తెలంగాణ

‘ఈచ్ వన్.. టీచ్ వన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ఈచ్ వన్...టీచ్ వన్’ నినాదంతో వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రతిన పూనాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రతి చదువుకున్న వ్యక్తీ నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యునిగా మార్చాలని అన్నారు. తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్‌ను స్వీకరించాలని సీఎం పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షల సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భావించి కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే అనేక అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువడం గర్వకారణమని అన్నారు. సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు.
‘ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ గొప్ప విజయాలు సాధించింది. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినప్పటికీ ఏ మాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే సామార్ధ్యాన్ని రాష్ట్రం సాధించింది. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్‌లో మరింత పురోగమిస్తుంది. మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొట్ట తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథలాంటి పథకాన్ని తీసుకరావాలని మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది మనందరికి గర్వకారణం. సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలిగాం. ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వందశాతం అందుతాయి. రాష్ట్రం సుభిక్షం అవుతోంది. తెలంగాణ నేల నుంచి కరువును శాశ్వతంగా పారద్రోలగలగడం సాధ్యమవుతుంది. ప్రజా సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవన భద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో దూసుకుపోతున్నాం’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.
‘అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడటం ఒక మచ్చగా మిగిలింది. గత పాలకులు అందరినీ అక్షరాస్యులుగా మార్చడంలో విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని అధిగమించాలి. ప్రతీ ఒక్కరూ నూతన సంవత్సరంలో వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్న భరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారు. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం. అదే విధమైన స్ఫూర్తితో వందశాతం అక్షరాస్యత సాధించడానికి కృషి చేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
గవర్నర్, మంత్రుల శుభాకాంక్షలు
2020 నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్ తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
'చిత్రం...ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు