్నట్టు, కొండాపూర్వద్ద తనను వదిలి వెళ్లినట్టు రామకోటేశ్వర రావు తన భార్యకు ఫోన్ చేశారు. అప్పటికే పోలీసులు ఎంపి గీత ఇంటికి చేరుకున్నారు.రామకోటేశ్వరరావు ఇంటికి రాగానే పోలీసులు జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
చిత్రం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్