ఆంధ్రప్రదేశ్‌

శరవేగంగా అమరావతి నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 26: వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమరావతి నగర నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఇప్పుడున్న వేగం సరిపోదని, ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిన పనులు చురుగ్గా జరిగేలా చూడాలని సిఆర్‌డిఎ అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణలతో కలిసి అమరావతి నగర నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పరిపాలన నగర నిర్మాణంతోనే అసలు పనులు ఆరంభం అవుతాయని, గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంతో రాజధాని నిర్మాణానికి ఒక ఊపు, రూపు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇకనుంచి ప్రతి సమావేశంలోను రెండు జిల్లాల కలెక్టర్లు, పురపాలక సంఘాల వారు, సంబంధిత శాఖల అధికారులు, ముఖ్యులందరినీ భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలే కాకుండా సిఆర్‌డిఎ పరిధిలోని అన్ని గ్రామాలు, పురపాలక సంఘాల పరిధిలో సమాంతరంగా అభివృద్ధి పనులు జరిగిన నాడే మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ‘టార్గెట్ 2018’ అనే కానె్సప్ట్‌తో కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ల్యాబ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడానికి ఈ ప్రణాళికను రూపొందించినట్టు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ వివరించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక, గ్రావెల్, ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటి నిమిత్తం సమీపంలో వున్న వనరులను వినియోగించుకోవడం ద్వారా రూ.3వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా వేసినట్టు శ్రీ్ధర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పెద్దఎత్తున అవసరమయ్యే ఇసుక కోసం సమీపంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని గుర్తించామని తెలిపారు. ఈ ఇసుకను ఇక్కడే పూర్తిస్థాయిలో నిల్వ చేసి ఉంచాలని, ఇతరులు తరలించుకుపోకుండా సిఆర్‌డిఎ తన నియంత్రణలో ఉంచుకోవాలని సిఎం సూచించారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు జరపడం ద్వారా నదీ సామర్థ్యం కూడా పెంచుకునే వీలుందని జల వనరులశాఖ అధికారి సూచించగా, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని సిఎం సూచించారు. గ్రావెల్ కోసం సమీపంలో అనుకూలంగా ఉన్న కొండను తవ్వుకోవచ్చునని చెప్పారు. పెద్దఎత్తున అవసరమయ్యే సిమెంట్ కోసం రాజధానికి దగ్గరలోనే ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సిరామిక్ సిటీ ఏర్పాటు కోసం గుజరాత్ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇలా భవన నిర్మాణ సామాగ్రి తయారీ కోసం ఇక్కడే ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఇటుక తయారీ కోసం ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ నుంచి వచ్చే ఫ్లైయాష్‌ను ఉపయోగించుకోవచ్చునని అధికారులు సూచించగా, స్థానికంగానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారినుంచే కొనుగోలు చేద్దామని ముఖ్యమంత్రి చెప్పారు.
భవిష్యత్తులో ఎవరూ కూడా వాస్తు సక్రమంగా లేదంటూ భవంతులు కూల్చకుండా వాస్తు నిపుణులతో ఒక కమిటీ వేసి సలహాలు తీసుకుందామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఇవతల ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉన్నదని, అవతలివైపు కొండపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. టిటిడి ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ సారథ్యంలో కృష్ణుడి మందిరం నిర్మాణం అవుతాయని, వీటితో పాటు మసీదు, చర్చిల నిర్మాణం కూడా చేపట్టి అన్నివర్గాల వారికి అమరావతి దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దుదామని చెప్పారు.
అమరావతిలో పది ఎకరాలలో హస్తకళల గ్రామం ఏర్పాటుకు కొంతమంది మహిళలు ముందుకొచ్చారని సిఎం చెప్పారు. రాజధానిలో నిర్మించే అన్ని భవంతులు, కట్టడాలకు ఏకరూపత వుండేలా చూడాలని సూచించారు. సమావేశంలో విట్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు అమరావతిలో నిర్మాణం గావించే తమ క్యాంపస్ భవన నిర్మాణానికి సంబంధించిన యానిమేషన్ చిత్రాన్ని ప్రదర్శించారు. భూముల కొనుగోలుకు సంబంధించిన రూ.50 కోట్ల చెక్‌ను విట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా సిఆర్‌డిఎ కమిషనర్‌కు అందించారు. ఈ సమావేశంలో సిఆర్‌డిఎ కార్యదర్శి అజయ్‌జైన్, రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ సంస్థ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రులు, అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు