ఆంధ్రప్రదేశ్
సీఎంఓనా? పార్టీ ఆఫీసా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూన్ 28: అది ఏపీ ముఖ్యమంత్రి అధికార కార్యాలయం. ప్రభుత్వానికి సంబంధించి కీలక చర్చలు, నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ కేంద్రం. అక్కడ పార్టీపరమైన కార్యకలాపాలు చేయడం నిషిద్ధం. కానీ, సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాటిని ఉల్లంఘించి మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా, అడ్డుకోవలసిన సమాచార శాఖ స్వయంగా సదరు ఎమ్మెల్యేల మీడియా భేటీకి రావాలని సందేశాలు పంపిస్తున్న వైచిత్రి ఇది.
విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రచారం ఇచ్చే వేదికగా మారుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టే గేటు లోపల సమాచారశాఖ మీడియా రూమును ఏర్పాటుచేసింది. సహజంగా మంత్రులు అక్కడ మీడియాతో భేటీ అయి, ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడిస్తుంటారు. సిఎం తన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసే వివిధ వ్యక్తులు ఇచ్చే వినతి పత్రాలను మీడియాకు ఇక్కడే చేరవేస్తారు. కానీ కాపు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి, క్యాంపు కార్యాలయం టిడిపి కార్యాలయంగా మారిందన్న విమర్శలు పెరిగినా, సమాచారశాఖ దానిని పట్టించుకోవడం లేదు. కాపు ఉద్యమ సమయంలో టిడిపికి చెందిన కాపు ఎమ్మెల్యేలంతా, ప్రతిరోజూ సీఎంఓలోని మీడియా సెంటర్లోనే సమావేశం నిర్వహించి, ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం, ఆయనను మద్దతునిస్తోన్న ఇతర పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. బిజెపి-టిడిపి మధ్య మాటల యుద్ధానికి సైతం సీఎంఓ మీడియా సెంటర్ వేదికయింది. పోనీ టిడిపి ఎమ్మెల్యేలు మీడియా సెంటర్లో విలేకరుల సమావేశాలు నిర్వహించినప్పుడు, గోడమీద ఉన్న సమాచారశాఖ బ్యానర్పై స్టిక్కరు కూడా అంటించాలన్న స్పృహ సమాచారశాఖ అధికారులకు కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలు ప్రభుత్వ అధికార కేంద్రంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రెస్కాన్ఫరెన్సును అడ్డుకోవలసిన అధికారులే, ఫలానా సమయంలో పార్టీ ఎమ్మెల్యే మీడియా సమావేశం ఉందంటూ ఎస్ఎంఎస్ సందేశాలు పంపించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మంగళవారం విజయవాడ టిడిపి ఎమ్మెల్యే జలీల్ఖాన్ క్యాంపు ఆఫీసులోని మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం ఉందని, పబ్లిసిటీ సెల్ నుంచే అధికారిక సందేశాలు రావడం విస్మయం కలిగస్తోంది. మరో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారని జలీల్ఖాన్ అక్కడ మీడియాకు వెల్లడించారు. విజయవాడలో పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ, దానిని వినియోగించుకోకుండా, సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే, పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్లు పెడితే ఎవరూ రావడం లేదని, క్యాంపు ఆఫీసులోనయితే అంతా ఉంటారు కాబట్టి అక్కడ పెట్టాల్సి వస్తోందని, ఈ పరిస్థితి మరో రెండు నెలలు ఉంటుందని, వెలగపూడికి వెళ్లాక అంతా సర్దుకుంటుందని ఓ ప్రముఖుడు అసలు విషయం వెల్లడించారు.
విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయం