ఆంధ్రప్రదేశ్‌

నవంబర్‌లో ప్రపంచ బోట్ రేసింగ్ చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: కృష్ణానదిలో జరగబోయే పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహణకు సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమన్వయ కమిటీ తొలి క్షేత్ర పర్యటన శుక్రవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పోటీలు నిర్వహిస్తుండగా, ఏర్పాట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో సమావేశమైన ఈ కమిటీలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ నివాస్, ఏపీటీడీసీ ఎండీ హిమాన్హు శుక్లా తదితరులు ఉన్నారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద సమావేశమైన కమిటీ విభిన్న అంశాలపై లోతుగా చర్చించింది. ఇటీవల ముఖ్యమంత్రి రాష్టస్థ్రాయిలో సమావేశం నిర్వహించి దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే క్రమంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసి శుక్రవారం క్షేత్ర సందర్శన చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమావేశమైన ఉన్నతాధికారులు నవంబర్ 16 నుంచి మూడురోజులు జరగనున్న ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30శాఖల అధికారులతో సమీక్షించారు. ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ నిర్వహణ ద్వారా ప్రపంచం దృష్టిని అమరావతి వైపు ఆకర్షింప చేయాలని సీఎం భావిస్తున్నారని, ఈ క్రమంలో ప్రతి విభాగం నుండి తాము సహకారం ఆశిస్తున్నామని పర్యాటక కార్యదర్శి మీనా సమావేశం దృష్టికి తెచ్చారు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ జలాశయం వేదికగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు గాను ఒక్కో జట్టు నుంచి 50 సభ్యుల చొప్పున 500 మంది జల క్రీడాకారులు వస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని, వీఐపీ, వీవీఐపీలు, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చినవారు, మీడియా ఇలా ఎవరికి వారికి ప్రత్యేక గ్యాలరీలు నిర్మిస్తామన్నారు. నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న తొలి ప్రపంచ స్థాయి జలక్రీడల పోటీలను అంతా మెచ్చేలా ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారని మీనా తెలిపారు.
పోటీలు జరిగే విధానం, రేస్ ట్రాక్‌కు సంబంధించిన అంశాలను శుక్లా సమావేశంలో వివరించారు. ప్రధానంగా గ్యాలరీల ఏర్పాటుకు సంబంధించి సమావేశం నిశితంగా చర్చించింది. నది ఒడ్డుకు నిర్మాణ సామగ్రి తరలించాలని నిర్ణయించారు.
మరోవైపు రహదారులను అందంగా తీర్చిదిద్దాలని, అవాంతరాలను తొలగించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీపై ఎందరు నిలబడవచ్చు, దాని సామర్థ్యం ఎంత అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖకు సూచించారు. నది వెంబడి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న స్థలాలను కూడా వినియోగించుకోవాలని, అక్కడ నిర్వహిస్తున్న సర్కస్‌ను త్వరితగతిన ముగించేలా చూడాలని నిర్ణయించారు. నగర సుందరీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ నివాస్ తెలపగా, జిల్లా యంత్రాంగం అంతటినీ అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆహ్వానాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయించింది. నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ అంతర్జాతీయ బోట్ రేసర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ విభాగానికి అందజేయాలని, తద్వారా తాము వారికి పూర్తిస్థాయి రక్షణకు కల్పించగలుగుతామన్నారు. సమావేశంలో కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ, జాయింట్ కలెక్టర్ బాబూరావు, శిల్పారామం ప్రత్యేకాధికారి జయరాజ్, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మన ఘనమైన వారసత్వ గొప్పతనాన్ని ప్రతిబింబింపచేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, జలవనరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడురోజుల కార్యగోష్టి నిర్వహిస్తున్నామని మీనా తెలిపారు. శిల్పారామం నేతృత్వంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, వీటన్నింటికీ అవసరమైన స్థలాలను నిర్ణయించాల్సి ఉందని ఆయన వివరించారు.
ముందుజాగ్రత్త చర్యగా గ్రీన్ ఛానల్
బోట్ రేసింగ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించటంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఐదు నిముషాల వ్యవధికి మించకుండా అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి బాధితులు చేరాలంటే గ్రీన్ ఛానల్ ఆవశ్యకత ఉంటుందని, ఇందుకు పోలీస్ విభాగం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని మీనా తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు వివరించారు.
మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ పరంగా పూర్తిస్థాయి పరికరాలతో అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం రెండుచోట్ల ఎమర్జెన్సీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.